బతుకమ్మ తెలంగాణ పండుగ, పల్లెల పండుగ, తీరొక్కపూల పండుగ, చెఱువుల పండుగ, పడతుల పండుగ, పర్యావరణ పండుగ. దేశీ సాంప్రదాయంలో గ్రామీణులు తరతరాలుగా తలమీద మోసుకొస్తున్న పండుగ. దేశి వ్యవహారంలో పామరులు పదాలు పాడుతూ, పాదం కదుపుతూ ఊరు ఊరంతా సంఘటితంగా చేసుకునే పండుగ. శిష్ఠ వ్యవహారాలలోని దేవుళ్ళకు దీటుగా, ఆదిగా, అనాదిగా ఒక గట్టి నమ్మకంతో ప్రకృతికి నిలువెత్తు నిదర్శనంగా పూజ్యభావంతో చేసుకునే కృతజ్ఞతా పూర్వక పూలపండుగ. పువ్వులై పువ్వులకు పూజలు చేసే పడతుల నిలువెత్తు సంబురాల పండుగ.
చరిత్రను తిరగేస్తే రాజ్యవ్యవస్థ ఏర్పడక ముందునుండే బతుకమ్మ పూజలున్నాయని, కొత్త రాతియుగం నాటికే ఆ పాటల, ఆట ల ఆనవాళ్ళు కనిపించాయని చరిత్రకారులు చెప్తున్నారు. వాడపల్లి శాసనం ద్వారా 800 ఏండ్లకు ముందే బతుకమ్మ ఉందని సాధికారికంగా మనకు నిరూపణ అయ్యింది. అక్షరం ముక్క రాని ఆ కాలంలో చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకు ఆరోగ్య ఆహారం గురించి, పెండ్లి గురిం చి, వంటల గురించి, బిడ్డల శిక్షణ గురించి, అత్తింట్లో మసులుకోవలసిన తీరు గురించి, ఆడపిల్లల అలంకరణలో తీసుకోవాల్సిన అంశాల గురించి బొడ్డెమ్మపాటల రూపంలో ఎన్నో విషయాలు చెప్తూ వచ్చేవారని చరిత్రకారులు విశదపరిచారు.
‘మా పాడిపంటలు సల్లంగ జూడ రావు రావా గౌరమ్మ మా ఇంటికి, మా పిల్లపాపల్లు సల్లంగ జూడ రావు రావా గౌరమ్మ మా ఇంటికి’ అని సాగుతుందీ పాట. బతుకమ్మ పాటల్లో ఒక రిథమ్ ఉంటుంది. సాహిత్య పరంగా మాత్రాఛందస్సులో ఉంటాయని పిస్తుంది. ఇవి ద్విపద కవితకు దగ్గరగా ఉంటాయని లాక్షణికులంటున్నారు. నాలుగేసి మాత్రలతో సాగితే చతురస్రగతిగా, ఐదు మాత్రలతో సాగే ఆవృతాన్ని ఖండగతిగా, ఏడు మాత్రలతో మిశ్రగతిగా భావిస్తుంటారు. సిద్ధేశ్వరి చరిత్రలో ఉన్న 14వ శతాబ్దం నాటి ధర్మాంగద రాజు పాటని ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం. దశాబ్దంపాటు పాలించిన చాళుక్యులు తాము సప్తమాత్రుకల పుత్రులమని, హారతీదేవి పుత్రులమని సగౌరవంగా చాటుకున్నారు.
బతుకమ్మ నిమజ్జనాలకోసం వాడపల్లి రేవుని కాకతీయులు కట్టించారని, త్రికూటాలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలున్నాయి. నర్సింహకవి రాసిన ‘శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా” పాట వినపడని వాడకట్టు అంటూ తెలంగాణలో లేదు. వేముగంటి నర్సింహాచార్యులు పిల్లల్లో దేశభక్తిని పెంచటానికి బతుకమ్మ పాటల శైలిలోనే దేశభక్తి గీతాలు రాశారు. విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలకు బతుకమ్మ పాటలే మాతృక అంటారు. సాకేతపురి కస్తూరి ‘బతుకమ్మ మునిగింది’నవల కూడా ఇక్కడ ప్రస్తావించాలి. వరంగల్ జిల్లాలోని మొగిలిచర్ల కాంచనపల్లి నరసింహదాసు 1750లోనే బతుకమ్మ చరిత్రను 33 పద్యాలలో రాశాడని చెప్పుకుంటారు. క్రీ.పూ. 1వ శతాబ్దం నాటి బౌద్ధ సాహిత్యంలోనూ, కళింగ జాతక కథల్లోనూ ఈ ప్రస్తావన ఉందని అంటుంటారు. బతుకమ్మ ఎన్నో ఏండ్లుగా జనాల బతుకుల్లో నిలబడటానికి, వారి వికాసానికి దోహదకారిగా మిగలడానికి కారణాలు మూడు అవి ఆడవాళ్ళు ఈ పూజ చేయటం, తీరొక్కపూలతో ఈ పూజలు జరగ డం, సామూహికోత్సవంగా జరుపుకోవడం.
