వడ్లు కొనుగోలు చేయాల్సిందే..
రైతు సంక్షేమానికి సర్కార్ పెద్దపీట
ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ పథకాలు
మినీ ట్యాంక్బండ్గా కోడూరు చెరువు
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
వరిని కొనుగోలు చేయాల్సిందే..
రైతు సంక్షేమానికి సర్కార్ పెద్దపీట
కోడూరు చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతాం
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ రూరల్, మార్చి 27 : రాష్ట్రాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కేంద్రం కోనుగోలు చేసి ఆహార భద్రత కల్పించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కోడూరులో ముదిరాజ్, గౌడ కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, వరదరాజ స్వామి ఆలయ కమాన్ను, కోడూరు-మనికొండ రోడ్డు రెన్యూవల్ పనులను, మాచన్పల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. రాంచంద్రాపూర్-రాయిచూర్ రోడ్డు వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోడూరులో జరిగిన గ్రామసభలో సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరవగా.. ఆయన సమక్షంలోనే రాష్ట్రంలో రైతులు పండించిన వరిని పంజాబ్ మాదిరిగానే కేంద్రమే కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. ఇందుకు రైతులు, గ్రామస్తులు మద్దతు ప్రకటిచి తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంజాబ్లో మాదిరిగానే రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని మోదీ సర్కారే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం నుంచి ఏర్పాటైన చట్ట ప్రకారం భారత ఆహార సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. ఈ విషయం రాజ్యాంగంలో రాసి ఉన్నదన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. ఉచితంగా నిరంతర విద్యుత్ అందించడంతోపాటు సాగనీరు పుష్కలంగా ఉందన్నారు. అందుకే రాష్ట్రంలోని రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నారని తెలిపారు. దేశానికి అవసరమైన వరిలో సగం తెలంగాణలో పండుతున్నదని చెప్పారు. అందుకే ఇక్కడి ధాన్యపు ప్రతి గింజనూ కొనాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు.. వచ్చాక జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. నేడు ఎక్కడ చూసినా పచ్చని పంటలే కనిపిస్తున్నాయని, అందుకే భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలో రైతుబంధు కింద రూ.10.40 కోట్లు ఇచ్చామన్నారు. రైతుబీమా కింద రూ.8.6 కోట్లు అందించామన్నారు. ఆడబిడ్డలున్న నిరుపేద తల్లిదండ్రులకు కొండంత అండగా నిలిచిందని వివరించారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందించామన్నారు. కులవృత్తులకు చేయూతనిచ్చినట్లు తెలిపారు. కోడూరుకు విశిష్ట చరిత్ర ఉన్నదని, గ్రామ యువత, పెద్దలు చైతన్యవంతం కావాలన్నారు. భవిష్యత్లో మండల కేంద్రంగా మారుస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు పథకంలో గ్రామానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కోడూరు చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కర్వెన రిజర్వాయర్ పూర్తయితే కృష్ణా జలాలతో గ్రామ చెరువును నింపుతామని స్పష్టం చేశారు. మన్యంకొండ స్టేజీ వద్ద రూ.15 కోట్లతో హోటల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ మాట్లాడారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, వైస్ ఎంపీపీ అనిత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ రాజేశ్వర్, ఆంజనేయులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.