అదొక అపూర్వ, అపురూప యాత్ర. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్త పార్టీ పరివారాన్ని వెంటబెట్టుకొని పొరుగు రాష్ట్రంలో పర్యటించడం, జనం అడుగడుగునా నీరాజనాలు పలకడం అద్వితీయం. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సౌహార్ద యాత్ర ఓ సంచలనం. దేశ రాజకీయ చరిత్రలో నూతనాధ్యాయం. సీఎం కేసీఆర్ వాహనం ముందుండి తోవ చూపిస్తుంటే వెనుక 600 పైచిలుకు వాహనాల బారు అనుసరించింది. 2001లో కరీంనగర్లో జరిగిన సింహగర్జనకు కేసీఆర్ ఇదే తరహా కాన్వాయ్లో బయల్దేరారు. ఈ సందర్భంగా ఆ ర్యాలీ గుర్తుకురావడం సహజం. నాటి వలె నేడు కూడా దారిపొడవునా ఊరూరా జనసందోహాలు బారులు తీరి ఆత్మీయంగా స్వాగతించడం నేత్రపర్వం. గులాబీ సముద్రంలో ఆ కాన్వాయ్ నౌకల బారులా ముందుకుసాగడం ఓ అద్వితీయ దృశ్యం. ‘కేసీఆర్ తుమ్ ఆగే బఢో హమ్ తుమ్హారే సాథ్ హై’ (కేసీఆర్ మీరు ముందుకు సాగండి.. మీ వెంట మేమున్నాం) అనే నినాదాలు అడుగడుగునా మిన్నుముట్టాయి. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మార్మోగింది. నిజానికి మహారాష్ట్ర జనహృదయాన్ని తడిమి వారిని బీఆర్ఎస్కు చేరువ చేసింది ఈ నినాదమే.
తమకూ తెలంగాణ మాడల్ కావాలని దేశంలోని ఇతర ప్రాంతాలవారి లాగే ‘మరాఠీ మాణుస్’ గాఢంగా కోరుకుంటున్నాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న తమ సాగును తెలంగాణ తరహాలో బాగుచేసే మహానేత వచ్చాడని ఎలుగెత్తి చాటుతున్నాడు. దశాబ్దాల కాంగ్రెస్, బీజేపీ పాలనలో చీకట్ల పాలైన తమ జీవితాల్లో వెలుగులు నింపుతాడని ఎదురుచూస్తున్నాడు. రైతును రాజును చేసే మహోద్యమంలో మేమూ మా వంతుగా సేవలందిస్తామని మహారాష్ట్ర ప్రధానపక్షాల నేతలు, రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ కండువాలు కప్పుకోవడం నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. సీఎం కేసీఆర్ సోలాపూర్ చేరుకొని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సాదుల ధర్మన్న ఇంటికి వెళ్లారు. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి చర్చించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు. మరుసటి రోజు పండరీపురంలో విఠలేశ్వరుడిని, తుల్జాపూర్లో అంబా భవానిని దర్శించుకున్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ సౌహార్ద యాత్ర మహారాష్ట్ర పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ నేతలు ఈ యాత్రపై చేస్తున్న విమర్శలే ఇందుకు నిదర్శనం. మరాఠీ పత్రికలు ఈ యాత్రను రాజకీయ భూకంపంగా అభివర్ణిస్తున్నాయి. దర్శనాలైతే ఫరవాలేదుగానీ రాజకీయాలు వద్దంటూ బీజేపీ నేత, మహా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సన్నాయినొక్కులు నొక్కడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభావం తమ రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. ఎన్సీపీ నేతలు కూడా ఇదే తరహాలో ప్రభావం గురించే మాట్లాడటం వారిలోని అభద్రతా భావాన్ని తెలియజేస్తున్నదని చెప్పాలి. ఇక పండరీపురానికి కాలినడకన సాగే భక్తకోటిపై హెలికాప్టర్ నుంచి పూలు చల్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సమర్పించిన దరఖాస్తును మహారాష్ట్ర బీజేపీ-శివసేన సర్కారు అనుమతించకపోవడం అక్కడి పాలక కూటమి భయాన్ని సూచిస్తున్నది.