Ramappa Temple | ‘రామప్ప‘కు ఆ పేరెలా వచ్చింది? ఆలయ శిల్పి పేరు మీదుగా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. ఇది నిజమేనా? ఎంతో చారిత్రకప్రాధాన్యం ఉన్న రామప్ప గుడి పేరుపై విభిన్న వాదనలు, అవగాహనలు ఉన్నాయి. అయితే దేనికైనా శాస్త్రీయ ఆధారాల వెలుగులో నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది.
కాకతీయుల కాలం నాటి వారసత్వ సంపద అయిన అతిసుందర ఆలయాన్ని ‘రామప్పగుడి’ అని సాధారణ ప్రజలు, ‘రామలింగేశ్వరాలయం’ అని పండితులు పిలుస్తున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న శిలాశాసనమేమో ‘గుద్రేశ్వరాలయం’ అని పేర్కొంది. రేచర్ల రుద్రుడు అనే కాకతీయ సేనాపతి ఈ ఆలయాన్ని తన పేర కట్టించినా ఆ పేరు ప్రజల్లో ప్రచారానికి నోచుకోలేదు. ఈ విషయమై 1930ల నాటి శేషాద్రి రమణకవుల రాతలు గమనించవలసినవి. ‘రామప్ప గుడులందలి శిల్పములను నిజాము దొరతనము వారి ‘మోడరన్ రివ్యూ’ పత్రిక వారు, ఇంక కొందరు.. పాలెంపట్టు శిల్పములని ప్రకటించిరి. శివాలయమును రామప్పగుడి యని యేల వ్యవహరింతురో నిరూపింప వీలు కలుగదు.. కారణము గోచరింపలేక అచట యనాగరకులు (చదువు రానివారు) కట్టిన శిల్పి పేరును బట్టి యీ నామమేర్పడినదని చెప్పిరి గాని యిది యంగీకరింపదగినది కాదు’ అని పేర్కొన్నారు.
దూపాటి వెంకట రమణాచార్యుల వారికి రామప్ప శాసన ప్రతిని తెమ్మని పిఠాపురం రాజా వారు యాభై రూపాయలు, కొల్లాపూరు రాజావారు యాభై రూపాయలు, మునగాల సంస్థాన దివాన్ కొమర్రాజు వేంకట లక్ష్మణరావు గారు ఇరవై రూపాయలు ఇచ్చారట. ఆయన తన బావమరిది సింగరాచార్యులను వెంటబెట్టుకొని వెళ్లి రామప్ప శాసన ప్రతిని సేకరించి, చదివి.. ‘ఆలయ చరిత్రము తెలిపే ఆ శాసనం చాలా అమూల్యమైనది’ అని రాశాడు.
ఆ అమూల్యమైన శాసనంలో ఎన్నో వివరాలున్నాయి కానీ శిల్పి పేరు ఎక్కడా లేకపోవటంతో దూపాటి వారు రామప్ప అనేది శిల్పి పేరు కాదని నిర్ధారణకు వచ్చారు. సమకాలీన గ్రంథాలైన విద్యానాథుని ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ గాని, ఆ కాలపు చరిత్రను నిక్షిప్తం చేసిన తరువాతి కాలపు కాసె సర్వప్ప ‘సిద్ధేశ్వర చరిత్ర’గాని, ఏకామ్రనాథుని ‘ప్రతాప చరిత్ర’ గాని రామప్ప అనే శిల్పి పేరును పేర్కొనకపోవడం కూడా గమనార్హం. మరి ఇలా శాసన సాహిత్య గ్రంథాలు ప్రస్తావించని రామప్ప ఎవరు?
రామలక్ష్మణుల పేరు మీద ఈ ప్రాంతంలో రామవాగు, లక్ష్మణవాగు అనేవి మనుగడలోకి వచ్చాయని, కాకతీయులు రామవాగు మీద రామప్పచెరువు, లక్ష్మణ వాగుమీద లక్నవరం చెరువులు కట్టించారని స్థానిక జానపద గాథ తెలుపుతుంది. ఈ ప్రాంతంలో కాకతీయుల కంటే ముందున్న రామపూజ/ఆలయం ప్రాశస్త్యాన్ని ఇది తెలుపుతుంది. ఎంత ముందు నుంచి అనే ప్రశ్నకు సమాధానం ఇలా వెతుకవచ్చు.
