పురుగుమందులు, కూరగాయలు.. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది. కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్రిమిసంహారకాలు వాడేస్తున్నారు. వీటిని వదిలించకపోతే.. నేరుగా మన శరీరంలోకి వెళ్లడం తథ్యం. అందుకే పురుగుమందులను కడిగేసే కొన్ని ఉపాయాలు చెబుతున్నారు నిపుణులు.
పురుగుమందులు, కూరగాయలు.. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది. కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్రిమిసంహారకాలు వాడేస్తున్నారు. వీటిని వదిలించకపోతే.. నేరుగా మన శరీరంలోకి వెళ్లడం తథ్యం. అందుకే పురుగుమందులను కడిగేసే కొన్ని ఉపాయాలు చెబుతున్నారు నిపుణులు.
కూరగాయలు, పండ్లకు అంటిన పురుగు మందులను వదిలించేందుకు రకరకాల యంత్రాలు మార్కెట్లోకి వస్తున్నాయి. నిజానికి, నీటితోనే 90 శాతం శుభ్రత సాధ్యం.
కూరగాయలకు అంటిన రసాయనాలను శుభ్రం చేయడానికి ఓ చిట్కా ఉంది. ఒక గిన్నె నీటిలో నిమ్మరసం, సోడా, ఆపిల్ సిడార్ వెనెగర్ కలపాలి. ఆ ద్రవాన్ని కూరల మీద చల్లి ఐదారు నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.
కూరగాయల పైన తొక్క తీసేయాలి అనుకున్నప్పుడు వాటిని కడగాల్సిన పన్లేదు అని చాలామంది అభిప్రాయం. తొక్క తీసేటప్పుడు వాటికి ఉన్న సూక్ష్మక్రిములు కూరగాయల మీద పరుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తొక్క తీసేముందు కూడా కడగాల్సిందే.
ఇంట్లో పెంచుకున్న, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలపై పురుగుమందులు లేకపోవచ్చు. కానీ బ్యాక్టీరియా తిష్ఠవేసే ప్రమాదం లేకపోలేదు. వాటినీ శుభ్రం చేయాల్సిందే.
చాలామంది కూరగాయల్ని ఇంటికి తెచ్చుకున్న వెంటనే శుభ్రం చేసి సంతృప్తి పడిపోతారు. కానీ వాడేలోపు… వాటి మీద బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ కూరగాయనూ వాడేముందు మళ్లీ కడగాలి.
కూరగాయలో కొంతభాగం పాడైతే… అంతవరకూ తుంచేసి వండుకోవడం మనకు అలవాటు. ఇదేమంత మంచి పద్ధతి కాదు. అలాంటివాటిని పారేయడమే మేలు.
చాలామందికి పచ్చికూరగాయలు తినడం అలవాటు. శుభ్రంగా కడిగిన తర్వాత కూడా మిగిలిపోయే బ్యాక్టీరియాతో అసలుకే మోసం రావచ్చు. కాబట్టి డైటీషియన్ను సంప్రదించి ఏ పచ్చి కూరగాయల్ని ఎలా తినాలో తెలుసుకోవాలి. వాటినే ఆరగించాలి. నిజానికి కొన్నిటిని పచ్చిగా తినడం ఆరోగ్యకరం కాదని కూడా చెబుతారు.