1949 నవంబర్ 26న రాజ్యాంగసభ రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి జనవరి 26వ తేదీని ‘గణతంత్ర దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. అయితే 2015 నుంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఇది శుభపరిణామమే అయినప్పటికీ ఈ రోజును కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, రాజ్యాంగాన్ని వాస్తవిక దృక్పథంతో పరిశీలించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయిన సందర్భంగా అమృతోత్సవాలను జరుపుకొంటున్న వేళ మన రాజ్యాంగం గురించి, దాని బలాలు, బలహీనతల గురించి లోతైన అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది.
స్వాతంత్య్ర సమరంలో కీలక భూమిక పోషించిన యోధులు, మేధావులు సుదీర్ఘంగా చర్చించి మన రాజ్యాంగాన్ని రూపొం దించారు. వారు బ్రిటిష్ పాలనలో మనకు ఎలాంటి హక్కులు లేకపోవటం వాటి మీద ఎక్కువ దృష్టిసారించారు. ప్రాథమిక హక్కుల జాబితాను పొందుపరిచారు. ప్రభుత్వం వల్ల హక్కులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్లే హక్కును కల్పించారు. కోర్టు ప్రమేయంతో ప్రజల హక్కులకు రక్షణ కలుగుతుందని ఆశించారు. అందుకే మన వ్యవస్థలో కోర్టును ఆశ్రయించటం ఒక ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, పౌరులు హైకోర్టుకు వెళ్లాలి. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని భావిస్తే హైకోర్టే తొలిమెట్టు. సుప్రీంకోర్టు మలి మెట్టు. ఎంతమంది హై కోర్టును, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించే స్థితిలో ఉన్నారు?
ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకొనే చర్యలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ చర్యలు చెల్లవని చెప్తున్నది రాజ్యాంగం. అంటే పేదల ఎదుగుదలకు, సంక్షేమానికి ఈ హక్కులు అడ్డుగోడలా నిలువకూడదని అర్థం. ఈ హక్కు లు కొందరికి వరమైతే, పేదలకు శాపమని భావించటంలో తప్పు లేదు. కోర్టులు కూడా హక్కులకు పెద్దపీట వేశాయి. అందుకు కారణం కోర్టుల అధికారాలు కూడా ప్రాథమిక హక్కుల ద్వారా వచ్చినవే కాబట్టి. ఎక్కువమంది ప్రజలు పేదరికంలో ఉన్న మన దేశంలో కోర్టుల్లో ఎక్కువ కేసులు ఆస్తికి సంబంధించినవే ఉండటం విడ్డూరం. లక్షల కేసులు పేరుకుపోవటానికి ముఖ్య కారణం ఆస్తి ప్రాథమిక హక్కు కావటం. ప్రభుత్వాలు తీసుకునే అభివృద్ధి, సంక్షేమ చర్యలు చాలావరకు ఆస్తి హక్కుకు భంగం కలిగించేవిగా ఉండేవి. కోర్టు ఏనాడూ ఆస్తి ప్రాథమిక హక్కుగా ఉండవ లసిన అవసరం లేదని చెప్పలేదు. 1977లో పార్లమెంటే ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది. కోర్టులు ఎప్పుడో చెయ్యాల్సిన ఆ పనిని పార్లమెంటు చేసింది.
మన రాజ్యాంగం నేటి అవసరాలకు అనుగుణంగా ఉందా, లేదా అన్న విషయాన్ని గమనించాలి. గత 72 ఏండ్లలో మన రాజ్యాంగానికి పలుమార్లు సవరణలు చేసుకున్నాం. ఏ శాసనమైనా కాలానికనుగుణంగా మారవలసిందే. కానీ మార్పు ఎక్కడినుంచి రావాలన్నదే ప్రధాన ప్రశ్న. రాజ్యాంగ సవరణ కేంద్రంలో పాలకపక్షం నుంచే నా లేక ప్రజల నుంచి కూడానా? రాష్ర్టాలు ప్రతిపాదించే చట్ట సవరణల మీద కేంద్రం నుంచి స్పందన ఉండదు. ఆందోళన కలిగించే మరో అంశమేమంటే సమాఖ్యస్ఫూర్తికి గండికొట్టే విధానం. మన రాజ్యాంగం కేంద్రాన్ని చాలా బలోపేతం చేస్తూ రాష్ర్టాలను బలహీన పరిచేదిగా ఉండటం. ఆ రోజు జాతి నిర్మాణానికి బలమైన కేంద్రం అవసరమని భావించి ఉండవచ్చు, కానీ నేడు ప్రాంతీయ ఆశలు, ఆశయాలు ప్రతిబించించేలా రాజ్యాంగం లేదు. ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక భాష, అనే నినాదాలు భిన్నత్వస్ఫూర్తిని నిర్వీర్యం చేసేలా ఉన్నా యి. రాష్ర్టాల హక్కులను నీరుగార్చేలా ఉన్నాయి. రేపు ఒక దేశం, ఒక వాతావరణం అనే నినాదం వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
సమాఖ్యస్ఫూర్తికే తూట్లు పొడుస్తున్న మరో ధోరణి నేటి గవర్నర్ల వ్యవహారం. గవర్నర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారటం ఆందోళన కలిగించే ముఖ్యమైన అంశాల్లో ఒకటి. గవర్నర్లను నియమించేటప్పుడు రాష్ర్టాలను సంప్రదించే సంప్రదాయం లేదు. అసలు గవర్నర్లుగా ఎవరిని నియమించవచ్చు అనే దాని మీద కూడా రాజ్యాం గం మౌనంగా ఉంది. 35 ఏండ్లు నిండి ఉండాలన్నదే గానీ ఇతరత్రా ఏమీ వివరించలేదు. ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నియమించిన గవర్నర్లకు మధ్య వివాదాలు నడుస్తున్నా యి. కేంద్రంలో రాష్ట్రంలో పాలక పార్టీలు వేరైన ప్పుడు ఈ వివాదాలు తలెత్తడం గమనార్హం. ఈ మధ్యకాలంలో మనకు నూతన రాజ్యాంగం కావాలనే డిమాండ్ తెరమీదకు వస్తున్నది. ప్రస్తుత రాజ్యాంగం మన అవసరాలకు అనుగుణంగా లేదనిపించినప్పుడు కొత్త రాజ్యాంగం కావాలని కోరటంలో తప్పు లేదు. అది మనకు రాజ్యాంగమే ప్రసాదించిన ప్రాథమిక హక్కు.
(నేడు రాజ్యాంగ దినోత్సవం)
గుమ్మడిదల రంగారావు