సాహిత్యం అంటే సమాజానికి హితం చేసేది. ఏ దేశంలోనైతే సాహిత్యం పరిఢవిల్లుతుందో ఆ దేశంలో సమాజం విజ్ఞానదాయకంగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ముఖ్యంగా ఎక్కడైతే బాలసాహిత్యానికి పెద్దపీట వేయబడుతుందో భవిష్యత్తులో అక్కడ మంచి విలువలతో కూడిన సమాజం ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. నేటి బాలల సాహిత్యమే రేపటి భవిష్యత్తు సాహిత్యం. ఒక మంచి విత్తనం నాటకుండా మంచి ఫలాలను ఆశించలేం. అందుకే పిల్లలను అన్నివిధాలా తీర్చిదిద్దటంలో అందమైన భవిష్యత్తును నిర్మించడంలో బాల సాహిత్యం కీలకమైన పాత్ర వహిస్తున్నది.
బాల సాహిత్యంచరిత్ర, తీరుతెన్నులు కనుక పరిశీలించినట్లయితే మనదేశంలో రెం డువేల యేండ్లకు పూర్వమే పంచతంత్రం, భేతాళ కథలు వంటి పిల్లల కథలు ప్రాంతీయ భాషల్లో నీతి కథలుగా గుర్తింపు పొంది ఆ తర్వాత కాలంలో సంస్కృత భాషలోకి అనువాదం పొందినట్టు పరిశోధనలు చెప్తున్నాయి. 17వ శతాబ్దం వరకూ ఐరోపాలో జాన్ లాక్, రూసో భావజాలంతో పిల్లలను ప్రత్యేకంగా చూడటం వారి ఆనం దం కోసం తగిన బాలసాహిత్యం సృష్టించడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతం లో 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కవి పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం లోని బాల్యం వర్ణనను వర్ణిస్తూ తొలిసారిగా బాలల కోసం జోల పాటలు అందించాడు. అదంతా బాల సాహిత్యంగానే పరిగణించవచ్చు. ప్రాచీన బాల సాహిత్యం అధికంగా మౌఖిక పరమైన గేయ రూ పంలో ఉండేది. పాల్కురికి సోమనాథు ని అనంతరం అనంతామాత్యుని భోజరాజీయం, కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక ప్రాచీన గ్రంథాలలో కూడా బాల సాహిత్యం ఛాయలు సందర్భానుసారంగా ప్రస్తావించబడినవి. శ్రీ నాథ మహాకవి, నాచన సోముడు , బద్దెన సుమతి శతకం, యోగి వేమారెడ్డి వేమన శతకం, తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కనిపిస్తాయి.
కాశీ మజిలీ కథలు, పంచతంత్రం కథలు, చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, భేతాళ కథలు ఆధునిక బాలసాహిత్యంలో కేంద్రబిందువులయ్యాయి. అదేవిధంగా మహాభారతం, రామాయణం, బసవ పురాణం, కేయూరబాహు చరిత్ర, పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో కూడా బాలసాహిత్యం వికాసం చెందినట్లు మనకు తెలుస్తుంది.
ఆధునిక కాలానికి వచ్చినట్లయితే ఆధునిక బాలసాహిత్యంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి, పాకాల యశోదా రెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గడియారం రామకృష్ణ శర్మ, మొదలగు వారు ఎందరో బాలల కోసం పద్యాలను, నీతి కథలను, ప్రముఖుల జీవిత చరిత్రలు తదితర అంశాలతో ప్రారంభించి తదనంతరం గొప్ప సాహితీవేత్తలుగా ఎదిగారు. ఇంకా వేదాంతసూరి, మలయశ్రీ, వాసాల నరసయ్య, పైడిమర్రి రామకృష్ణ, భూపాల్, వి ఆర్ శర్మ, చొక్కాపు వెంకటరమణ, డాక్టర్ పత్తిపాకమోహన్, పెండెం జగదీశ్వర్, బి. వేదకుమార్, బోయ జంగ య్య, వురిమల్ల సునంద, గరిపల్లి అశోక్, దాసరి వెంకటరమణ, ఉండ్రాల్ల రాజేశం,సమ్మెట ఉమాదేవి, కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి, పుప్పాల కృష్ణమూర్తి, కందేపి రాణి ప్రసాద్ ఇలా మరెందరో బాల సాహిత్యంలో కృషి చేస్తున్నారు. బాల సాహిత్యం ఒకప్పుడు పిల్లల కో సం పెద్దలు మాత్రమే రాసేది. కానీ ఇటీవల కాలం లో పిల్లలు కూడా బాల సాహిత్య రచనలు చేయ డం గమనార్హం. మన రాష్ట్రంలో బడిపిల్లల రచనలు పుస్తకాల రూపంలో రావడం ఇందుకు నిదర్శనం.
