అట్టడుగు వర్గాల ప్రజల్లో ఆనాడు చదువులు అంతంత మాత్రమే. సిద్దప్ప కూడా చదివింది తక్కువే. ఆనాటి సాహిత్యధార పద్యంలో సాగింది. అందుకే దాన్ని ఆశ్రయించాడు. వ్యాకరణ నియమాల్ని ఉల్లంఘించి పద్యం రాశాడు. ఆ ఎరుక ఉంది కనుకనే చదువుకున్నవాడను కాను ఆని తెలుపుకొన్నాడు. బాసర సరస్వతీమాత వరంతో ఆ మాత్రం రాయగలిగానని చెప్పుకున్నాడు. ఈ నిజాయితీయే అతణ్ణి ప్రజలకు చేరువ చేసింది. వరప్రసాదిత కవిని కనుక వరకవిని అని ప్రకటించుకున్నాడు సిద్దప్ప. జాతీయోద్యమ స్పృహ వల్ల, గాంధీజీ మూర్తిమత్వ ప్రభావం వల్ల గాంధీ టోపీ ధరించాడు. దేశభక్తిని చాటుకున్నాడు. ఫలితంగా ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. నాటి సమాజంలో నెలకొని ఉన్న మూఢాచారాలను ఖండించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించి సంస్కరణ వాదిగా నిలిచాడు.
అపార లోకజ్ఞానము, అకుంఠిత యోగదీక్ష కలిగి సామాజిక శ్రేయస్సును కాంక్షించే సిద్దప్ప, పద్యం రాయడం కోసం అనేక వస్తువులను ఎన్నుకున్నాడు. ఇచ్చ వచ్చినట్లుగా చెప్పగలిగిన చేవ ఉండటం వల్ల సూటిగా పద్యాన్ని పఠితకు చేరవేశాడు. కులవృత్తి అనుభవానికి తాత్వికతను జోడించి మానవ జీవన ప్రస్థానాన్ని విశదపరిచాడిలా.
కుమ్మరాతడు జేయు కుండలు కొన్ని/ చేయుచుండగ బోవు చేతిలోన
కొన్ని సానము మీద కొన్ని చాటున బోవు / కాలినావము కొన్ని కూలిపోవు
కొన్ని క్షేమము బొంది కొన్నాళ్ళకును బోవు/ కొన్ని భిన్నములయ్యి కొంతబోవు
కొన్ని యుర్విలో బోవు కొన్ని వనమున బోవు / కొన్ని మృతికి బోవు కొరివి నుండి
మానవులు మంచి పాత్ర మరియాద రీతి / ఐక్యమయ్యెదరు నిటుల అవని విడిచి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప / కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా కోహెడ మండలం, గుండారెడ్డి పల్లి గ్రామానికి చెందిన అనంతవరం లక్ష్మీ, పెద్ద రాజయ్యల కుమారుడు సిద్ది రామప్ప. అతడే సిద్దప్ప కవి. 1903 జూలై 9న జన్మించాడు. కులవృత్తి కుండలు చేయడం. ఆయనకు ముగ్గురు భార్యలు, ముగ్గురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. నిజాం కాలపు ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి చదివాడు. ఉర్దూతో పాటు అరబ్బీ, పార్సీ, హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషలు నేర్చుకున్నాడు. సంసార బాధ్యతల్లో ఉంటూనే గుర్రంపై గ్రామాల్లో తిరుగుతూ తను నమ్మిన అచల సిద్ధాంతాన్ని అందరికీ పంచాడు. నిజాం నిరంకుశత్వాన్ని ఖండిస్తూ ప్రజలను చైతన్య పరిచాడు. రజాకార్లు, దేశముఖుల నిజస్వరూపాన్ని విశద పరిచాడు. ఈ క్రమంలోనే కవిత్వం రాసి గోల్కొండ కవిగా ప్రసిద్ధి చెందాడు.
