న్యూఢిల్లీ: మొన్నటికి మొన్న మన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కగా, ఇప్పుడు మరో భారతదేశ పురాతన ప్రాంతానికి యునెస్కో గుర్తింపు లభించింది. సింధూ నాగరికత విలసిల్లిన గుజరాత్లోని కచ్ జిల్లా భచావ్ తాలుకాలో ఉన్న ‘ధోలావీరా’ క్షేత్రానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. చైనా వేదికగా ప్రస్తుతం కొనసాగుతున్న 44వ యునెస్కో సదస్సులో భాగంగా మంగళవారం ధోలావీరాకు గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యునెస్కో ప్రకటన విడుదల చేసింది. ‘ఈ నెల 25న కాకతీయ రుద్రేశ్వర(రామప్ప) ఆలయానికి వారసత్వ హోదా దక్కగా, ఇప్పుడు హరప్పా నాగరికత విలసిల్లిన పట్టణం ధోలావీరా కూడా ఆ జాబితాలో చేరిపోయింది. దీంతో వారసత్వ హోదా దక్కించుకున్న భారతదేశ కట్టడాలు/ప్రాంతాల సంఖ్య 40కి చేరింది’ అని పేర్కొన్నది.
ధోలావీరా చరిత్ర ఇదీ..
సింధూ లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ధోలావీరా ఒకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. కర్కాటక రేఖపై ఉన్న ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 2650 నుంచి నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967-68లో అప్పటి భారత పురాతత్వ సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ జేపీ జోషి కనుగొన్నారు. 1989 నుంచి తవ్వకాలు జరుపగా.. అబ్బురపరిచే వాస్తురీతి, పట్టణ ప్రణాళిక వెలుగులోకి వచ్చాయి. జంతువుల ఎముకలు, బంగారం, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. సింధూ నాగరికతలోని మొహంజోదారో, హరప్పా తదితర ప్రాంతాల్లో ఇటుకలతో నిర్మాణాలు చేపట్టగా, ఇక్కడ మాత్రం అన్నీ రాతితో కట్టినవే. ఎడారి ప్రాంతం అయినందున ఆనాడు ప్రత్యేక పద్ధతుల్లో రాతితో నిర్మించిన తటాకాలు, కాల్వల ద్వారా నీటిని ఒడిసి పట్టారు.