Akshay Raskar | మహారాష్ట్రలోని కోల్గాం.. వానలు లేక, పంటలు పండక, సర్కారు ఆదుకోక రైతన్నల ఆత్మహత్యలతో తల్లడిల్లిన గ్రామం. ఇప్పుడు పరిస్థితి మారింది. చావులు ఆగిపోయాయి. అలా అని ప్రభుత్వం ఎలాంటి చేయూతా ఇవ్వలేదు. రైతుల ఆలోచనల్లోనే మార్పు వచ్చింది. నాగలి పట్టిన చేతులు.. కీబోర్డు మీద బ్లాగు రాతలు మొదలుపెట్టాయి. సాగుకంటే ఇదే బాగుందంటున్నారంతా.
అక్షయ్ రాస్కర్ ఎప్పట్లాగే తన ఎలక్ట్రానిక్స్ దుకాణంలో సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నాడు. ఇంతలో ఫోన్కి ఒక మెసేజ్. ‘మీ బ్యాంకు ఖాతాలో 222 డాలర్లు జమ అయ్యాయి’ అని సారాంశం. మొదట్లో నమ్మలేదు. ‘నా ఖాతాలో ఇంత డబ్బు పడటం ఏంటి? అందులోనూ.. డాలర్లు నాకెవరు పంపుతారు?’ అని సందేహించాడు. తీరా చూస్తే యూట్యూబ్లో మూడేండ్ల క్రితం తాను అప్లోడ్ చేసిన వీడియోకు లెక్కలేనన్ని వ్యూస్ రావడంతో.. గూగుల్ ఆ డబ్బు పంపిందని తెలుసుకున్నాడు. ఆ వీడియో వెనుకా ఓ కథ ఉంది. అక్షయ్ ఏదో పనిమీద నాసిక్ సమీపంలోని ఓ గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఓ రైతు తన పొలాన్ని వినూత్నంగా.. బైక్కు నాగలి బిగించి దున్నడం గమనించాడు. ఆ దృశ్యాన్ని తన స్మార్ట్ఫోన్తో వీడియో తీసి ‘గ్రేట్ ఇండియన్ జుగాడ్’ అనే యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశాడు. తర్వాత ఆ సంగతే మరిచిపోయాడు. ఆ వీడియో ఆరు మిలియన్ల వ్యూస్ సంపాదించింది. అక్షయ్కి లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. అప్పటివరకు అక్షయ్కి కానీ, కోల్గాం గ్రామ ప్రజలకు కానీ యూ ట్యూబ్ ద్వారా ఇంత డబ్బు సంపాదించొచ్చు అనే విషయమే తెలియదు.
నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన అక్షయ్ తల్లిదండ్రుల కష్టాలు చూసి.. జీవితంలో అస్సలు వ్యవసాయం జోలికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు. చిన్నదైనా సరే.. వ్యాపారమే మేలనే నిర్ణయానికి వచ్చాడు. అప్పటికి అక్షయ్ వయసు ఇరవై ఏండ్లు. ఊళ్లోనే చిన్న ఎలక్ట్రానిక్స్ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యూట్యూబ్ నుంచి భారీగా డబ్బు రావడంతో దాన్నే తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. బ్లాగింగ్ మొదలు పెట్టాడు. యూట్యూబ్లో మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయడం ప్రారంభించాడు ఇప్పుడు అక్షయ్ మరాఠీ భాషలోనే మొత్తం ఎనిమిది బ్లాగులు నడుపుతున్నాడు. రైతులు, వ్యవసాయం గురించి ఆసక్తికరమైన, ఉపయోగకరమైన విషయాలు చెప్పే ‘కృషి న్యూస్’ అందులో ఒకటి. ఈ మధ్య ఆయన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ‘వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఏమేం చూడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’ అనే వీడియో గురించి మరాఠీ మీడియాలోని మెయిన్స్ట్రీమ్ సంస్థలన్నీ కథనాలు ప్రచురించాయి, టెలికాస్ట్ చేశాయి.
అప్రయత్నంగా అప్లోడ్ చేసిన ఒక వీడియో తన జీవితాన్నే మార్చేయంతో అక్షయ్ తన కెరీర్ వ్యూహాన్ని మార్చుకున్నాడు. దీన్నో పూర్తికాల ఉపాధిగా ఎంచుకున్నాడు. బ్లాగింగ్ స్కూల్ పెట్టాడు. ఎంతోమందికి బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం నేర్పిస్తున్నాడు. వ్యవసాయంలో నష్టాలొచ్చి, అప్పులు చేసి చేతులు కాల్చుకున్న రైతులు, వారి పిల్లలు ఇప్పుడు అక్షయ్ దగ్గర బ్లాగింగ్ చేస్తున్నారు. నేరుగా 30 మంది యువకులకు ఉపాధినిస్తూ.. నెలకు నలభై లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అక్షయ్ స్ఫూర్తితో కోల్గాం గ్రామంలో వందల మంది బ్లాగింగ్ చేస్తున్నారు. ఆ ఊరి పోస్టులంటే భలే గిరాకీ. మహారాష్ట్రలో లక్షల మంది చదువుతున్నారు. వ్యవసాయం, రైతులు, నేరాలు, సినిమా, ఆర్థికం, ఆటలు, కార్మికులు .. ఇలా ఎన్నో అంశాల చుట్టూ కథనాలు రాస్తున్నారు కోల్గాం గ్రామస్థులు. ఒకప్పుడు పంటలు పండించిన చేతులు.. ఇప్పుడు వార్తలు వడ్డిస్తున్నాయి. ‘ఇంటర్నెట్ ద్వారా డబ్బులు సంపాదించొచ్చు అని చెప్తే అందరూ నన్ను ఎగతాళి చేశారు. వాళ్లకు తెలియదు కాబట్టి అలా మాట్లాడారేమో. కొంతకాలం తర్వాత వాళ్లే వాస్తవాలు తెలుసుకున్నారు. ముందుగా యువకులు, విద్యార్థులు నాతో జత కలిశారు. ఆ తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది’ అని చెప్పుకొచ్చాడు అక్షయ్. బ్లాగింగ్ ఆదాయంతో దాదాపు వందమంది సొంతిళ్లు కట్టుకున్నారు. బ్యాంకు రుణాలు తీర్చారు. పేద విద్యార్థులు తమ చదువులు కొనసాగిస్తున్నారు. స్పోర్ట్స్ బైకులు, యాపిల్ ఫోన్లు అక్కడ దర్శనమిస్తున్నాయి.