కరోనా వైరస్ పుట్టుకకు పర్యావరణ విఘాతం, వికృతమే ప్రధాన కారణమని భావిస్తున్న తరుణంలో కాప్- 26 సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జీ-20 భాగస్వామ్య దేశాలతో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్) మినిస్ట్రీయల్ సమావేశం ఈ రోజు, రేపు ఇంగ్లండ్లోని నేపుల్లో జరుగుతున్నది. జీ- కూటమి దేశాధినేతల సమావేశం వచ్చే అక్టోబర్లో జరుగనుండగా దానికి ముందుగా సమకాలీన తక్షణ సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై మినిస్ట్రీయల్ సమావేశం ఎజెండా రూపొందిస్తుంది. కొవిడ్తో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న పరిస్థితుల్లో వైరస్ కట్టడికి ఈ సమావేశం మార్గనిర్దేశనం చేసే దిశగా విధాన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రపంచమంతా ఉత్సుకతతో చూస్తున్నది. మరోవైపు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘ైక్లెమెట్ చేంజ్ సమ్మిట్- 2021’ పేర మరో నాలుగు నెలల్లో ప్రపంచస్థాయి శిఖరాగ్ర సమావేశం జరుగబోతున్నది. ఆ సమావేశానికి సమాయత్తంగా జరుగుతున్న భేటీ ఇది కావటం గమనార్హం.
జీ- 20 కూటమిలో భారత్, దక్షిణాఫ్రికా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా లాంటి 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ భాగస్వామిగా ఉంది. దీనిలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు, అభివృద్ధి చెందుతున్న భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య పర్యావరణ పరిరక్షణలో తీవ్ర వైరుధ్యాలున్నాయి. కర్బన ఉద్గారాల విడుదల, గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ పాపమంతా అభివృద్ధి చెందుతున్న దేశాలదేనని సంపన్న దేశాలు నిందను మోపుతున్నాయి. పారిశ్రామికీకరణను చేపట్టొద్దని శాసిస్తున్నాయి. నిజానికి పర్యావరణ సమస్యకు ప్రధాన కారణం ధనిక దేశాలేనని సర్వేలన్నీ చాటిచెప్పాయి. అయినప్పటికీ కర్బన ఉద్గారాలను నివారించటానికి తీసుకోవాల్సిన చర్యల్లో సంపన్న దేశాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్యారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ హయాంలో అమెరికా వైదొలగటాన్ని దీనికి పరాకాష్ఠగా చెప్పవచ్చు.
మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిన ఎబోలా, సార్స్ లాంటి మహమ్మారులన్నీ పర్యావరణ వికృతాల్లోంచే పుట్టుకొచ్చాయని అధ్యయనాలు తేల్చిచెప్పాయి. ప్రస్తుతం రోజుకో రూపం మారుస్తూ ప్రజలను బలిగొంటున్న కొవిడ్ వైరస్, జికా లాంటి కొత్త వైరస్ల మూలం పర్యావరణ విధ్వంసంలోనే ఉన్నదన్నది మరువరాదు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో ధనిక, పేద దేశాల మధ్య వివక్ష ఉంటున్నదనే ఆరోపణలున్నాయి. టీకా ఉత్పత్తి, పంపిణీ సమస్యలను అధిగమించటానికి కాప్ కార్యాచరణను రూపొందించాలి. వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ పంపిణీని విశ్వవ్యాప్తంగా సార్వత్రికం చేసి, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. మానవాళిని సంరక్షించే బాధ్యత కాప్పై ఉన్నది.