పూలు:- బతుకమ్మ పూలకొక ప్రాశస్త్యం ఉంది. ప్రతి పువ్వుకి వైద్యశాస్త్రంలో ఎంతో విలువైన వైద్య విలువలున్నాయి. ముఖ్యంగా గుమ్మ డి పూవు కేంద్రంగా కేంద్ర భాగంలో నిలబెట్టడానికి స్త్రీ పురుష పునరుత్పత్తి అవయవాలను పోలిన గుమ్మడి పువ్వు ఉండడమే కారణంగా చెప్తారు. గుమ్మడిపువ్వు రంగు గౌరార్ణం. కాబట్టి బతుకమ్మ ఈ పువ్వును బట్టే గౌరమ్మ అయిందని చరిత్రకారులు చెప్తున్నారు. విష్ణువు రంగు నీలం కాబట్టి నీలం రంగున్న కట్లపూలు, బ్రహ్మ రంగు తెలుపు కాబట్టి గునుగుపూలు బతుకమ్మ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అడవిలో దొరికే పూలే కావడం, డబ్బులిచ్చి కొనాల్సిన అవసరం లేకపోవడం, ఇంటి చుట్టుపక్కల మన పరిసరాల్లో దొరికే పూలే అవడం వల్ల అందరూ ఎంతో ఉత్సాహంగా పూల సేకరణలో మునిగి ఉంటారు. పిరమిడ్ ఆకృతిలో బతుకమ్మను పేర్చడంలో తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. పూజించిన పూలను తొక్కకుండా ఉండటం కో సం పూర్వకాలంలో చెఱువు కట్టమీదనే ఆడుకుంటూ చెఱువుల్లో తెప్పలుగా పూలను వదిలేవారట. తమ పంటల దాహార్తిని తీర్చి తద్వారా తమ కడుపులకింత అన్నం పెట్టే చెఱువులకు కూడా కృతజ్ఞత చెప్పుకున్నట్లుగా భావించేవా రు. తాము నీళ్లు తాగే చెఱువుల్ని ప్రక్షాళన చేసే ఈ పండుగ పట్ల ఎంతో ఆసక్తిని కనబరచేవారు.
సామూహికోత్సవం:- అప్పట్లో ఆడవాళ్ళందరూ కలుసుకోవడానికి ఒక కారణం కావాలనుకున్నారు పెద్దవాళ్ళు. అత్తవారింటికి పంపిన ఆడబిడ్డలు ఐదేళ్ళకొకసారి సారెకే కాకుండా, ప్రతి ఏడాదీ పుట్టింటికి రావాలని అదొక ఆచారంగా ఉండాలని ఆశించారు. ఆడవాళ్ళకి ఆరో గ్య అవగాహన, జీవితాలపట్ల సానుకూల దృక్పథం, కష్టంసుఖం పంచుకోవడానికి ఒక ఐక్యత వారి మధ్య ఉండాలని బతుకమ్మ పండుగను ఒక సమైక్యస్ఫూర్తికి నిదర్శనంగా మలిచారు.ఆకర్షణీయమైన పాటలు కూర్చి, ఆనందోత్సాహాలకోసం ఆటను చేర్చి అటు శారీరక వ్యా యామం, ఇటు మానసిక ఉల్లాసం ఉండేలా నవరాత్రులు మలిచారు. గోండులు ఆడే డి య్యానా ఆట, చెంచులు పాడే ఇయ్యాల పాట లు ఈ సామూహికోత్సవాలకి సజీవ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా 2015లోనే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 2017లో సద్దుల బతుకమ్మ రోజున 10000 మంది మహిళలతో ఒకేసారి బతుకమ్మ ఆడి అరుదైన అద్భుతమైన గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది తెలంగాణ.
ఆడవాళ్ళు:- ఆడవాళ్ళకు భర్త, పిల్లలే ప్రపంచం. తాము సౌభాగ్యంతో ఉండాలని, పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని తపిస్తూ చల్లటి బతుకునందించే గౌరమ్మ తల్లికి రకరకాల సద్దులు పెడుతూ గౌరీదేవిని 9 రోజులు 9 రకాలుగా పూజించుకుంటారు. పసుపులో పుట్టిన గౌరమ్మ బతుకమ్మగా తమ బతుకులు సల్లంగ చూస్తుందని విశ్వసిస్తారు.
– అయినంపూడి శ్రీలక్ష్మి 99899 28562