KCR | ప్రతిక్షణం శీలపరీక్ష. అనుక్షణం అగ్నిపరీక్ష. తానేమిటో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదు. కానీ, కేసీఆర్ నిరూపించుకున్నాడు. తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పడం కోసం పదే పదే నిరూపించుకున్నాడు. ఉద్యమ బడబానలం ఉప్పెనలా ఎగిసిపడుతుందని హెచ్చరించడానికి అదేపనిగా నిరూపించుకున్నాడు. ఈ పోరాటంలో.. ఆయన తనను తాను పణంగా పెట్టుకున్న ప్రతిసారీ.. తల్లి తెలంగాణ తల్లడిల్లింది. తనను తాను నిరూపించుకున్న ప్రతిసారీ.. గర్వంతో ఉప్పొంగిపోయింది.
ఎదురీతలు ఆయనకు కొత్తకాదు. సంకల్పమే ఆయన అస్త్రం. సాహసమే ఆయన శస్త్రం. ఎగుడుదిగుడు దారిలో పయనం సాగించి.. ఒడుపుగా విజయం సాధించి.. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన ‘ద లీడర్’ కేసీఆర్ ఇప్పుడు ఏడుపదుల యువకుడు. సప్తతిలోనూ రాష్ట్ర నిర్మాణం కోసం స్థపతిలా శ్రమిస్తున్న కేసీఆర్ వ్యక్తిత్వం మహోన్నతం. వక్తృత్వం సమ్మోహనం. ఆలోచన సమగ్రం. ఆచరణ విలక్షణం. నిర్ణయం సంచలనం. సామర్థ్యం అచంచలం. ఇలా ఎన్నో పార్శాలను తనలో ఇముడ్చుకున్న విశిష్ట నాయకుడి జీవన చిత్రం అందరికీ ఆదర్శం..
శిఖరాగ్రానికి చేరుకున్న వ్యక్తి.. పాతాళం నుంచి చూసేవారికి సూదిమొనంతే కనిపిస్తాడు. ఈ బక్కపల్చని మనిషి అందనంత ఎత్తుకు వెళ్లాడని హర్షించకపోగా.. అందకుండా పోయాడని విమర్శిస్తూ తమ కుసంస్కారాన్ని వెళ్లగక్కుతారు కొందరు. కానీ, అందలం చేరుకునే క్రమంలో ఆ వ్యక్తి ఓ శక్తిగా పరిణామం చెందాడు. ఆ శక్తిని సంతరించుకున్న వ్యక్తి ఆసక్తంతా తను ఎక్కడి నుంచి వచ్చానన్న దానిపైనే ఉంటుంది. తన వ్యక్తిత్వ, అస్తిత్వ నిర్మాణ క్రమంలో వేసుకున్న పునాదులు ఏమిటో ఆయనకు ఎప్పుడూ గుర్తుంటాయి. వాటిపై పదిలంగా కూర్చిన రాళ్ల నమూనాలూ గుర్తుంటాయి. వాటిని పేర్చే క్రమంలో నలిగిన వేళ్ల గుర్తులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. కట్టిన గోడ కట్టినట్టే కూలిపోయిన దాఖలాలూ ఉన్నాయి. రాతి మధ్యలోంచి
మొలుచుకొచ్చిన కలుపు మొక్కలు రాత్రికి రాత్రి తిన్నింటి గోడలకు బీటలు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆయన దేనికీ వెరవలేదు. ఎప్పుడూ బెదరలేదు. ఎన్నోసార్లు ఆయన్ను పలకరించబోయిన కుంగుబాటు… ఈ మనిషిని లొంగదీసుకోవడం చేతకాక కృశించి నశించింది. ఉద్యమ పథంలో… తన కల సాకారానికి ఎన్నుకున్న ఎన్నికల ఎత్తులకు.. ఇప్పుడు ఆయన అతీతుడు. గెలుపును మెచ్చుకోలుగా చూడటం, ఓటమికి నొచ్చుకొని పోవడం ఇవన్నీ ఎప్పుడో దాటేశారు. దటీజ్ కేసీఆర్!
