Health | ప్రస్తుతం, చాలామందిలో విటమిన్-బి12 లోపం కనిపిస్తున్నది. ఇది ఎందుకు వస్తుంది? ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? తగినంత బి12 శరీరానికి అందాలంటే ఏం తీసుకోవాలి?
-ఓ పాఠకురాలు
మిగతా విటమిన్లలాగే ఇది కూడా ఆహారం ద్వారానే లభిస్తుంది. విటమిన్-బి12తో కూడిన పదార్థాలు తగినన్ని తీసుకోకపోవడం వల్లే ఈ లోపం వస్తుంది. దీన్ని ‘మాక్రో సైటిక్ ఎనీమియా’ అంటారు. ఈ పోషక లోపం వల్ల విపరీతమైన అలసట, ఏకాగ్రత లోపించడం, నీరసంగా ఉండటం.. తదితర లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కామెర్లు కూడా రావచ్చు. లోపం మరీ ఎక్కువగా ఉంటే నరాల సంబంధ వ్యాధులు, మతిమరుపులాంటి సమస్యలూ ఉత్పన్నం అవుతాయి. లోపం ఏ స్థాయిలో ఉందనే దాన్నిబట్టి వైద్యులు మాత్రలు, ఇంజెక్షన్లు ఇస్తారు.
జీవనశైలి లోపాల కారణంగా మారిన ఆహారపు అలవాట్లే సదరు విటమిన్ లోపానికి కారణం. చేపలు, మాంసం, గుడ్లలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. పాలు, పాల పదార్థాలు, పుట్టగొడుగులు, పాలిష్ పట్టని బియ్యం, దంపుడు బియ్యంలాంటి వాటిల్లోనూ లభిస్తుంది. మాత్రల ద్వారా లోపాన్ని తగ్గించుకున్నా సరే, సమతులాహారం తప్పక తీసుకుంటూ పోషకాహార లోపాన్ని నియంత్రించుకోవాలి. కొన్ని శరీరాలు సాధారణంగానే విటమిన్-బి12ను ఎక్కువగా శోషించుకోలేవు. అంటే, వంశపారంపర్యంగానూ వస్తుందన్నమాట. ఇలాంటి వాళ్లు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సర్జరీలు అయినప్పుడు, విపరీతంగా మందులు వాడినప్పుడు కూడా శరీరం బి12ను తీసుకోలేదు. అప్పుడు, మరింత జాగ్రత్త అవసరం అవుతుంది.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com