ఆశువుగా కవితలల్లి సామాజిక ప్రగతిని కాంక్షించాడు సిద్దప్ప. తెలంగాణ తొలి సామాజిక కవిగా కుల, మత, వర్ణ వివక్షలను ఖండించాడు. ఆలోచనల్లో హేతువు, భావాల్లో ప్రగతి, ఆచరణలో సమానత, తత్వంలో సామాజిక చింతన, బాధితుల పట్ల ప్రేమ, మూఢత్వంపై అసహనం, నిచ్చెన మెట్ల కుల సమాజం పట్ల వ్యతిరేకత, అభ్యుదయ దృక్పథం, భక్తి వైరాగ్యాలు వెరసి సారాంశంలో ప్రజల మనిషిగా బతికాడు. జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేదం, యోగ విద్యల్లో ఆయన ప్రవీణుడు. వైద్యుడిగా, పురోహితుడిగా, రచయితగా, సంస్కర్తగా, గురువుగా గుర్తింపబ డ్డాడు. వ్యక్తిగా అందరికోసం బతికాడు. అందుకే అత ని అభిమానులు, శిష్యులు సిద్దప్పను దైవసమానంగా భావించారు. మరణానంతరం ఆయన విగ్రహాన్ని స్థాపించి పూజలు చేస్తున్నారు. సిద్దప్ప కొంత కాలం చింతకుంట, ఎలగందుల, గుండారెడ్డిపల్లె, జూబ్లీనగర్, ధర్మపురి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా పని చేశారు. పన్నెండు సంవత్సరాలు యోగాభ్యాసం చేసి సాంఖ్య తారకామనస్కములు సాధించి రాజయోగిగా పేరొందినాడు.
జలస్తంభన, వాయుస్తంభన, నాడీస్తంభనలను సాధించాడు. శనిగరం చెరువులో ఒక సంవత్సరం జలస్తంభన చేసినట్లు చూసినవారు చెబుతారు. వీరు రాసిన సుమారు నలభై గ్రంథాలలో ‘శ్రీ సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని’ వీరికి మంచి పేరు తెచ్చింది. ఈ కవితా సంపుటాలు నాలుగు భాగాలు 1934 నుండి 2015 వరకు ఏటా ముద్రితమయ్యేవని తెలు స్తున్నది. ‘కాకి హంసోపాఖ్యానము’, ‘అశోక సామ్రాజ్య యక్షగానం’, ‘శివస్తుతి’, ‘విష్ణుభజనావళి’, ‘నీతిశాస్త్రం’, ‘గోవ్యాఘ్ర సంభాషణలు’, ‘బిక్కనవోలు కందార్థాలు’, ‘యాదగిరి భజనావళి’ వంటి రచనలు సిద్దప్ప చేశారు. వీరి రచనలు ఆనాడు వీధి బడుల్లో, అనంతర కాలంలో 9వ తరగతి, ఇంటర్ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా కొలువుదీరాయి. ఈ రచనలు నిత్యజీవనసత్యాలు. వేమన, వీరబ్ర హ్మం, శేషప్ప మొదలగు కవుల ప్రభావం సిద్దప్ప రచనలపై కనిపిస్తుంది. రాజీలేని స్వేచ్ఛా ప్రవృత్తి వల్ల ఇతని కవిత్వం చిరుత వలె పరుగుదీసింది. ఆ పరుగులో ఛందోభంగాలు జరిగాయి. దుష్ట సమాసాలు వెల్లివిరిశాయి. అయినా ఆ పద్యాలు ప్రజల నాలుకలపై నర్తించాయి.
భారతదేశంలో గురువుపై గల నమ్మకం, భక్తి మరెక్కడా కనపడదు. తమకు సరియైన దారి చూపుతాడని, గమ్యం చేరుస్తాడనే ఎరుకతో శిష్యులు, అభిమానులు వారిని ఆరాధించారు. సిద్దప్ప కూడా తన శిష్యు ల పట్ల అలాగే ఉండేవాడు. తమ ఆశ్రమానికి వచ్చే భక్తులు మార్గమధ్యంలో ఉండగానే వస్తున్న వా రెవరో తెలిపేవారు. కరీంనగర్కు దక్షిణాన గొప్ప జలాశయం ఏర్పడుతుందని చెప్పారు. నిజాం ప్రభు త్వం పడిపోతుందన్నారు. ప్రా ణాంతక వ్యాధులు ప్రబలుతాయన్నారు. (ఉదా: కరోనా, డెంగ్యూ, ఎయి డ్స్ మొవి). స్వయంగా తన మరణ తేదీని ప్రకటించారు.రహస్యాలు తెలు సు కోవడం, వాటి గుట్టు విప్పి చెప్పడం వల్ల ప్ర జలు ఇతడిని మహిమలు గలవాడని భావించేవారు.
సామాన్య ప్రజలే కాదు ఇతడిని నిజాం సర్కారు తోపాటు బూర్గుల రామకృష్ణారావు, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ప్రముఖులు కూడా సత్కరించారు. తెలంగాణ తొలి సమాజ వేదాంతకవి అయిన వీరు భజనలు, కీర్తనలతో పారవశ్యం చెందేవారు. సిద్దప్పను దేశగురువు అని పిలుస్తారు.
