అప్పటిదాకా మంచిగా ఉన్నవాడు ‘నీ నగ్న రూపం బయటపెడతా’ అంటూ తన అసలు రూపాన్ని చూపిస్తాడు. ఆ బెదిరింపులకు భయపడి లొంగిపోవడమో, అడిగినంత డబ్బు సమర్పించు కోవడమో పరిష్కారం కాదు.. ధైర్యంగా, తెగువతో పోరాడమని సూచిస్తారు డాక్టర్ ప్రతిభాలక్ష్మి. ఆ పోరాటంలో ‘మేమున్నాం’ అంటూ భరోసా ఇస్తున్నారు. ‘స్టాప్ ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్’ సంస్థ నేతృత్వంలోసైబర్ నేరాల పట్ల మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారామె.
‘నీ నగ్న చిత్రం నా దగ్గర ఉంది.
నా కోరిక తీరిస్తే సరి. లేకపోతే..’
‘నీ ఫొటో మార్ఫింగ్ చేస్తా.
నీ మొగుడికి పంపిస్తా.
లక్ష రూపాయలు తక్షణం కావాలి’
‘కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చా నీకు. ఆ తర్వాత ఏం జరిగిందో.. చూస్తావా?’
పత్రికలు తిరగేస్తే చాలు. లైంగిక మోసాలు.. ఆపై డబ్బు కోసం, శారీరక సుఖం కోసం బెదిరింపుల వార్తలు ప్రతిమూలా కనిపిస్తాయి. అదొక ఊబి. బాధితుల ఫొటోలు, వీడియోలు అడ్డంపెట్టుకుని మళ్లీమళ్లీ బెదిరిస్తారు. ఇంకా ఇంకా హింసిస్తారు. ఫోన్ చేసి చెప్పినచోటికి రావాలంటారు. చెప్పినట్టు చేయ మంటారు. లేదంటే, ఫొటోలు షేర్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. లక్షలకొద్దీ డబ్బు డిమాండ్ చేస్తారు. బాధితుల భయమే, నేరస్తులకు బలం అవుతున్నది. ఆ ఒత్తిడి తట్టుకోలేక.. ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నవారూ ఉన్నారు. ఎంతకాలమని ఒంటరి పోరాటం చేస్తారు. సమాజమంతా ఒకవైపు, ఆమె ఒక్కరే మరో వైపు. చివరికి, కుటుంబం కూడా చేతులెత్తేస్తుంది. దీంతో సమస్య నుంచి బయటపడే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అలాంటివారికి నేనున్నానంటూ ధైర్యమిచ్చి.. న్యాయపరమైన సలహాలు అందించి.. సంపూర్ణ భరోసా కల్పిస్తున్నది ‘స్టాప్ ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్’. ఆ సంస్థ వెనుక డాక్టర్ ప్రతిభాలక్ష్మి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి, తమ సంస్థ పోరాటం గురించి ఆమె మాటల్లోనే..
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ దవాఖానాల్లో పదేండ్లపాటు జనరల్ ఫిజీషియన్గా చేశాను. అయిదేండ్ల నుంచీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాను. వైద్యం నా వృత్తి. సామాజిక బాధ్యత నా ప్రవృత్తి. భావసారూప్యం ఉన్న మహిళలతో కలిసి ‘వియ్ ఫర్ ఉమెన్’ సంస్థను ప్రారంభించాను. సమాన అవకాశాల ద్వారానే సాధికారత సాధ్యమని మా సంస్థ బలంగా నమ్ముతుంది. విద్య ద్వారానే మహిళలు కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. అదే సమయంలో మహిళకు ఆరోగ్యమూ ముఖ్యమే. కాబట్టే, సాధికారతలో కీలకమైన విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఎంతోమంది అమ్మాయిలతో ముఖాముఖి మాట్లాడుతున్నాం.
పోకిరీల చేతిలో పడిన ఫొటోలు, వీడియోలు తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయని కన్నీళ్ల పర్యంతమవుతూ చెప్పారు. ప్రేమలో ఉన్నప్పుడో, స్నేహంగా మెలుగుతున్నప్పుడో కాస్త చనువుగా తీసుకున్న ఫొటోలను బయట పెడతామంటూ బెదిరిస్తున్నారనీ, కోరికలు తీర్చమంటూ వెంటబడుతున్నారని మొరపెట్టుకున్నారు. ఆ కలి కాలపు కీచకులను ధైర్యంగా ఎదిరించలేక, పట్టుబట్టి వదిలించుకోలేక సతమత పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో.. షాపింగ్ మాల్స్లో దుస్తులు మార్చుకునేప్పుడు, లాడ్జీలలో స్నానం చేసేప్పుడు దొంగచాటుగా వీడియోలు, ఫొటోలు తీసి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. సైబర్ క్రిమినల్సే కాదు, అతి సామాన్య యువకులూ ఇలాంటి నేరాలకు తెగబడతారు.
..ఇలాంటి సందర్భాలలో పరువు పోతుందని భయపడకుండా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలి. నిజానికి, ఇదేమీ పెద్ద సమస్య కాదు. ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చాలు. ఫొటోలు, వీడియోలను ఫోన్లు, కంప్యూటర్లు, సోషల్ మీడియా నుంచి వాళ్లే తొలగిస్తారు. మహిళల అమాయకత్వం, భయం.. దుర్మార్గులకు వరంగా మారాయి. వాళ్లకిప్పుడు ధైర్యమిచ్చే మనుషులు కావాలి. ఆసరా అందించే ఆలోచనలు కావాలి. అందుకే, ‘మీరు ఒంటరివాళ్లు కాదు. తోడుగా మేమున్నాం’ అని భరోసా ఇస్తున్నాం. న్యాయ సహాయం కోసం, మనో ధైర్యం కోసం మమ్మల్ని సంప్రదించ వచ్చని చెబుతున్నాం.
బెదిరింపులు మొదలు కాగానే.. ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడం ఉత్తమం. ఆ తర్వాత మా లాంటి వారి సహాయం తీసుకుని న్యాయ పోరాటం చేయవచ్చు. మన పేరు రికార్డులలో రాకుండానే ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. మహిళా కమిషన్ కూడా బాధితులకు సాయంగా నిలుస్తున్నది. మనోవేదనతో ఉన్నవారికి మా వంతు కౌన్సెలింగ్ కూడా ఇస్తాం. న్యాయ సహాయం కోసం సఖి కేంద్రాలను ఉపయోగించుకునేలా సూచిస్తాం. దయచేసి తీవ్ర నిర్ణయాలు తీసుకో కండి. ఆత్మహత్య ఆలోచనలు అసలే వద్దు. దైన్యాన్ని విడిచిపెట్టి.. 9885315750 నంబర్కు వాట్సాప్ చేయండి. సైన్యమై మీ వెనుక నిలబడతాం.
…? నాగవర్ధన్ రాయల