దేశ రాజకీయ చరిత్రలో కేసీఆర్కు ఎదురైనన్ని పరీక్షలు మరెవరికీ తారసపడకపోవచ్చు. ఆయన భాష మీద దాడి చేశారు. వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేశారు. నిబద్ధతను ప్రశ్నించారు. నడవడిని ఎగతాళి చేశారు. ఆయన ఒంటిచేత్తో సాధించిన విజయాలను పథకం ప్రకారం ఇతరులకు ఆపాదించారు. వెనక్కి తగ్గినప్పుడు మాత్రం కేసీఆర్ పని అయిపోయిందంటూ వక్ర భాష్యాలు చెప్పారు. దుర్దశలో ఉన్నాడంటూ బలహీనపర్చాలని ఉద్దేశపూర్వకంగా కుయుక్తులు పన్నిన ‘గేలి’కేయులందరూ కాలగతిలో గాలికి కొట్టుకుపోయారు. ఎవరెన్ని మాటలన్నా.. తొణకని, బెణకని మనస్తత్వం కేసీఆర్ సొంతం. ఎదురుదెబ్బ తిన్నప్పుడు పగవాడు సైతం అబ్బురపడేలా నిబ్బరం ప్రదర్శించేవారు. ఎదురులేనంతగా ఎదిగినప్పుడు కూడా ఒదిగి ఉండేవారు. అంతెందుకు ఆయన రాజకీయ ప్రస్థానమే ఎదురుదెబ్బతో మొదలైంది. తనను రాజకీయంగా తీర్చిదిద్దిన సిద్దిపేట గడ్డమీదే మొదటిసారి ఓటమి రుచి చూశారు. 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రజలకు దగ్గరవ్వడమే పరిష్కారంగా భావించారు. ఊరూరూ తిరిగారు. ప్రతి దళిత గూడునూ పలకరించారు. వీధివీధినీ గుర్తుంచుకునేలా పట్టుసాధించారు. ఫలితం 1985 ఎన్నికల్లో విజయం. ఆయన్ను అంటిపెట్టుకుందామని అనుకున్న ఓటమి.. రెండేండ్లకే తట్టాబుట్టా సర్దుకొని సెలవు పుచ్చుకుంది. ఇప్పటికీ ఆయన దరిదాపుల్లోకి రావాలంటేనే జంకుతున్నది.
రాజకీయ వ్యూహాలు రచించడంలో కేసీఆర్ది విభిన్నమైన శైలి. దారులన్నీ మూసుకుపోయినా బిగించిన పిడికిలి సడలించిన దాఖలాల్లేవు. తను నెగ్గడానికి ఎన్నడూ తగ్గని మనిషి.. తెలంగాణ కోసం ఎన్నోసార్లు ఒగ్గారు. ‘నీ సత్య సంధత నిరూపించుకోవాల’ని అనామకుడు కోరినా అందుకు సిద్ధపడ్డారు. ఆ పట్టుదలే కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తేగల సమర్థుడని జయశంకర్ సార్ విశ్వసించేలా చేసింది. తెలంగాణ ఆకాంక్షను వమ్ము చేయడన్న నమ్మకమే కష్టనష్టాల్లో ఆ పెద్దాయన… కేసీఆర్కు అండగా నిలిచేలా చేసింది. బీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు ప్రత్యేక రాష్ట్ర కోరిక దాదాపు అంతర్థానమైంది. జయశంకర్ సార్ లాంటి కొందరు మేధావులు ‘ఎవరైనా రాకపోతారా..’ అని ఎదురుచూస్తున్న సందర్భం. దేవదత్త శంఖారావంతో ‘వచ్చినవాడు ఫల్గుణుడు..’ అన్నట్టుగా కేసీఆర్ రంగప్రవేశం ఓ కీలక మలుపు. అగ్గిబరాటా ఉద్యమబావుటా అయిందన్న విశ్వాసం వారిలో చిగురించిన క్షణమది.
