వేసవి తుదకు వచ్చింది. అకాల వర్షాలు ఓ రెండు రోజులు వాతావరణాన్ని చల్లబరచినా.. మళ్లీ వేడి రాజుకుంటున్నది. రోళ్లు పగిలేంత కాకున్నా.. రోహిణి కార్తె కొద్దికొద్దిగా ముదురుతున్నది. ఈ ఉష్ణతాపానికి విరుగుడు పడకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇందుకోసం నీళ్లతోపాటు పండ్లరసాలు, కాయగూరల సలాడ్లు తీసుకోవడం తప్పనిసరి. భానుడి భగభగల నుంచి తప్పించుకోవడానికి ఈ పానీయాలు ప్రయత్నించండి.
హెర్బల్ టీ వేసవి తాపాన్ని చాలావరకు తగ్గిస్తుంది. దీనిలో అనేక రకాల ఫ్లేవర్లు ఉంటాయి. హెర్బల్ టీలో కెఫీన్ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి కిడ్నీ, లివర్ మీద ఒత్తిడి తగ్గించి అక్కడ పేరుకున్న టాక్సిన్స్ని బయటికి పంపేస్తాయి. గ్రీన్ టీ, హైబిస్కస్ టీ ఇందుకు బాగా పనిచేస్తాయి. ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకూర్చుతాయి. సుఖంగా నిద్రపోవడానికి చామోమిల్ టీ, లావెండర్ టీ పుచ్చుకుంటే మంచిది.
సబ్జా గింజలను రాత్రంతా నానబెట్టి నిమ్మరసంతో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి. ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పానీయం శక్తి స్థాయులను పెంచుతుంది. జీర్ణక్రియకు సాయపడుతుంది. శరీరంలో నీటి నిల్వలను స్థిరంగా ఉంచుతుంది.
పచ్చిమామిడితో తయారుచేసే ఆమ్ పన్నా షర్బత్ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. తీపి, పులుపు కలగలసిన రుచితో ఉండే దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని డీ హైడ్రేట్ బారిన పడకుండా కాపాడుతాయి.
మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది శరీరానికి తేమను అందిస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేడిని నియంత్రిస్తుంది.
స్మూతీలను అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి తగిన పోషణ అందించడానికి సీజనల్ పండ్లు, డ్రై ఫ్రూట్స్తో తయారుచేసిన స్మూతీలను తాగడం మంచిది.