‘ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను!’.. మహాత్ముడు చెప్పిన ఈ మాట ఎంతో గొప్పది. కానీ, అప్పుడప్పుడూ ఆ సత్యమే.. పిల్లల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ముఖ్యంగా.. ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులతో ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి అపాయాలు ఎదురైనప్పుడు తక్షణ ఉపాయంగా నిజం దాచడం, అబద్ధం చెప్పడం మంచిదే! అందుకే, భద్రత విషయంలో ఎప్పుడెలా మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో పిల్లలకు నేర్పించాల్సినఅవసరం ఉన్నది.

స్కూల్ దగ్గరో, కాలనీ పార్క్ దగ్గరో.. పిల్లలకు తమ వాహనంలో లిఫ్ట్ ఇస్తామని, తమతో రమ్మని దురుద్దేశంతో ఎవరైనా అడిగినప్పుడు కూడా అబద్ధం ఆడాల్సిందే! ‘వద్దు! నన్ను తీసుకువెళ్లడానికి మా నాన్న వస్తున్నారు’ అని అసత్యమే పలకాలి.

ఎవరైనా అపరిచితుడు ఇంటి తలుపు తట్టి.. ‘మీ అమ్మానాన్న ఇంట్లో ఉన్నారా?’ అని పిల్లల్ని అడిగాడని ఊహించుకోండి. అలాంటి సందర్భంలో తాము ఒంటరిగానే ఉన్నామని చెప్పడం పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే, పెద్దవాళ్లు ఇంట్లో లేకపోయినా.. ‘అవును! మా అమ్మానాన్న ఇంట్లోనే ఉన్నారు’ అని అబద్ధం చెప్పడం చిన్నారులకు నేర్పించాలి.

పరిచయం లేని వ్యక్తులు మిఠాయిలు, చాక్లెట్లు, బొమ్మలు ఇవ్వచూపినా.. తీసుకోవద్దని చిన్నారులకు చెప్పాలి. వారు బలవంతం చేస్తే.. ‘అలాంటివి నా దగ్గర బోలెడున్నాయి’ అని తెలివిగా సమాధానమివ్వాలి.
కొందరు దురుద్దేశంతో పిల్లల్ని చిన్నచిన్న ప్రశ్నలు అడిగి.. వాళ్ల నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. పిల్లల ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలను అడుగుతుంటారు. ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో ఎప్పుడూ పంచుకోకూడదని చిన్నారులకు నేర్పించాలి. అలాంటి సందర్భాల్లో ‘నాకు గుర్తులేదు’ అని అబద్ధమే చెప్పాలి.