తెలంగాణ జెండాతో కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో పోరాట శకం మొదలైంది. అప్పటివరకు ఉద్యమం అంటే హింస ఉండాలి, కాల్చేయాలి, కూల్చేయాలి అనే భావన ఒకటుండేది. తెలుగు సినిమా హీరోలు విలన్ల మీద విరుచుకుపడ్డట్టు ఉంటుందని భావించారు. అది సరైన పంథా కాదనుకున్నారు కేసీఆర్. పిడికిలి బిగించాలి కాని, ఎత్తిన పిడికిలిని దాడికి ఉపయోగించొద్దు అనుకున్నారు. పార్లమెంటరీ విధానంతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించొచ్చని నిశ్చయించుకున్నారు. దారి తప్పితే తెలంగాణ ప్రజల దశాబ్దాల ప్రజల ఆకాంక్ష 1969 పోరాటంలా రక్తసిక్తమవుతుందని గ్రహించారు. అందుకే, రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే, రాజ్యాంగ బద్ధంగానే, రాజకీయంగానే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని బలంగా నమ్మారు.
ప్రజలకూ నమ్మకం కలిగించారు. వాళ్లను ఉద్యమంలో భాగం చేయడంలో సఫలమయ్యారు. రాజకీయంగా రాజీలేని పోరాటం చేస్తే.. తెలంగాణ తథ్యమని పదేపదే పిలుపునిచ్చారు. అహింసా పద్ధతిలో పోరాటానికి సిద్ధమైన కేసీఆర్ను నిలువరించడం అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద చిక్కే అయింది. శాంతియుతంగా సభలు నిర్వహించుకుంటే ఎలా ఆపగలరు? భావజాలాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు పన్నినా కేసీఆర్ చాణక్యం ముందు అవి పనిచేయలేదు.
ఉద్యమానికి ఉద్యుక్తుడైన రోజు కేసీఆర్ దగ్గర ఏముంది? ధనం లేదు. బలం లేదు. బలగం లేదు. ఏ ప్రాంతం కోసం పోరాటానికి సిద్ధమయ్యాడో అదీ ఒక్కుమ్మడిగా తన వెంట నడుస్తుందన్న నమ్మకమూ లేదు. వాక్కు తప్ప మరే దిక్కూ లేదు! ఆ మాటనే తూటాగా పేల్చారు కేసీఆర్. ఉమ్మడి పాలకులు నీళ్ల విషయంలో తెలంగాణను ఎలా ముంచుతున్నారో అర్థమయ్యేలా చెప్పారు. మన నిధులను ఎలా తరలించుకుపోతున్నారో విడమర్చారు. నియామకాలను ఎలా తన్నుకుపోతున్నారో విశ్లేషించారు.
శాంతి, అహింసతోనే రాష్ర్టాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చిన ఆయనే… ఉద్యమంలో వెనక్కి తగ్గితే తనను రాళ్లతో కొట్టి చంపండని పిలుపునివ్వడం ఓ సంచలనం. దీంతో అన్నాళ్లూ మేధావుల చర్చల్లో, చిన్నచిన్న సమావేశాల్లో పొడిపొడిగా వినిపించిన తెలంగాణం ఎన్నికలను ప్రభావితం చేసేంతగా ప్రజల్లో నానింది. ఆయన ఉద్యమాన్ని నడిపిన విధానం.. భౌగోళికంగా మన రాష్ర్టాన్ని రూపుమాపిన కాంగ్రెస్ కూడా తెలంగాణ ఏర్పాటును ఎన్నికల హామీగా ప్రకటించేలా చేసింది. కరుడుగట్టిన సమైక్య పార్టీనీ ‘జై తెలంగాణ’ అనేలా చేసింది. గల్లీలో పుట్టిన నినాదం ఢిల్లీ దాకా చేరడంలో ఆయన ఎత్తుగడలే నిచ్చెనలయ్యాయి.
