నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ
యాసంగిలో విధానంలోనే అమలు
కరోనా కష్టకాలంలోనూ అండగా..
ఏడోసారి రైతుబంధు అందిస్తున్న సీఎం కేసీఆర్
ఉమ్మడి జిల్లాలోని 9,47,260 మంది రైతులకు రూ.1231.31 కోట్ల సాయం
మహబూబ్నగర్ జూన్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నేటి నుంచి అన్నదాతకు పంట సాయం అందనున్నది. రైతుల మొబైల్ ఫోన్లకు డబ్బులు సాయం అందినట్లు మెసేజులూ రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 9,47,260 మంది రైతులకు 24.63 లక్షల ఎకరాలకు గాను రూ.1231.31 కోట్ల మేర రైతుబంధు సాయం ఖాతాల్లో జమ కానున్నది. కరోనా వల్ల ప్రపంచమే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా… రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉన్నా… ప్రభుత్వం మాత్రం అన్నదాతకు అండగా నిలిచింది.
వ్యవస్థలన్నీ కునారిల్లిన తరుణంలో దేశాలకు దేశాలే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇలాంటి సంకట స్థితిలోనూ తెలంగాణ సర్కారు మాత్రం అన్నదాత వెంటే నడుస్తున్నది. వానాకాలం రైతుబంధు పెట్టుబడి నేటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. గతంలో ఉన్న నిబంధనల మేరకే రైతుల ఖాతాల్లో కేటగిరీల వారీగా రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. ఇవాళ ఒక ఎకరా, రేపు రెండు ఎకరాలు, తర్వాత 3 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు ముందుగా రైతుబంధు సాయం అకౌంట్లలో జమ కానుంది. గత యాసంగిలో అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అధికారులు పాటించనున్నారు. జూన్ 10వ తేదీ వరకు ధరణి పోర్టల్లో నమోదై ఉన్న ఖాతాల్లో మాత్రమే నేటి నుంచి డబ్బులు జమ చేయనున్నారు. మరోవైపు పలు జాతీయ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారినా.. ఈ సారికి మాత్రం పాత ఖాతాల ప్రాతిపదికనే రైతుబంధు సాయం జమ కానుంది.
కేవలం 10 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి..
నేటి నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత యాసంగిలో అవలంభించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంభిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. గత యాసంగిలో ఇచ్చిన కాటగిరీల వారిగానే రైతు బంధు ఆర్థిక సాయాన్ని (తక్కువ మొత్తం అమౌంట్ వచ్చే రైతులకు ముందు) ఖాతాలో వేయనున్నారు.
దీనివల్ల చిన్నసన్నకారు రైతులకు మొదట ఖాతాల్లో పెట్టుబడి జమ కానుంది. మిగతా వారికి దశలవారీగా కేవలం 10 రోజుల్లో పూర్తవనుంది. గతేడాది పొందిన రైతులతోపాటు కొత్తగా అర్హులైన వారిని ఈ జాబితాలో చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. రైతుబంధుకు అర్హత సాధించేందుకు కాగా జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 10వ ఆ తేదీ వరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులకు సైతం జూన్ 10 లోపు నిబంధనే వర్తించనుంది. ఈసారి ధరణి ద్వారా జరిగిన భూ విక్రయాలు, పార్ట్ బి కేసుల పరిష్కారాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 29760 మంది కొత్త రైతులకు రైతుబంధు సాయం పొందేందుకు అర్హత సాధించారు.
విలీన బ్యాంకుల ఇబ్బందేమీ లేదు
బ్యాంకుల విలీనం వల్ల ఖాతానెంబర్లు మారకపోయినా ఐఎఫ్ఎస్సీ కోడ్ మాత్రం మారుతుందని మొదట పలు బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ దఫా రైతుబంధు సాయం మాత్రం అన్ని పాత బ్యాంకు ఖాతానెంబర్ల ప్రకారమే చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వల్ల ఇబ్బంది పడిన పలువురు రైతులు బ్యాంకులకు వెళ్లి ఖాతావివరాలు అప్ డేట్ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. అదీగాక బ్యాంకర్లు ఈ నెలాఖరు వరకు పాత వివరాలతోనే లావాదేవీలకు అవకాశం కల్పించారు. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండానే రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ కానున్నది.