మహబూబ్నగర్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చదువుకునేందుకు పేదరికం అడ్డొచ్చిన దశ నుంచి దేశంలోనే అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీ స్థాయికి ఎదిగిన విజయ గాధ ఇది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని (ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లా) మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అంచెలంచెలుగా ఎదిగి ఎస్బీఐ ఎండీగా అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకును నడిపిస్తున్నారు. పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన లక్ష్మీదేవమ్మ, లింగయ్య శెట్టి దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నలుగురిలో చివరివాడైన శ్రీనివాసులు శెట్టి సొంతూరులో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివాడు. 8వ తరగతి చదివేందుకు గద్వాల పట్టణానికి వెళ్లి పేదరికం కారణంగా బంధువులు మిత్రుల సాయంతో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ సీటు రావడంతో ఆయన దశ తిరిగింది. ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్ సహకారంతో అగ్రికల్చర్ పూర్తి చేసిన తర్వాత 1990లో ఎస్బీఐ పీవోగా కష్టపడి ఉద్యోగం సాధించారు. గుజరాత్లోని బరోడాలో తొలి కొలువులో ప్రారంభించిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. 2003 నుంచి 2007 వరకు ఏజీఎం ముంబయిలో పని చేశారు.
ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా 2007 నుంచి 2011 వరకు కొనసాగారు. ఆ తర్వాత డీజీఎం, జీఎం, సీజీఎం పదవులు పొందారు. అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద బ్యాంకుకు ఎండీ స్థాయికి చేరుకున్నారు. నమ్ముకున్న, ఇష్టమైన రంగంలో కష్టపడితే అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని శ్రీనివాసులు నిరూపించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాంక్ ఎండీ స్థాయికి చేరుకున్న మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఓ సాధారణ పల్లెటూరుకు చెందిన నిరుపేద విద్యార్థి ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎండీగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 22,219 బ్రాంచీలు, సుమారు 32 దేశాల్లో సేవలు, 2 లక్షల 50 వేల మందికిపైగా ఉద్యోగులతో సేవలందిస్తున్న ఎస్బీఐ చైర్మన్గా ప్రస్తుతం దినేశ్కుమార్ ఖారా ఉండగా తర్వాత స్థానమైన ఎండీ స్థానంలో శ్రీనివాసులు శెట్టి ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ పదవీ విరమణ తర్వాత చైర్మన్గా మన పాలమూరు బిడ్డకు అవకాశం దక్కే అవకాశం ఉన్నది.
సీఎస్ఆర్ కింద తన వంతు సేవ
పుట్టిన ఊరుకు తన వంతు సేవ చేసేందుకు శ్రీనివాసులు సిద్ధమయ్యారు. సోమవారం పెద్దపోతుల పాడు గ్రామంలో సీఎస్ఆర్ కింద మొబైల్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించేందుకు ఆయన గ్రామానికి రానున్నారు. అలాగే తాను విద్యనభ్యసించిన గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు సీఎస్ఆర్ కింద తన వంతు సేవలు అందించేందుకు శ్రీనివాసులు ముందుకొచ్చారు. సైన్స్ ల్యాబ్కు కావాల్సిన పరికరాలు, కంప్యూటర్ ల్యాబ్, ప్రొజెక్టర్ అందించారు. ఇవాళ జరిగే ఓ కార్యక్రమంలో సందర్భంగా వీటిని ఆయన ప్రారంభించనున్నారు. తాను చదువుకున్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో కాసేపు మాట్లాడనున్నారు.
కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు
చల్లా శ్రీనివాసులు శెట్టి నా ఇంటర్ క్లాస్మేట్. చదువుకునే సమయం లో పేదరికం అడ్డొచ్చినా ఏనాడు వెనుదిరిగి చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగి నేడు దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎండీగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్బీఐ ఎండీ ఈ స్థాయికి చేరిన వ్యక్తి మన ప్రాంతానికే చెందిన వాడు కావడం గర్వకారణం. కష్టపడితే అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చని చెప్పేందుకు జిల్లా శ్రీనివాసులు శెట్టి ఒక ఉదాహరణ.