మహబూబ్నగర్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కొత్త సచివాలయం పక్కనే ట్యాంక్బండ్ వద్ద 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలిపారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నేతలు, దళిత సంఘాల నేతలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. జై అంబేద్కర్, జైజై కేసీఆర్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగా నిర్మించే సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రాత్మకమన్నారు.
సీఎం కేసీఆర్కు శిరస్సు వంచి మంత్రి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరుపెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. మోదీ సర్కార్ పార్లమెంట్ భవనానికి బీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఈ ఆలోచన చేయాలని, వారు కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని కోరారు. అణగారిన దళిత వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేసిన అంబేద్కర్ను శాశ్వతంగా గుర్తుంచుకోవడం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నారు. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆనాటి కట్టడాలు అద్భుతం
మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 15: టెక్నాలజీ ఏ మాత్రం లేని ఆ కాలంలో నిర్మించిన కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిలో భాగంగా ఇంజినీర్స్డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కేక్కట్ చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, ఇంజినీర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.