ఉపాధి కోసం వెళ్లిన పాలమూరు జిల్లాకు చెందిన ఐదుగురు విగతజీవులయ్యారు. హైదరాబాద్లోఆటోడ్రైవర్లుగా ఉన్న వారంతా డబ్బు గిట్టుబాటు కావడం లేదని.. మరింత సంపాదించేందుకు బీహార్కు వెళ్లారు. అక్కడి నుంచి క్రమం తప్పకుండా వారి కుటుంబీకులతో మాట్లాడేవారు. ఏమైందో ఏమో కానీ ఐదుగురు ఒకే రోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. అండగా ఉండే వారు ఇలా విగతజీవులుగా మారారని వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే వీరు మృతి చెందిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్నగర్, జనవరి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరుకు చెందిన ఐదుగురు యువకులు బీహార్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చోటుచేసుకున్నది. స్థానికులు, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పోలీసుల కథనం మేరకు.. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మీట్యా తండా, గుబ్బడి తండా, నక్కలబండతండాకు చెందిన నలుగురు యువకులు, వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం కొత్తపల్లి తండాకు చెందిన మరో యువకుడు అనుమానాస్పద స్థితిలో బీహార్ రాజధాని పాట్నాలో మృతిందారు. ఈ మేరకు అక్కడి పోలీసులు మృతుల బంధువులకు సమాచారం అందించారు. అయితే పాట్నాకు వీరంతా ఎందుకోసం వెళ్లారనే అంశంపై వారి బంధువులు సరైన సమాచారం ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మృతుల తరఫు బంధువు ఒకరు పాట్నా వెళ్లినట్లు సమాచారం. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మిట్యాతండాకు చెందిన వెంకటేశ్ (22), గుబ్బడితండా వినోద్ (21), మరో యువకుడు (23) పాట్నాలో చనిపోయినట్లు స్థానికులకు సమాచారం అందింది.
నక్కలబండా తండా శ్రీను(22) వెంటిలేటర్పై ఉన్నాడని మొదట సమాచారం అందించారని, ఆ తర్వాత చనిపోయినట్లు బీహార్ పోలీసులు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం కొత్తపల్లితండాకు చెందిన అవినాష్ నాయక్(24) పాట్నాలో ఓ రైలులో చనిపోయిన స్థితిలో అక్కడి పోలీసులు గమనించి సమాచారం వారి బంధువులకు తెలిపారు. గతంలో హైదరాబాద్ హఫీజ్పేట పరిధిలో ఆటోడ్రైవర్లుగా పనిచేసే వారని సమాచారం. వీరంతా మెరుగైన ఉపాధి కోసం పాట్నా వెళ్లారని వారి బంధువులు చెబుతున్నారు. పాట్నాలో ఆల్కాహాల్ సేవించి మృతిచెందినట్లుగా అక్కడి పోలీసులు సమాచారం అందించారని… పోస్ట్మార్టం తర్వాత పూర్తి వివరాలు చెప్తామన్నారని భూత్పూర్ సీఐ రజిత ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. ఈ యువకులంతా ఏం పని చేసేందుకు పాట్నా వెళ్లారనే అంశంపై కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాచారం రావడం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీలో చేసేందుకు వెళ్లారని కొందరు చెబుతున్నట్లుగా ఆమె వెల్లడించారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధి నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా అనేక మంది బిహార్ వెళ్లినట్లు తెలుస్తోందని కొందరు వెల్లడించారు. వీరంతా అక్కడి సైబర్ క్రైం ముఠాల చేతిలో ఏమైనా బంధీలు అయ్యారేమో అనే అనుమానాలను సైతం స్థానికులు వెల్లడిస్తున్నారు.
ఆటోలో గిట్టుబాటు కావడం లేదని..
ఖిల్లాఘణపురం మండలం కొత్తపల్లితండాకు చెందిన అవినాశ్నాయక్ (24) హైదరాబాద్లో ఆటో నడిపేవాడు. ఇటీవలే 4 నెలల కిందట బాగా సంపాదించుకువస్తానని తల్లితో మాట్లాడి బీహార్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక క్రమంతప్పకుండా తల్లి, సోదరునితో ఫోన్లో మాట్లాడేవాడు. సోమవారం ఉదయం తన సోదరుడికి ఫోన్ చేసి డబ్బులు పంపమని కోరాడు. హైదరాబాద్ వచ్చేందుకు డబ్బులు లేవని రూ.2 వేలు పంపించమని అడిగాడు. డబ్బులు పంపించేందుకు సోమవారం సాయంత్రం ఫోన్ చేస్తే అవినాశ్ ఫోన్ స్విచ్ఛాప్ అని వచ్చింది. తర్వాత గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి రైల్వే డబ్బాలో అవినాష్ చనిపోయాడని తెలిపారు. నాలుగు నెలల పాటు పనిచేసిన వాడు డబ్బులు లేవని అడగడంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మృతదేహం ఫొటోలు పంపించారు. మృతదేహాన్ని తీసుకుపోయేందుకు రాకుంటే ఇక్కడే అంత్యక్రియలు చేస్తామని బీహార్ పోలీసులు అన్నట్లు మృతుడి బంధువులు వెల్లడించారని స్థానికులు తెలిపారు.
తిరిగిరాని లోకాలకు..
గత నెల 25న తర్వాత వీరిలో భుత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నక్కలబండా తండాకు చెందిన శ్రీను, మరికొందరు పాట్నా వెళ్లారని స్థానికులు తెలిపారు. ఉపాధి నిమిత్తం వీరంతా పాట్నా వెళ్లారని వివరించారు. తిరిగి వచ్చే సమయంలో విందు ఏర్పాటు చేశారని… విందు తర్వాత అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని తెలుస్తోందని వెల్లడించారు. పాట్నాలోని టీఎంసీహెచ్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అక్కడి పోలీసులు వెల్లడించినట్లు వివరించారు.అయితే వీరిపై ఏమైన విష ప్రయోగం జరిగిందా… లేక నాటుసారా ప్రభావం వల్ల చనిపోయారా లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అని వీరి బంధువులు, తండా వాసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుల తరఫు బంధువులు తమకు పూర్తి వివరాలు తెలియచేస్తే అక్కడి పోలీసులతో మాట్లాడి విచారణ జరిపేందుకు అవకాశం ఉంటుందని భూత్పూర్ సీఐ రజిత తెలిపారు. మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు తమ పోలీసులను మృతుల బంధువులతో పాటు పాట్నాకు పంపిస్తామని సీఐ వివరించారు.