ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ధర్మారావుపేట (రామకృష్ణా పురం) లో కాకతీయ గణపతిదేవుని కాలంలో వేయించిన శాసనం లభించింది. శాసన కాలం లేదు. శాసనం సదాశివుని ప్రార్థనతో మొదలవుతుంది. ‘కాశీపురవరాధీశ్వర, విశ్వనాథ, శ్రీ పార్వతీవల్లభ, దేవదేవ, గంగాతరం గైర్విమలీ క్రుతాంఘ్రి తుభ్యం నమః’ అని శివుని ప్రార్థన ఉంది. ‘కాకత్య నామ ఉత్తమాపురీ’ అని కాకతీయ సామ్రాజ్య నగర వర్ణన ఉన్నది. శాసనంలో గణపతి దేవుని సింహాసనంపై కూర్చోబెట్టిన రుద్రమంత్రి గురించి ప్రశంస ఉన్నది.
రుద్రమంత్రి కొడుకు కాటయ, కాటయ కొడుకు పసాయిత, అతని కొడుకు వీరపసాయిత. ఇతడు ధైర్యంలో విక్రమార్కుడిగా, దానగుణంలో కర్ణుడు. ఈ వీర పసాయిత కింద పనిచేసేవాడు సోమమంత్రి. ఈయన వేయించిన ఈ శాసనం చాలా విశేషమైనది. సోమమంత్రి తండ్రి అప్పయ, తల్లి మాచాంబిక. సోమమంత్రి కూడా.. ‘సకల మంత్రిగణంలో చూడామణి వంటివాడుగా, తేజస్సులో రవి వలె ప్రకాశమానుడు’గా కీర్తించబడినాడు. సోమమంత్రి కుమారుడు ఎఱ్ఱయ.
భారద్వాజ వంశానికి చెందిన సోమమంత్రి తన తండ్రి పేరుమీద అప్పాంబుధి సముద్రా న్ని తొవ్వించాడు. అలాగే తండ్రిపేరు మీద కట్టించిన అప్పేశ్వర మహాదేవుడికి, తన తాత పేరు మీద కట్టించిన ఎఱ్ణేశ్వర మహాదేవుడికి, తన ప్రభువు పేరు మీద నిర్మించిన శివాలయానికి ఈ అప్పాంబుధి సముద్రాన్ని సమర్పించాడు.
సోమమంత్రి గ్రామంలో రాజవీధిని, ఒక సముద్రాన్ని నిర్మించాడు. ఏదైనా దానం చేస్తే అందుకు తోడ్ప డిన అధికారులకు మంచి కలగాలని ప్రార్థించడంతో పాటు.. చక్రవర్తికి కూడా దేవుని ఆశీస్సులు లభించాలని వారి పేరుమీద ఆలయాలు నిర్మించడం, వారి పేరుమీద ధర్మకార్యాలు చేయడం అన్నది మన భారతీయ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన అంశం.