బాల సాహిత్య ప్రక్రియలు వివిధ రూపా ల్లో ఉంటాయి. పిల్లల భాషలోనే సాహి త్యం ఉండాలి. బాల సాహిత్యం కాలక్షేపానికి కాకుండా భాష నేర్చుకునేదిగా ఉండాలి. బాలసాహిత్యం రాసేటప్పుడు విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకోవాలి. బాల సాహిత్యం కథలు గేయాలు, క వితలు, కథానికలు, నాటిక లు, ఏకపాత్రలు, చిత్రకథలు, పొడు పు కథలు, వ్యాసాలు, లేఖలు, సన్నివేశాలు, సంఘటన లు, ప్రశ్నోత్తరాలు, జీవిత చరిత్రలు, పద్యాలు, సామెతలు, బుర్రకథలు, చిట్టి వ్యాసాలు, అభినయ గే యాలు వంటి వివిధ ప్రక్రియల్లో ఉంటుంది. ఈ ప్రక్రి యలన్నీ జానపదం, పౌరాణికం, వైజ్ఞానిక, దేశభక్తి, వినోదం, పర్యావరణం, భూతదయ, పండుగలు, సంస్కృతి సంప్రదాయా లు, మొదలైన అంశాలతో ఆలోచనలు రేకెత్తించే విధం గా సృజనాత్మకత ఉట్టిపడే విధంగా ఇతివృత్తాలు ఉండాలి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పిమ్మట బాల సాహిత్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అందుకు ఉదాహరణ ప్రపంచ తెలంగాణ తెలుగు మహాసభలలో రెండు రోజులపాటు బాల సాహిత్య సద స్సు, బాల కవి సమ్మేళనం నిర్వహించడం. అంతేకాకుండా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు మన చెట్టు కార్యక్రమం లో భాగంగా ఒకే రోజున వందలాది పాఠశాలల్లో వేలాది విద్యార్థులచే కథలు రాయించడం గొప్ప పరిణామం. ప్రతి పాఠశాలలో రీడింగ్ పీరియడ్ ఏర్పాటుచేసి గ్రంథాలయ పుస్తకాలు చదివించడం, వారం వా రం బాల సభలు నిర్వహించడం, బాల సాహితీవేత్తలచే వర్క్షా పులు ఏర్పాటు చేయడం ద్వారా బాల సాహిత్యం పై విద్యార్థులకు కొంతవరకు అవగాహన పెరిగింది. దాని ఫలితమే పిల్లలే సాహిత్యాన్ని సృష్టించుకుంటున్నారు. గొప్ప ఆలోచనలకు అక్షరరూపం ఇస్తున్నా రు.
పిల్లలు నేడు నేర్చుకునే దశనుండి తమను తాము మార్చుకునే దిశ వైపు పయనిస్తున్నారు. కవితలు,కథలే కాదు, శతకాలు కూడా రాస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ పాఠశాలల నుండి దా దాపు 150 బాలల పుస్తకాలు పురుడు పోసుకున్నా యి. ఇది నిజంగా గొప్ప పరిణామం. దీనికి ప్రభుత్వ పాఠశాలలు వేదిక కావ డం గొప్ప మార్పు. ఈ విధం గా బాల సాహిత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. బాలసాహిత్యం రంగుల ప్రపంచంగా మారుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం బాల సాహితీవేత్తలను కూడా మరింతగా ప్రోత్సహించాలి. ఇదంతా జరిగి తీరుతుందని ఆశిద్దాం.
(నవంబర్ 14 బాలల దినోత్సవం)
– కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి 94415 61655