సమాజంలో ఏ మార్పులు జరిగినా అవి పిల్లలపై ప్రభావం చూపుతాయి. పేదరికం, సామాజిక వివక్షల వల్ల మొదట నష్టపోయేది పిల్లలే. పెద్దలు గ్రహించినంతగా పిల్లలు లోతు గ్రహించలేరు. అయినా, తమకున్న అవగాహన మేరలో పిల్లలే రాసిన రచనలున్నాయి. పిల్లల కోసం పెద్దలు రాసిన రచనలున్నాయి. అణచివేతకు గురవుతున్న బాల్య జీవితం పట్ల బాధ్యతతో పిల్లలు-బడి కేంద్ర బిందువుగా పెద్దలు రాసిన రచనలున్నాయి.
అట్లా కందుకూరి శ్రీరాములు రాసిన ‘పలకల నుంచి పలుకుల వైపు’ కవితా సంపుటి వినూత్నమైంది. పిల్లల పట్ల బాధ్యతాయుతమైన అనురక్తికి నిలువెత్తు ప్రతిరూపం. పిల్లల హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో, అంతటి స్వచ్ఛదనంతో పిల్లల్లో పిల్లవాడై, పెద్దదిక్కయి, అనుభవజ్ఞుడై, చైతన్యం కలవాడై చలించిపోయి ఈ కవితలు రాశారు. విద్యకై వచ్చి విశ్వసేవకై అక్షర విల్లంబులు సిద్ధం చేసుకునే గురుతర బాధ్యతను కవి అక్షరబద్ధం చేశారు.
కవిత్వం రాస్తున్నప్పుడు ఏం చెప్తున్నామనే స్పృహ ఎంత ముఖ్యమైందో, ఎలా చెప్తున్నామనే ఆలోచన కూడా అంతే ముఖ్యమైంది. కవికి ఒక లక్ష్యం, ఒక విధానం ఉంటే ప్రయోజనం నెరవేరుతుంది. శ్రీరాములు కవిత్వానికి ఆ చేవ ఉన్నది. ఈ సంకలనంలో కవి బాల్యపు అనుభవాలు చిగురుకలలై నెమరువేసిన జాడలు లేకపోలేదు. తన బాల్యం వలె బడిపిల్లల బాల్యం ఎలా పోతున్నది, ఎలా భిన్నంగా ఉన్నది వంటి పరిశీలనలు బేరీజు వేసుకొని చూశారు. చిగురు కలలు ఏమిటివి? చెదిరిన చిగురు కలలు ఏమిటివి? తెలుసు కనుక ‘కన్ను మీద కనురెప్ప పడ్డంత సున్నితం/ మట్టి పెళ్ళ మీద తొలకరిపడ్డంత/ సునిశితం-సువాసనత్వం’ గురించి రాయగలిగారు.
‘బడి గంట కొట్టే వేళ విద్యార్థులను అలర్ట్ చేయటం అటెండర్కు తెలిసిన విద్య’ అన్నారు కవి కందుకూరి శ్రీరాములు. గంట ఒక సూచన, హెచ్చరిక, బాధ్యతను గుర్తు చేయటం, కాలం విలువ తెలియచెప్పటం ఆ పనిని నిర్వర్తిస్తున్నది. అటెండర్ను ఆయన కావ్య వస్తువు చేశారు. ఈ కవితా సంకలనంలో కవిగా తాను మొదలైన తొలినాళ్ల ‘పయనం’ ఉన్నది. నందిని సిధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, కర్నాల బాలరాజు కవులు ముగ్గురు కలిసి ప్రచురించిన ‘దివిటీ’ తొలి మినీ కవితా సంకలనంలోనూ ఈ కవిత ఉన్నది. ఇంటి చుట్టూ, పంట చుట్టూ, బడి చుట్టూ, గుడి చుట్టూ, ఊరి చుట్టూ, చెరువు చుట్టూ బాట నిండా ముండ్లే ఉన్నప్పుడు గమ్యం దూరమనో, మరో కారణమనో పయనాన్ని ఆపుకొని బతుకు ఆగం చేసుకోవటం కంటే ‘ముళ్ల ప్రయాసనే నయం ‘కాలికి గాయమైనా/ గమ్యాన్ని చేరగలం’ అనే పరమార్థాన్ని ధీమానిచ్చారు. అలాంటిదే కే.శ్రీనివాస్తో కలిసి రాసిన కవిత లాంగ్ మార్చ్ ‘చీకటి కోటపై దండయాత్రకు చేస్తున్న కవాతు టార్చ్ లైట్ వేసి దారిని చూపిస్తుంది’.
ఉపాధ్యాయుని వృత్తి విద్య బోధించటమే. జ్ఞాన ప్రసరణ చేయటమే. అంతకంటే ఇవ్వటానికి ఏముంటుంది. అలాంటి ఉపాధ్యాయుడి పట్ల గౌరవంగా ప్రవర్తించటం సంస్కారం. అందుకు భిన్నంగా కొందరు పర్యవేక్షకులు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కూడా విస్మరించి అత్యుత్సాహాన్ని చూపటమో, లేక మరే కారణం వల్లనో మనసు నొప్పించిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు కవి స్పందన ఎలా ఉంటుందో ‘అక్షరబ్రహ్మలం’ ఒక రుజువు. బోధనా వృత్తిలో వాళ్లందరి పక్షాన నిలబడి రాసినట్టుగా ఉంటుంది కవిత.
