ఈ ఉరుకుల పరుగుల కాలంలో, మన చేతిలోని స్మార్ట్ఫోన్ మనల్ని ప్రపంచానికి దగ్గర చేస్తోందో లేదో తెలియదు కానీ, మనశ్శాంతికి మాత్రం దూరం చేస్తోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటిఫికేషన్ల హోరు, రీల్స్ జోరు. ఈ డిజిటల్ సునామీలో కొట్టుకుపోకుండా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరికొత్త ‘లైఫ్స్టైల్ ట్రెండ్స్’ పుట్టుకొస్తున్నాయి. సాంకేతికతను వాడుకుంటూనే, దానికి బానిస కాకుండా ఉండేందుకు నేటి తరం వినూత్న పదాలను, పద్ధతులను అన్వేషిస్తున్నది. అవేంటో ఓసారి చూద్దాం!
ఒకప్పుడు అందరినీ వేధించిన అతిపెద్ద జబ్బు ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ FOMO). అంటే ‘ఎక్కడ నేను అందరిలా అప్డేట్గా లేనేమో, నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను మిస్ అయిపోతున్నానేమో’ అనే భయం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది! ఫ్యూచరిస్టిక్ మైండ్సెట్ ఉన్న యువత జోమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ JOMOని ఆస్వాదిస్తున్నది. సోషల్ మీడియా అప్డేట్స్ చూడకపోయినా పర్లేదు, కాసేపు ఆ ఫోన్ను పక్కన పడేసి ప్రశాంతంగా కాఫీ తాగడంలో, నచ్చిన పుస్తకం చదవడంలో ఉండే కిక్కే వేరంటున్నారు ఈ తరం నెటిజన్లు.
శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడానికి డీటాక్స్ డైట్ చేసినట్లే, మెదడులోని డిజిటల్ చెత్తను క్లియర్ చేయడానికి ‘డిజిటల్ డీటాక్స్’ ఒక అద్భుతమైన థెరపీగా మారింది. వారంలో కనీసం ఒక్క రోజైనా, లేదా రోజులో కొన్ని గంటలైనా ఇంటర్నెట్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండటమే దీని ప్రత్యేకత. ఈ సమయంలో స్క్రీన్ వైపు చూడకుండా, ప్రకృతితోనో లేదా కుటుంబంతోనో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి, సృజనాత్మకత అద్భుతంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
తెలిసో తెలియకో మనం చేసే అతిపెద్ద తప్పు ‘డూమ్ స్క్రోలింగ్’. అంటే సోషల్ మీడియాలో నిరంతరం బ్యాడ్ న్యూస్, విషాదకరమైన వార్తలు లేదా నెగెటివ్ కంటెంట్ను గంటల తరబడి స్క్రోల్ చేస్తూ చూడటం. ఇది తెలియకుండానే మన మనసును కుంగుబాటుకు గురిచేస్తుంది. ఫ్యూచరిస్టిక్ లైఫ్ స్టైల్ల్ని ఇష్టపడేవారు ఇప్పుడు ఈ అలవాటును గుర్తించి, ఎరుకతో నెగెటివ్ కంటెంట్కు దూరంగా ఉంటున్నారు. పాజిటివిటీని పంచే అంశాల వైపు అడుగులు వేస్తున్నారు.
మన పెద్దవాళ్లు ఆరోగ్యానికి లంఖణం పరమౌషధం అన్నారు. దాన్ని నేటి తరం ‘టెక్-ఫాస్టింగ్’గా మార్చేసింది. పండుగలప్పుడు లేదా కొన్ని ప్రత్యేక వారాల్లో ఉపవాసాలు ఉన్నట్లే… రోజులో నిర్దుష్ట సమయాల్లో (ఉదాహరణకు రాత్రి 8 గంటల తర్వాత లేదా ఉదయం లేచిన మొదటి గంట) ఎలాంటి గ్యాడ్జెట్స్ ముట్టుకోకూడదని కఠినమైన నియమం పెట్టుకోవడమే టెక్-ఫాస్టింగ్. దీనివల్ల నిద్రలేమి సమస్యలు తొలగిపోయి, గాఢ నిద్ర పడుతుంది.
నిరంతరం ఆన్లైన్లో ఉంటూ లైక్లు, కామెంట్ల కోసం ఆరాటపడే కాలం పోయింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సరికొత్త కాన్సెప్ట్ ‘సైబర్-సాలిట్యూడ్’. అంటే ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటూనే, డిజిటల్ స్పేస్లో తనకంటూ ఒక ప్రశాంతమైన ఏకాంతాన్ని సృష్టించుకోవడం. నోటిఫికేషన్లను ‘మ్యూట్’లో పెట్టడం, అనవసరమైన వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవడం, వర్చువల్ ప్రపంచానికి దూరంగా మనతో మనం మాట్లాడుకోవడం దీని ముఖ్య ఉద్దేశం.
భవిష్యత్తులో రోబోలు, ఏఐ ప్రపంచాన్ని ఏలబోతున్న తరుణంలో, మనలోని ‘హ్యూమన్ టచ్’ కోల్పోకుండా ఉండాలంటే ఈ కొత్త తరం లైఫ్స్టైల్ల్ సూత్రాలను పాటించక తప్పదు. మరి ఇప్పటి నుంచి మీరేం మొదలు పెడుతున్నారు? జోమోనా… లేక డిజిటల్ డీటాక్సా? ఆలోచించండి, మీ మైండ్ను రీబూట్ చేసుకోండి!