హలో జిందగీ. శీతాకాలంతో పోలిస్తే ఎండాకాలం పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు ఆహార వేళల్లో, తీసుకునే ఆహారంలో ఏమైనా మార్పు చేర్పులు అవసరమా? బరువు తగ్గేందుకు ఇది మంచి సమయం అంటారు నిజమేనా?
– ఓ పాఠకురాలు
శీతాకాలం కంటే ఎండాకాలంలో మనం ఎక్కువ చురుగ్గా ఉంటాం. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటికి పోతుంది. ఈ సమయంలో అన్నం సరిగ్గా తినాలనిపించదు. నీళ్లు ఎక్కువగా తాగుతాం. ఈ కారణంగా బరువు తగ్గుతాం. చలికాలంలో వెయిట్లాస్ అయిన వాళ్లు దాన్ని కొనసాగించడానికి కూడా ఇది మంచి సమయం.
ఉక్కపోతగా ఉంటుంది కనుక, ఎక్కువ సేపు ఇంట్లో ఉండలేం. చల్లగాలి కోసం కాస్త బయట నడుస్తూ ఉంటాం. అలాగే స్విమ్మింగ్ చేసేందుకూ ఈ సమయంలో చాలామంది ఆసక్తి చూపిస్తారు. అలా ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువ దాహం వేయడం వల్ల ఆహారం సరిగ్గా తీసుకోలేం. అలాంటప్పుడు నీళ్లతో పాటు మజ్జిగ, షర్బత్లు, పండ్ల రసాలు, జావ తదితర ద్రవాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
అలాగే ఘనాహారం తినాలనిపించదు కాబట్టి పప్పుచారు, గోధుమ, జొన్న గటకలాంటివి తినొచ్చు. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్ అందుతుంది. మామిడి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్లాంటి ఇబ్బందులు లేని వాళ్లు రాత్రి పూట అవి తిని మజ్జిగ తాగినా సరిపోతుంది. కీరదోస, పుచ్చకాయ, క్యారెట్.. లాంటివి కూడా సాయంత్రం లేదా రాత్రి పూట తింటే పొట్ట నిండిన అనుభూతి ఉంటుంది. కాబట్టి ఎండాకాలం తినే వేళల్లో కొత్తగా మార్పులు ఏమీ చేసుకోనక్కర్లేదు. తీసుకునేది సమతులాహారం అయ్యేలా చూసుకుంటే సరి.
షుగర్ ఉన్న వాళ్లు న్యూట్రీషనిస్టుల సాయంతో మంచి డైట్ ప్లాన్ తీసుకుంటే డయాబెటిస్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే, వేసవిలో శరీరానికి ఎండ ఎక్కువగా తగులుతుంది. కాబట్టి విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సాయపడుతుంది. అంతేకాదు వేసవిలో టీ, కాఫీలు తాగడం తగ్గిస్తుంటాం. దీనివల్ల మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం బాగా శోషించుకుంటుంది. కాబట్టి ఎండగా ఉందని, ఏసీల్లో ఎక్కువగా కూర్చోకుండా కాస్త కాలు కదిలిస్తే మొత్తంగా శరీర వ్యవస్థ చక్కబడుతుంది. ఆదిత్యుడి దయతో ఆరోగ్యం మన సొంతమవుతుంది!
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com