క్రీ.శ. 4-6 శతాబ్దాల మధ్య పాలించిన విష్ణుకుండి రాజులు, ప్రత్యేకించి మాధవవర్మ శైవ-వైష్ణవ మతాల సమ్మేళనంగా (రామప్రతిష్ఠిత లింగం) రామలింగేశ్వరాలయాలను కట్టించారు. మాధవ వర్మను కాకతీయులు తమ మూల పురుషునిగా చెప్పుకొన్నారు. కాబట్టి విష్ణుకుండులే రామప్ప చెరువుకు ఈశాన్యంలో ఉన్న వరహాల గుట్టపైనో, లేక ప్రస్తుత రామప్పగుడి ప్రాంతంలోనో రామలింగేశ్వరాలయం కట్టించి ఉంటారు. ఇందుకు నిదర్శనంగా వారి కాలపు కోట శిథిలాలు, వారి లాంఛనమైన పూర్ణ కుంభ శిల్పం రామప్పచెరువుకు ఈశాన్యంలో ఉన్న వరహాల గుట్టపైన కన్పిస్తాయి. వాటి చారిత్రకతను నిర్ధారిస్తే రామప్ప ప్రాంత చరిత్ర మరింత ప్రాచీనతను సంతరించుకుంటుంది. దూపాటివారు కూడా ఇదే చెప్పారు.. ‘ఈ ప్రదేశమంతయు పూర్వము మహానగరముగా నున్నటుల ననేక సూచనలు గలవు. ఎటు జూచినను పరిశోధనార్హములగు ప్రదేశములు గోచరించుచున్నవి. క్రూర మృగములకు నెలవగు నీ ప్రదేశమున నొంటరిగా తిరుగుటయు, శోధించుటయు అసాధ్యము. అందుకు దొరతనమువారు మార్గములు వేసి యచటి దృశ్యములన్నింటిని కాపాడి మరుగుపడిన యీ పుణ్యప్రదేశపు పూర్వ చరిత్రమును వెల్లడించుట యత్యవసరము’. అంటే వరహాల గుట్టపైనున్న శిథిలాలను అధ్యయనం చేస్తే రామప్ప పూర్వపు ఆలయం తెలిసి రావచ్చు. ఆ ఆలయంలోని దేవుని పేరు రామలింగేశ్వరుడై యుండి ఆ మూల విరాట్ పేరే రామప్పకు మూలమై ఉండే అవకాశముంది. ఇలా చెప్పటానికి మరో ఆధారమూ ఉంది.
క్రీ.శ. 12, 13 శతాబ్దాల వరకు కూడా తెలుగు-కన్నడ భాషలకు ఒకే లిపి (తెలుగన్నడ) ఉండేది. ఆ శతాబ్దాల్లో కన్నడ ప్రాంతం నుంచి వీరశైవ మత శాఖ ప్రవేశించి బాగా ప్రభావం చూపింది. ఇక్కడ వీరశైవాన్ని ప్రచారం చేసిన వారిలో ప్రథముడు, ప్రసిద్ధుడు మల్లికార్జున పండితారాధ్యుడు. ఆయనపై పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’ అనే విజ్ఞాన సర్వస్వం అనదగిన గ్రంథం రచించాడు. రామప్పగుడి గోడపైన ఉన్న ఒక శిల్పచిత్రం మల్లికార్జున పండితారాధ్యునిదేనని దూపాటివారు అన్నారు. సామాన్య ప్రజల భాషను గౌరవించిన ఇలాంటి మత ప్రచారకుల ప్రోత్సాహం వల్ల పూర్వపు రామలింగేశ్వరుడు అనే దేవుడి పేరే ఆనాటి ‘తెలుగన్నడ’ భాషా పదమైన రామప్పగా స్థిరపడిందని రూఢీగా చెప్పవచ్చు.
ఆనాటికి రామలింగేశ్వరాలయం అనే పేరు పండితుల వాడుకలో ఉన్నా ప్రజల నాలుకలపై రామప్ప గుడిగానే ప్రసిద్ధిలోకి వచ్చి ఉంటుంది. రామప్ప (రామ+అప్ప) అనే తెలుగన్నడ మాటకు సమానమైన తెలుగు మాట రామయ్య (రామ+ అయ్య). అప్ప లేదా అయ్య అంటే తండ్రి అని అర్థం . దేవుడిని తండ్రి అనటం, భద్రాచలం రామయ్య అని పలుకడం మనకు తెలిసిందే! రామప్ప పేరుతో తెలంగాణలో ఎన్నో గుడులున్నాయి. శనిగల రామప్ప, మెట్టుగుట్ట రామప్ప, తెలుకుంట రామప్ప ఇందుకు ఉదాహరణ.
కొందరు పండితులు ఆధారాలు చూపకుండానే రామప్పగుడిని రామప్ప అనే శిల్పి కట్టాడు కాబట్టి ఆ గుడి అతని పేరుతోనే ప్రసిద్ధి చెందిందనే కల్పనలు చేశారు. మరి కొందరు కుహనా పండితులైతే రామప్ప అనే శిల్పి రుద్రమదేవిని ప్రేమించి, ఆమె రూపాన్నే తలుచుకుంటూ ప్రస్తుతం రామప్పగుడిలో ఉన్న అందమైన శిల్పాలను చెక్కాడనీ, ప్రేమ విఫలమై చనిపోయాడనీ, అతని పేరు మీద ఆ గుడి ప్రసిద్ధి గాంచిందని అత్యంత హేయమైన ఊహాగానం చేశారు.
రామప్ప గుడి నిర్మాత రేచర్ల రుద్ర భూపతి తన రాజు గణపతి దేవుడిని మహారాష్ట్రలోని దేవగిరి యాదవరాజుల నుంచి క్రీ.శ.1199లో విడిపించుకొని వచ్చి, కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు పొంది, ఆ విజయాన్ని పురస్కరించుకొనే ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. ఆ సమయంలోనే గణపతి దేవునికి రుద్రమదేవి పుట్టింది. ఆమెకు పదేళ్ల వయసు వచ్చేసరికి ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. ఆ బాలికతో రామప్ప ప్రేమ సాధ్యమా? కాబట్టి.. చరిత్రను కల్పనలతోగాక శాస్త్రీయమైన ఆధారాలతో పునర్ నిర్మించుకోవాలి.
– డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ
94909 57078
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ramappa Temple | ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం
Ramappa Temple : ప్రపంచ వారసత్వ సంపద రామప్ప ఆలయ శిల్ప కళా సౌందర్యం
Ramappa Temple | ఆకట్టుకొనేలా రామప్ప వర్ణన
హరప్పా ‘ధోలావీరా’కు యునెస్కో గుర్తింపు