2004 సార్వత్రిక ఎన్నికల వేళకు తెలంగాణ పల్లెపల్లెకూ చేరింది. గడప గడపకూ పాకింది. ఊరూరా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. తెలంగాణ పాటలు మార్మోగాయి. అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం రాజకీయ వర్గాల్లో పెద్దచర్చకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేయాలనుకున్నారు కేసీఆర్. కానీ, తెలంగాణవాదమే గెలవాలన్న ఏకైక సంకల్పం… పొత్తు కోసం కాళ్లబేరానికి వచ్చిన కాంగ్రెస్ మాటను కేసీఆర్ మన్నించేలా చేసింది. ఎన్నికలయ్యాయి. టీఆర్ఎస్ పొత్తుతో కాంగ్రెస్ గద్దెనెక్కింది.
రాజకీయ ప్రక్రియ వేగవంతం చేయాలి. తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో పెట్టి చేతులు దులుపుకొన్నది కాంగ్రెస్. వాయిదాల రాగం ఎత్తుకుంది. దారులు మూసుకుపోయాయి. ‘ఇంకేముంది అంతా అయిపోయింది. పదవులు తీసుకున్నారు..’ అని కేసీఆర్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. మళ్లీ సందిగ్ధం, సంక్లిష్టత! తెంపుకొంటే చేసిందంతా తుంచుకున్నట్టే! పట్టుకుంటే ఉద్యమం కట్టు తప్పిందన్న నిందలు.
‘ఇంత దూరం తీసుకొచ్చినవ్ నువ్వే! కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో పెట్టించినవ్… ఇప్పుడు వెనక్కిపోతే ఇబ్బంది’ అని దగ్గరి వ్యక్తుల సలహాలు. లౌక్యంగా బయటపడాలన్నది కేసీఆర్ వ్యూహం. మరోవైపు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలు పెరిగాయి. పోతిరెడ్డిపాడు విషయంలో ఆ ప్రభుత్వ వైఖరికి, తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణికి నిరసనగా కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా అస్త్రం సంధించారు.
తెలంగాణ ఆకాంక్ష నివురుగప్పిన ప్రతిసారీ.. దాన్ని జ్వలింపజేసేలా కేసీఆర్ వజ్ర సదృశమైన నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఉద్యమానికి హైప్ తీసుకురావాలి. తెలంగాణ వాదం ఎంతలా వేళ్లూనుకుందో చాటి చెప్పాలి’ ఇదే ఆయన తపన. అందుకు తగ్గట్టుగా కచ్చితమైన హేతువును అందుకోవడంలో కేసీఆర్ చూపిన రాజకీయ చతురతకు తిరుగులేదు. కరీంనగర్ ఉప ఎన్నిక అలాంటి ఎత్తుగడే! ‘తెలంగాణవాదం ఎక్కడుంది?’ అని అప్పటి కాంగ్రెస్ మంత్రి ఎమ్మెస్ మాటజారుడుతనానికి ఓటుతోనే దీటుగా జవాబు ఇవ్వాలనుకున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘కరీంనగర్ ఉప ఎన్నిక వెయ్యి అలజడుల పెట్టు. ఇది మనకు అంతిమ యుద్ధం. చావో, రేవో తేల్చుకుందాం. మిమ్మల్ని లాఠీ దెబ్బలు తినమనడం లేదు. వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారాలు పాడుచేసుకోమని చెప్తలేను. చేయాల్సిందల్లా.. ఓటుతో బదులిద్దాం. తెలంగాణవాదాన్ని బలంగా వినిపిద్దాం’ అని పిలుపునిచ్చారు.
ఆ రోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జెడ్పీటీసీలు లేరు, ఎంపీపీలు లేరు. కేసీఆర్ను ఓడించడానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చెయ్యని కుతంత్రం లేదు. తాబేదార్లయిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. వీటన్నిటి మధ్య కరీంనగర్ ఉప ఎన్నిక జరిగింది. యావత్ తెలంగాణం రొమ్ము విరుచుకొని, జబ్బ చరుచుకునేలా ఫలితం వచ్చింది. మళ్లీ ఉత్సాహం. కానీ, క్రెడిట్ గేమ్లో ఈ గెలుపును కేసీఆర్కు కట్టబెట్టడం ఇష్టం లేని కొందరు పత్రికాధిపతులు తెలంగాణపై అసంకల్పిత ప్రేమను ఒలకబోశారు. కేసీఆర్ గెలుపును తెలంగాణ విజయంగా చెప్పడానికి మనసొప్పక పోగా, ‘ఎన్నికలకు దీనికి ముడిపెట్టడం ఏమిటి?
