తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది. దళారీల ద్వారా ఎమ్మెల్యేలకు వందల కోట్ల రూపాయలు ఎరజూపి దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించిన దొంగలు దొరికిపోయారు. కేంద్రం గవర్నర్ల ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేక ఆటంకాలు కల్పిస్తూ అధికార పార్టీ నాయకుల ఆస్తులపై, ఇండ్లపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు కొనసాగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నది.
రాష్ట్రాభివృద్ధికి న్యాయంగా ఇవ్వాల్సిన ఏ ఒక్కటీ ఇవ్వకపోగా కేంద్రం అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నది. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం, అందు లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెప్తున్నా తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. ఖాజీపేటలో పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై తుక్కు వాదనలు చేస్తూ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చేతులెత్తేసింది. ట్రైబల్ వర్సిటీ విషయంలో కూడా గిరిజన ప్రజల ఆశలను, అవకాశాలను ఆవిరి చేసింది. పక్క రాష్ర్టాల ప్రాజెక్టులకు జాతీయహోదా ఇస్తున్నా కేంద్రం పాలమూరు-రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదంటూ తెలంగాణ రైతాంగంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నది. కేంద్రం అభివృద్ధి నిధులను, బకాయిలను విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది. షెడ్యూల్ 9, 10లోని సంస్థలను విభజించకుండా రెండు రాష్ర్టాల మధ్య చిచ్చుపెడుతూ చోద్యం చూస్తున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.
మోదీ ప్రభుత్వం తమ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజలపై భరించలేని పన్నుల భారాన్ని మోపింది. ప్రభుత్వరంగంలో ఉన్న అనేక సంస్థలను హోల్సేల్గా బడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తున్నది. ప్రైవేటీకరణకు పూనుకొని నిరుద్యోగాన్ని పెంచుతున్నది. మరోవైపు కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిస్సిగ్గుగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ముఖ్యంగా రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వారి పొట్ట గొడుతున్నది. దేశ సంపద మొత్తం కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది. ఒకే మతం, ఒకే భాష, ఒకే ఎన్నిక, ఒకే సంస్కృతి సంప్రదాయాల పేరుతో దేశాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి పూనుకున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటిదాకా ఏ ప్రధాని అనుసరించని అప్రజాస్వామిక, అనైతిక విధానాలను పధాని మోదీ అనుసరిస్తున్నారు. ఎమర్జెన్సీని తలపించేలా ప్రధాని మోదీ నిరంకుశంగా పాలన సాగిస్తున్నారు. దీనివల్ల దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమవుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్ కోటాకు కేంద్రం గండి కొడుతున్నది. హైదరాబాద్కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టు ను రద్దుచేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరం ద్రోహం చేసింది. విదేశీ బ్యాంకులో మూలుగుతున్న బ్లాక్ మనీని వెనక్కి తెప్పిస్తానని ప్రగల్భాలు పలికిన మోదీ ఇప్పుడు నల్లధనం ఎక్కడ? అని అడిగితే తెల్లమొహం వేస్తున్నారు. ప్రతి ఒక్కరి జన్ధన్ ఖాతాలో ధన్ ధన్మంటూ రూ.15 లక్షలు వేస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో నిస్సిగ్గుగా అదంతా జుమ్లా అని కొట్టి పారేస్తున్నారు. దేశ చరిత్రలో ఇది అతిపెద్ద ఎన్నికల మోసం. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్ట కొట్టడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించడం విషాదం. కేంద్రం వారిపై కేసులు పెట్టించింది. రైతు ఉద్యమకారులపై కారు నడిపించి చంపేసింది. ఈ పోరాటంలో 750 మంది రైతుల ప్రాణాలు బలిగొన్నది. చివరికి తెచ్చిన నల్ల చట్టాలను ఏడ్చుకుంటూ వెనక్కితీసుకొని మద్దతు ధర చట్టం తీసుకురాకుండా రైతులకు అన్యాయం చేస్తున్నది.
మోదీ ప్రభుత్వ అసమర్థ, ఆర్థిక విధానాల ఫలితం గా డాలర్తో రూపాయి మారకం విలువ రూ.83కు పడిపోయింది. దీంతో ఆర్థికవ్యవస్థ అతలాకుతలమవుతున్నది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లకు బైబై చెప్పి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ‘మేకిన్ ఇండియా’ అట్టర్ఫ్లాపయింది. దేశం అప్పుల కుప్పగా తయారైంది. 67 ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ.55.80 లక్షల కోట్లు అయితే మోదీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు అక్షరాల రూ.80 లక్షల కోట్లు. ఇప్పుడు దేశం మొత్తం అప్పు రూ.135 లక్షల కోట్లకు చేరుకున్నది. అయినప్పటికీ అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంకు దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకున్నది. చుట్టూ ఉన్న దేశాలకంటే ఘోరంగా పడిపోయింది. మోదీ సర్కార్ వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని, నెలనెలా రైతులు కరెంటు బిల్లులు కట్టాల్సిందేనని వారి మెడ మీద కత్తిపెట్టి బెదిరిస్తున్నది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని ఆదేశిస్తున్నది. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు పెద్ద ఎత్తున నిరసిస్తున్నారు. తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వ వివక్ష, కక్షసాధింపు చర్యలను తిప్పికొట్టడానికి ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ముం దుకు రావాలి.
(వ్యాసకర్త: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు)
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిస్సిగ్గుగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ముఖ్యంగా రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వారి పొట్ట గొడుతున్నది. దేశ సంపద మొత్తం కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది.
జూలకంటి రంగారెడ్డి