అసంబద్ధ లోక పద్ధతిని విమర్శిస్తూ చక్కటి పద్యం రాశాడు. ఇది అతని లోక పరిశీలనకు ఉదాహరణగా నిలుస్తుంది.
‘విత్తంబుగలవారి కిత్తురే కుర్చీలు పేదవారల కివరు పీట చెక్క కాలంబు నొకరీతి గడవదెల్లప్పుడు, యేనుగు దోమచే యెత్త బడద నేనే బలియుడని నిక్కుచునుంటేమి చలి చీమలును ఫణుల చంపలేదా వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప తాను చెప్పింది చేసి చూపిన ఆచరణవాది సిద్దప్ప.
మట్టి ఒకటె కుండలు వేరు
బంగార మొక్కటె సొమ్ములు వేరు
ఇనుము ఒక్కటె పనిముట్లు వేరు
అని చెప్పగలిగిన శాస్త్రీ య, శ్రామిక దృక్పథం కలిగిన సిద్దప్ప పద్యాల్లో జాషువా, కాళోజీల అడుగుజాడలు కనపడతాయి.
రాతి బొమ్మల మొదట రాశిగా అన్నంబు
తినమన్న యా రౌతు తినదురన్న
తినెడి వాడవు నీవె తీవంబు చెందేవు
కానలేవు నీలోని తిమిరములను
పేదలకు అన్నంబు పెట్టు ధైర్యంబు లేదు
గట్టు రాళ్ళకు తిండి పెట్టగలవే…. అంటాడు.
‘జ్ఞానబోధిని’ నాలుగు సంపుటాల్లో మకుటంతో కూడిన పద్యాలు ఉన్నాయి. కాని వాటిని సిద్దప్ప శతకాలుగా వెలువరించలేదు. ఇలాంటి నూతన పోకడలు ఎన్నో సిద్దప్పలో కనపడుతాయి. మకుటం లేని పద్యాలు కూడా రాసి మెప్పించాడు.
లంచముల్ దీని ఝూట పంచాయితులు జెప్పు
వంచగాండ్లకు యేమి మంచితనము
అప్పు దెచ్చుక తిని నానా దీరెనని
తప్పించి దిరుగుట ధర్మమగున
తల్లిదండ్రుల యాజ్ఞ తప్పి తిరిగినట్టి
తనయుల కది మంచితనమే యగున
పేదవాండ్లను దుఃఖపెట్టి తిరిగినట్టి
వారికి సద్గతి వచ్చునెటుల
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
పై పద్య ప్రాసంగికత నేటికీ ఔచిత్యవంతంగా ఉంది. పద్యాల్లో మాండలికాలు, ఉర్దూపదాలు పుష్కలంగా కనిపిస్తాయి. అన్ని విధాల కొత్తబాటను వేసే క్రమంలో పాత కట్టుబాట్లను పెకిలించాడు. సిద్దప్పకు సజీవ సమాధి కావాలనే కోరిక ఉండేది. ఆధునిక ప్రభుత్వాలు అందుకు అంగీకరించవు. కుటుంబ సభ్యులు, బంధువులు ఒప్పుకోలేదు. తన మరణ తేదీ ని ముందుగా ప్రకటించినా ఎవరు నమ్మలేదు. ఐనా ఆయన చెప్పిన తేదీకి భక్తులు, శిష్యులు, బంధువులు వచ్చారు. 1984 మార్చి 23న ధ్యానమగ్నులై సిద్దప్ప ప్రాణాలు విడిచారు. అది రుధిరోద్గారి సంవత్సరం ఫాల్గుణ బహుళ సప్తమి శుక్రవారం. ముందు గా నిర్మించుకున్న సమాధిలో వారిని పద్మాసనంలో కూర్చోబెట్టి విధి విధానంగా సమాధి చేశారు. ప్రతి ఫాల్గుణ బహుళ సప్తమి నాడు భక్తు లు, శిష్యులు పెద్ద యెత్తున ఆరాధనోత్సవాలు జరుపుతున్నారు. 1996లో వారి సమాధిపై విగ్రహాన్ని ఏర్పాటుచేసి చిన్నగుడిని నిర్మించారు. దేశగురువుగా ప్రసి ద్ధులైన సిద్దప్పను స్మరించుకుంటూ, ఆయన సమాధిని దర్శించుకోవటానికి ఇప్పటికీ తెలుగు రాష్ర్టాలు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు.
డా బి.వి.ఎన్.స్వామి
9247817732