ఒక్కపూటైనా పస్తులుండటం తెలువని వారు ఆకలి గురించి చెప్పటం విడ్డూరంగానే ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే కవి తనివి తీరా బతికి చూడమన్నాడు. అప్పుడే సంస్కారం అందుతుందని తన కవితకు సార్థకత చేకూరుతుందని కవి కందుకూరి శ్రీరాములు ప్రబోధం చేశారు. ‘శిలను చెక్కితే’, ‘శబ్ద శరీరం’, ‘ఆకాశం అంచు’, ‘డోలాయమానం’, ‘రిక్త నేత్రాలు’, ‘రథాన్ని మళ్లించు లక్ష్మణా!’ మొదలైన కవితలు ఒక క్షణం ఆపి ఆలోచింపజేస్తాయి.
రైతు భూమిని, నాగలిని మొక్కి, వ్యవసాయం పనిలోకి దిగుతాడు. వృత్తుల వాళ్లు అలాగే పనిముట్లను మొక్కి, పని చేపడతారు. అవి అన్నం పెడుతున్నాయి కనుక అంతటి కృతజ్ఞతాభావం. అదే నమ్మకంతో కాగితాన్ని కాలితో తాకొద్దని మొక్కాలని పెద్దలు చెప్తారు. కానీ, చేతులే లేని విద్యార్థి కాలుతో రాస్తున్నాడు. అతడు, తన లోపలి బాధను దాచుకుంటూ అందరితో హాస్యంగా మెదులుతున్నాడు. ఆ సందర్భం ఒకటి కందుకూరి శ్రీరాములును తొలిచివేసింది. ఆ సంతోషం వెనుక ఉన్న దుఃఖాన్ని చూసి ఆర్ద్రమై కవిత రాశారు. వస్తువుకు కొదవలేదు. వస్తువు చుట్టూ శిల్పం కఠిన వాస్తవాలను దర్శింపజేస్తుంది. ఇట్లా ‘పలకల నుంచి పలుకుల వైపు’ సంపుటిలో జీవితంలోని వర్తమాన అంశాలున్నాయి. కనుక పలకకు ఒకవైపు వర్ణమాల దిద్దుకోవటం అయితే మరోవైపు జీవితం ఉన్నది.
ఒక్కపూటైనా పస్తులుండటం తెలువని వారు ఆకలి గురించి చెప్పటం విడ్డూరంగానే ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే కవి తనివి తీరా బతికి చూడమన్నాడు. అప్పుడే సంస్కారం అందుతుందని తన కవితకు సార్థకత చేకూరుతుందని కవి కందుకూరి శ్రీరాములు ప్రబోధం చేశారు.
అట్లానే ఉపాధ్యాయ సేవాకాలంలో మనసుకు తాకిన గాయాలు కవికి ఉన్నాయి. అందుకే.. ‘చదవటమూ నేర్పటమూ నేరమైన కాలంలో/ ఆచార్యుడు అనాగరికపు ఉన్మాదికి బలి అవుతాడు.’ అని వాపోయాడు. చాలా సూటిగా స్పష్టంగా సరళమైన పదాలతో మన హృదయాన్ని తాకుతాడు. ఎవరు ఎంత ఎగిసిపడ్డా, ఎవరు గుర్తించకపోయినప్పటికీ, ఉపాధ్యాయుడిని పిల్లలు గుర్తుంచుకుంటారు సమాజం గుర్తుంచుకుంటుంది. ఇప్పటికీ కందుకూరి శ్రీరాములును పిల్లలు ప్రేమగా పలకరించటం నాకు తెలుసు. బహుశా ఆ అనుభవంతోనే ‘చచ్చినా బతికినా/ ధర పలికేది విలువ దక్కేది/ ఒక ఏనుగుకి, ఉపాధ్యాయునికి’ అంటూ అత్యున్నత స్థానాన్ని కవి కల్పించారు.
మరొకచోట ‘ఉదయం ఆగదు ఉద్యమం ఆగదు’ అన్నారు. కవిత్వం ‘పిడక కాదు పిడకలో మెరిసే నిప్పు’ అన్నాడు. ‘అహంభావం బుల్డోజర్/ ఎందరి జీవితాలను బలి గొంటుందో/ అధికారం లాంటి/ ఎందరి ఆలోచనలను పగుల గొడుతుందో’ అని కలత చెందిన కవి అక్షరాల సైన్యాన్ని తయారు చేసుకున్నారు. ఆ అక్షరాలే ఆయుధాలై కాగితం నిండా తల ఎత్తుకొని పహరా కాస్తాయని కవి నమ్మకం.
బెల్లంకొండ సంపత్ కుమార్
99085 19151