మహబూబ్నగర్ జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టారని, గతంలో ఆయన తండ్రి వైఎస్సార్ అక్రమంగా పోతిరెడ్డిపాడు నిర్మించి కృష్ణానీటిని తరలించుకుపోయారని రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. జలచౌర్యంలో రాజశేఖర్రెడ్డి దొంగ అయితే, ఆయన కుమారుడు సీఎం జగన్ గజదొంగ అని ఘాటుగా విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి (కేసీఆర్నగర్)లో 1,024 డబుల్ బెడ్రూం గృహప్రవేశ కార్యక్రమానికి మంగళవారం ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డబుల్ బెడ్రూం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో వేముల మాట్లాడారు. తెలంగాణ బద్ధ వ్యతిరేకి వైఎస్సార్ అక్రమంగా పోతిరెడ్డిపాడు నుంచి 40వేల క్యూసెక్కులు దోచుకుపోయారని.. దీనికి నిరసనగా అప్పటి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్కు చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేస్తే.. జిల్లాకు చెందిన ఓ మహిళా కాంగ్రెస్ మంత్రి వైఎస్ నీటిని తరలించుకుపోతుంటే హారతులు పట్టిందన్నారు. కేవలం 1500 క్యూసెక్కుల అనుమతి ఉంటే 40వేల క్యూ సెక్కులను అక్రమంగా తరలించుకుపోయేందుకు వైఎస్సార్ కారణమని ప్రశాంత్రెడ్డి అన్నారు.
ఇప్పుడు ఆయన కొడుకు అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడి కాల్వ ద్వా రా నీటి చౌర్యానికి దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. తాము పనులు చేపట్టడం లేదంటూ గ్రీన్ ట్రిబ్యునల్కు లేఖ రాస్తూనే దొంగతనంగా పనులు చేపడుతున్నారని మంత్రి తెలిపారు. జలచౌర్యంలో తండ్రి దొంగ అయితే కొడుకు గజ దొంగ అని వేముల దుయ్యబట్టారు. ఇప్పటికైనా పోయేదేమీలేదని రాయలసీమ, ఆర్డీఎస్ రైట్ కెనాల్ వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు నీటి హక్కును రక్షించుకోవాలన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేని పక్షంలో ప్రజాయుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. అర్హులైన పేదలు సొంత స్థలం ఉండే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కొందరు కుక్కల తీరున మొరుగుతున్నారని, వారి పాలన ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ లాంటి పథకాలు చేపడుతున్నారా.? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. తమపై లేనిపోని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు వారు పాలిస్తున్న 27రాష్ర్టాల్లో తెలంగాణ కంటే ఒక్క రూపాయి ఎక్కువ వేతనాలు ఇస్తున్నట్లు నిరూపించినా తాను, శ్రీనివాస్గౌడ్ మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు.
తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్
తెలంగాణ కోసం పోరాటం చేయడమే కాకుండా పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఏడేండ్లలో తెలంగాణ దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఒకప్పుడు వ్యవసాయం అంటే దండుగ అని ఇప్పుడు పండుగ అని సీఎం కేసీఆర్ నిరూపించారన్నారు. పాలమూరు పట్టణంలో రెండు వారాలకు ఓసారి తాగునీరు వచ్చే సమైక్య పాలనలో ఇప్పుడు నిత్యం మిషన్భగీరథ స్వచ్ఛ జలాలు వస్తున్నాయని ఎంపీ అన్నారు. డబుల్ బెడ్రూం గృహప్రవేశాల అనంతరం నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్డును మంత్రులు వేముల, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్, అడిషనల్ కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, సర్పంచ్ జరీనాబేగం, ఎంపీటీసీ అనిత, నాయకులు ఇంతియాజ్, చెరుకుపల్లి రాజేశ్వర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
అన్యాయం జరిగితే ..సీఎం కేసీఆర్ సహించరు
పాలమూరుకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ సహించరని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఏం చేయాలో సీఎం కేసీఆర్కు తెలుసన్నారు. ఆంధ్ర పాలకులు ఒక ఎత్తు వేస్తే కేసీఆర్ పది ఎత్తులు వేస్తారన్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కలిసికట్టుగా నిలిచి ఆంధ్ర ఎత్తులను చిత్తు చేస్తామని తెలిపారు. దివిటిపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు భవిష్యత్లో మంచి డిమాండ్ ఉంటదన్నారు. సమీపంలోనే మెడికల్ కాలేజీ, ఐటీ పార్కు, 44వ జాతీయ రహదారి, త్వరలోనే జిల్లా జైలు సైతం ఏర్పాటు కానున్నదన్నారు. అర్హులైన పేదలకు దశలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామన్నారు. గతంలో 10లక్షల ఇండ్లు కట్టామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, నిజంగా కట్టి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్లు అవసరమయ్యేవా అని మంత్రి ప్రశ్నించారు. అన్ని వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించి పేదలకు అందిస్తున్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంకా పూర్తి కాకముందే పాలమూరులో భారీగా ధాన్యం పండుతున్నదని, త్వరలో పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ధాన్యరాశులు పండుతాయన్నారు. డబుల్ బెడ్రూం కాలనీకి ఓ వైపు కర్వెన, మరోవైపు ఉదండాపూర్ రిజర్వాయర్లు నిర్మాణమవుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ఆశీస్సులతో పాలమూరు రూపురేఖలు మారుస్తామన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపై ఉండి ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే కేటీఆర్ ఐటీ పార్కు ప్రారంభిస్తామని, అక్కడే రూ.వెయ్యి కోట్లతో గ్రీన్ కోకంపెనీ త్వరలో పనులు ప్రారంభిస్తుందన్నారు. తన ధ్యాస, శ్వాస ఉమ్మడి మహబూబ్నగర్ అభివృద్ధి చేయడమేనని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.