తన కలంతో, గళంతో ఏకకాలంలో అంటరానితనంపై పోరు సలిపిన తొలి తరం దళిత కవి కుసుమ ధర్మన్న. సంఘసంస్కరణ అభిలాష కలిగిన ఆయన అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొందారు. కందుకూరి వీరేశలింగం ద్వారా ప్రభావితమయ్యారు. ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అంటూ నినదించిన ఆయన జాతిని మేల్కొల్పే దిశగా ఎన్నో రచనలు చేశారు. నిమ్న జాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం వంటివి ఆయన కలం నుంచి జాలువారినవే.
Kusuma Dharmanna | ప్రముఖ సాహిత్య కేంద్రమైన రాజమహేంద్రవరమే కుసుమ ధర్మన్న స్వస్థలం. కుసుమ నాగమ్మ, వీరస్వామి దంపతులకు 1900 మార్చి 17న ధర్మన్న జన్మించారు. జాతీయోద్యమ కాలంలో దళితుల కోసం పొలికేక వేసిన ధీశాలి కుసుమ ధర్మన్న. తన జీవితాన్ని ఇటు దేశానికి, అటు దళిత జాతికి అంకితం చేసిన ధర్మన్న 45 ఏండ్లకే దివికెగిశారు. సాంఘిక, సాంస్కృతిక, సాహితీ రంగాలపై కుసుమ ధర్మన్న వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. బహుముఖీనమైన ధర్మన్న ప్రతిభ ప్రధానంగా ఐదు మార్గాల్లో విస్తరించింది.
వైద్యరంగం, సాహిత్య సృజన, కళా రంగం, పత్రిక నిర్వహణ, వక్తృత్వం. వీటితో ధర్మన్న ఆనాటి ఆంధ్రా సమాజాన్ని, ముఖ్యంగా దళిత జాతిని ఉత్తేజపరిచారు. పేద దళితులకు సేవ చేసిన ఆయన ప్రజా వైద్యుడిగానూ పేరొందారు. ఆధునిక ప్రజా వాగ్గేయకారుడైన ధర్మన్న తొలి రోజుల్లో గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అనంతరం దళిత జాతి విముక్తి కోసం అంబేద్కర్ బాటలో నడిచారు. ఆయన సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే జయభేరి పత్రికను స్థాపించి తొలి దళిత సంపాదకుడిగా గుర్తింపు పొందారు. అనేక అఖిలాంధ్ర మహాసభల్లో పాల్గొన్న ధర్మన్న ఆలోచనాత్మక, ఉద్వేగపూరిత ప్రసంగాలతో ఎందరినో ఉద్యమం వైపు నడిపించారు.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కవిగా, రచయితగా కుసుమ ధర్మన్న స్థానం అద్వితీయమైనది. దళిత పోరాట చరిత్రలోనూ ఆయనకు ఆయనే సాటి. అందుకే ధర్మన్న ఆశయాలను, ఆలోచనలను, ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక సేవను, సమతావాదాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. తన రచనల రూపంలో దళిత జాతి సంర క్షకుడిగా ధర్మన్న ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు.