అబద్ధాలను ప్రజలు నమ్మేంతవరకు ప్రచారం కొనసాగిస్తూనే ఉండాలనే సూత్రాన్ని ప్రాథమిక శిక్షణలోనే బీజేపీ ప్రచారకులు ఒంట బట్టించుకుంటారు. ఉద్దేశపూర్వకంగా అస్పష్టత సృష్టించి, కుట్రపూరితంగా ఘర్షణ వాతావరణాన్ని రాజేయడంలోనే, రాజకీయ మనుగడను సంపాదించుకునే ఎత్తుగడలను పుట్టుక నుంచే ఆచరణలో పెడుతున్నది కమలం పార్టీ. ఇలాంటి ఆటవిక రాజకీయ ధోరణిలోనే ప్రాంతీయ పార్టీల సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలపై హేయమైన ప్రచారాన్ని నడిపిస్తున్నది. పురోగామి రాష్ర్టాలకు ప్రతీఘాతక శక్తులుగా దాపురించిన బీజేపీ ప్రచారకుల నైజం, సమాజంలో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నది. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలపైన అసత్యాలను ప్రచారంలో పెడుతూ, కుట్రలను ప్రోత్సహిస్తున్నది.
నిత్యం అక్కసును వెళ్లగక్కుతూనే కలిసివస్తే కూల్చడమో, చీల్చడమో, కలిపేసుకోవడమో చేస్తున్న కమలం పార్టీ… కుట్రల చట్రంలో భారతదేశాన్ని బంధించే దిశగా నిస్సిగ్గుగా పావులు కదుపుతున్నది. అధికారంలో ఉన్న రాష్ర్టాలను జాగీర్లుగా మార్చుకోవడానికి బీజేపీ ఆచరణలో పెట్టిన దుర్మార్గాలను ‘క్రైమ్స్ ఆఫ్ బీజేపీ’ పేరిట గ్రంథస్తం చేస్తే ముగింపు రాయగలగడం ధుర్లభం. కమీషన్ల కర్ణాటకలో బతకలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్లో అందరం డమ్మీలమేనని స్వయంగా యూపీ సర్కార్లోని మంత్రులు అంగీకరించారు. ఇక ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఇటీవల కల్తీ మద్యం కాటుకు దాదాపు 40 మంది బలయ్యారు. ఇటీవల ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీ ముఖ్య నాయకుడొకరు ఏకంగా వ్యభిచార గృహం నిర్వహిస్తూ దొరికిపోయాడు. వీటికి తోడు విశ్వగురువు ఎనిమిదేండ్లుగా దేశాన్ని గోస పుచ్చుతున్న తీరు ఆవేదనాభరితం. మోదీ మోసపూరిత పాలనలో ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను దండోపాయానికి అస్ర్తాలుగా వాడుకుంటున్న బీజేపీ దౌష్టానికి దేశమే బాధితురాలిగా మారిపోయింది.
ఈ విద్వేషపు వ్యూహాలకు ఇప్పటికే భారతదేశం భారీగా నష్టపోయింది. బలవంతులుగా చెలామణి కావడం కోసం జాతి జనుల మధ్య అనుబంధాన్ని చంపేస్తున్నారు. కోటి తప్పులు చేసైనా, అంతులేని అబద్ధాలు కూసైనా విస్తరించి తీరాలనే నరేంద్ర మోదీ పరివారం పన్నాగాలు భారతదేశ రాజకీయ వ్యవస్థను చెదల్లా తినేస్తున్నాయి.
ఆధిపత్యం కోసం మోదీ, షాలు దేశంలోని ప్రజారాశుల మధ్యన సామాజిక విభజన రేఖనే కాదు ఏకంగా గోడను నిర్మిస్తున్నారు. దీనికి భారతదేశం భవిష్యత్లో ఎదుర్కొనే పర్యవసానాలను తలచుకుంటేనే భయంకరంగా ఉంటున్నది. నరేంద్ర మోదీ గెలుపు మైకం కోసం, బీజేపీ రాజకీయ విజయం కోసం దేశం నుంచి శాంతిని, సౌభ్రాతృత్వాన్ని తరిమేస్తున్నారు. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మాజీ ప్రధానులందరూ సొంత పార్టీ గెలుపు కంటే మిన్నగా దేశం ఓడిపోకూడదనే ఆశయంతో పాలన చేశారు. దేశం జీవిస్తే అందరూ జీవిస్తారు, అభివృద్ధి చెందితే అందరూ ఎదుగుతారన్న ప్రథమ ప్రధాని నెహ్రూ మాటలు నాటి పాలకుల ఆచరణకు నిలువుటద్దంలా ఉండేటివి. కానీ గడిచిన ఎనిమిదేండ్లుగా బీజేపీ జీవిస్తేనే అందరూ జీవిస్తారు, విస్తరిస్తేనే అందరూ మిగిలి ఉంటారనే అన్యాయమైన రాజకీయ విధానాన్ని మోదీ, షాలు ఆచరిస్తున్నారు. కమలం వెలుగు కోసం సమాజంలో శాంతికి నిప్పు పెడుతున్నారు.