ఓడిపోయి ఉంటే తెలంగాణవాదం ఓటమి పాలయ్యేది కదా!’ అని సుదీర్ఘ వ్యాసాలు రాసి కుటిల కుతి తీర్చుకున్నారు. ఉద్యమాన్ని తాకట్టు పెట్టారంటూ విశ్వసనీయతను ప్రశ్నించే ప్రయత్నాలు చేశారు. రెండోసారి ఉప ఎన్నికల సందర్భంలో… టీఆర్ఎస్ దెబ్బతినడంతో మరోసారి కేసీఆర్ పని అయిపోయిందని అత్యుత్సాహం ప్రదర్శించారు. కానీ, ఆశించిన ఫలితాలు రానంత మాత్రాన కుదేలయ్యే రకం కాదు కేసీఆర్. ఆయన నిస్తేజంలో కూరుకుపోయే వ్యక్తే అయితే.. తెలంగాణ ఉద్యమం అంత సుదీర్ఘకాలం జరిగి ఉండేది కాదు. ‘ఒక సమయం వస్తది. తెలంగాణ అంతా ఒకవైపు నిలబడతది. అప్పుడు బరిగీసి రాష్ట్రం సాధించుకుంటం’ అని ఆయన ఎప్పుడూ నమ్మేవారు.
నీరవ నిశ్శబ్దం నుంచి పొలికేక పుట్టించే శక్తి కేసీఆర్కు ఉంది. అదును చూసి పదునైన అస్త్రం సంధించడంలో సవ్యసాచి. తాత్కాలిక ప్రయోజనం ఆశించి కాకుండా.. ఉన్నతమైన, ఉదాత్తమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆయన ఎత్తులు, పొత్తులతో ప్రత్యేక వాదాన్ని సహించని పార్టీలతో కూడా తెలంగాణకు సమ్మతమే అని ఒప్పించ గలిగారు. ఇదే చతురత 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు దారితీసింది. అయితే, పొత్తు ధర్మాన్ని పాటించని టీడీపీ రెబెల్స్ను రంగంలోకి దించడంతో టీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణ ఆకాంక్ష గాల్లో దీపంలా మారింది. ఆ సమయంలోనూ కేసీఆర్ చలించలేదు. వాలుకు కొట్టుకుపోయే రకం కాదు.
ఎదురీత ఆయన సహజ స్వభావం. పడిన కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి ఒక్క అంశం చాలు! తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తూ సర్కార్ తీసుకొచ్చిన 14ఎఫ్ను చివరి అస్త్రంగా ఎంచుకున్నారు. ఈసారి ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ ఇదీ నినాదం. నిరాహార దీక్షతో ఉద్యమాన్ని పునరుత్థానం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైంద’న్న ప్రకటన సాధించేంత వరకు పచ్చిగంగ ముట్టుకోలేదు. ఉద్యమబాటలోకి వచ్చినప్పుడు ‘పార్లమెంటరీ విధానంలోనే తెలంగాణ సాధిస్తాన’న్న ఆయన మాట అక్షర సత్యమైంది. కేంద్ర ప్రభుత్వం మళ్లీ వెనక్కి తగ్గడం, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటం, చివరికి కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించేంత వరకు కేసీఆర్ గిరిగీసి బరిలో నిలబడ్డారు. ఆయన బలంగా నమ్మినట్టు ఆ సమయంలో తెలంగాణ అంతా ఒక్కటైంది. తెలంగాణ సమాజం ఆయన వెంట నిలిచింది. ఆయన చెప్పినట్టు విన్నది. ఆయన చేయమన్నట్టు చేసింది.