జాతి ప్రగతి కోసం కాకుండా, దేశం మీద పట్టు కోసం అధికారాన్ని వాడుకుంటున్న ప్రధాని కారణంగా ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైంది. ప్రజాస్వామ్యాన్ని అంపశయ్యపై పడుకోబెట్టిన రోజు, భారతదేశం బతికున్న శవంతో సమానంగా మారుతుందని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హెచ్చరించారు. అలాంటి దుస్థితి దిశగా మోదీ భారతదేశాన్ని నడిపిస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏనాడూ ఎదురవ్వని దాడిని రాజ్యాంగ వ్యవస్థలు ఎదుర్కొంటున్నాయి. ప్రధాని ప్రమేయంతో పథకం ప్రకారం రాజకీయ విరోధులను అణచివేయడానికి అనుసరిస్తున్న అన్యాయమైన విధానాలు అప్రకటిత ఎమర్జెన్సీని రుచి చూపిస్తున్నాయి. నిర్మాణ స్పృహ ఏ మాత్రం లేని నియంతల ధోరణి కలిగిన నరేంద్ర మోదీ, అమిత్ షాలు విధ్వంసాన్ని కొనసాగిస్తున్నా రు. గ్రామీణ రాజకీయాల్లో పరిపక్వత రాని ప్రాథమిక స్థాయి నాయకత్వం కూడా అనుసరించేందుకు ఇష్టపడని దిగజారుడు మాయోపాయాలను మోదీ నమ్ముకున్నారు. ఇలాంటి సంకుచిత రాజకీయాలు భారతదేశాన్ని తిరిగి చీకటి యుగంలోకి నడిపిస్తాయి.
రాజ్యాంగ నిర్మాణసభ చర్చల్లో ప్రథమ ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ ‘మనం నూతన యుగ ముఖద్వారంలో ఉన్నాం. విజ్ఞానాంశాలపై ఆధారపడే ఆధునిక దేశం కావాలా? వర్తమానంతో సంబంధంలేని ప్రాచీన కాలంలోనే ఆగిపోవాలా? మనకు ఎలాంటి భారతదేశం కావాలి?’ అని జాతి జనులను సూటిగా ప్రశ్నించారు. 75 ఏండ్ల కిందట నెహ్రూ అడిగిన ప్రశ్నకు నేటి యువతరం సమాధానం వెతకాల్సిన సందర్భం ఇది.
నినాదాలు, భావోద్వేగాలకు దూరంగా జరిగి వివేకంతో అడుగులు వేయాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. భారీ పరిమాణం, విభిన్నమైన సంస్కృతులు గల భారతదేశాన్ని అసాంఘిక రాజకీయశక్తుల ఆధిపత్యం నుంచి విముక్తి చేయాల్సిన బాధ్యత పౌరులందరిపైనా పడింది. ఎందరో మహానుభావుల అసమాన త్యాగాలతో నిర్మించిన భారతదేశాన్ని కూల్చివేతపరుల నుంచి కాపాడుకోవడం కోసం అన్ని రాష్ర్టాల్లోని ప్రగతికాముకుల అడుగులన్నీ ఒకే దారిలోకి రావాలి. దేశ వర్తమానానికి పట్టుకున్న దరిద్రాన్ని దులిపేసి, భవిష్యత్తరానికి బంగారు భారతాన్ని అందివ్వడానికి అందరం నడుం బిగించాలి. దేశంలోని విష రాజకీయాల కీలెరిగి వాతపెట్టే శక్తి కలిగిన కేసీఆర్ వెంట అన్నివర్గాలు ఏకోన్ముఖంగా కదలాలి.
చరిత్రను అనుసరించడం కాదు నిర్మించడంలో ఆనందాన్ని వెతుక్కునే నేల తెలంగాణ. ఏ ఆసరా లేనినాడే అగ్గిబరాట ఈ గడ్డ. నేడు ఆదెరువు సంపాదించుకున్న తెలంగాణ దేశానికి దారిదీపం అవ్వకుండా ఆగుతుందా? దేశం కోసం కేసీఆర్ అడుగులు పడకుండా, కుట్రల కంచెలు పాతి నిలువరించగలమని కమలం పెద్దలు కంటున్న పగటికలలు పటాపంచలు కావడం ఖాయం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242