2014లో రాష్ట్రం ఏర్పాటైంది.. ‘ఖేల్ ఖతం.. టీఆర్ఎస్ బంద్’ అనుకున్నారంతా! తెలంగాణ ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ అవసరమేందని ప్రశ్న! ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నిర్ణయమూ తెలంగాణ కోసమే! కేసీఆర్కు తెలంగాణ సాధించిన ఘనత చాలు! ప్రత్యేక రాష్ర్టాన్ని అన్నిటా ప్రత్యేకంగా నిలపాలంటే ప్రజా ప్రభుత్వమే అధికారంలోకి రావాలనుకున్నారు. కేసీఆర్ను ప్రజలు బలంగా నమ్మారు. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. అన్నింటా తెలంగాణను అగ్రపథంలో నిలిపారు. మూడోసారి ఎన్నికల ఫలితం అనుకూలంగా రాకపోవచ్చు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోవచ్చు. కానీ, తెలంగాణ కోసం నడుం బిగించాల్సి వస్తే.. మొదటి వ్యక్తి ఆయనే అవుతారన్నది సత్యం. తెలంగాణకు అన్యాయం జరిగితే నిలదీసే మొదటి గొంతుక ఆయనదే అవుతుందన్నది శిలాక్షరం.
ఉద్యమ ప్రస్థానంలో, రాజకీయ చదరంగంలో కేసీఆర్ వెంట నడిచిన వారు ఎందరో! కొందరు దూరమయ్యేవారు! కొందరు కొత్తగా వచ్చేవారు!! ఎందరు దూరమైనా చలించని వ్యక్తిత్వం ఆయనది. ప్రజా సమస్యలు, ప్రయోజనాల విషయంలో విభేదించి ఎవరూ ఆయనకు దూరం కాలేదన్నది సత్యం. వ్యక్తిగత ఆసక్తులతో ఆయన్ను కలిస్తే పెద్దగా పట్టించుకోరు కేసీఆర్. పార్టీ కోసం, ఉద్యమం కోసం త్యాగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారాయన. విజయశాంతిని గెలిపించడానికి బంగారంలాంటి మెదక్ సీటును ఆమెకు ఇచ్చారు. తెలంగాణ వాదం అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని మెదక్ను కాదనుకొని ఎంపీగా మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదన్న అక్కసుతో, వ్యక్తిగత అవసరాలను నెరవేర్చలేదన్న ఆవేశంలో పార్టీని వీడిపోయేవారి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అన్నిటినీ మించి నమ్మక ద్రోహం చేసేవారిని ఉపేక్షించరు. పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా లెక్కచేయరు.
ఇదీ.. కాలం కాచి వడబోసిన నాయకుడి కథ.కాలాన్ని కాచి వడబోసిన యోధుడి గాథ. ఓ యాభై ఏండ్ల తర్వాత, అప్పటి తరం కేసీఆర్ను కాల్పనిక పాత్ర అనుకున్నా… ఆశ్చర్యపోనవసరం లేదు!
ఎందుకంటే… ఆయన అలా ఉండటం ఆయనకే సాధ్యం. ఆయనలా ఉండటం మరొకరికి అసాధ్యం.క్లుప్తంగా చెప్పాలంటే కేసీఆర్… ఉద్యమకారులకు ఊతం. లీడర్లకు పాఠం. అసలైన సంక్షేమానికి నిర్వచనం. సిసలైన
అభివృద్ధికి సాక్ష్యం. ప్రబంధ కావ్య భాషలో చెప్పాలంటే కేసీఆర్.. అభినవ రాజర్షి. సినీ పరిభాషలో చెప్పాలంటే ఆయన మగాడ్రా బుజ్జీ!
కేసీఆర్ ప్రసంగం ఓ సజీవ జలధార. ఆయన మాటల్లో నవరసాలు ఒలుకుతాయి. సందర్భోచితంగా, రసస్ఫోరకంగా మాట్లాడగలరు. ఆయన ఉపన్యాసంలో రౌద్రం ఉంటుంది. వీరత్వం ఉంటుంది. ఆర్తి వినిపిస్తుంది. కరుణ కనిపిస్తుంది. హాస్యం తొణికిసలాడుతుంది. వ్యంగ్యం తొంగిచూస్తుంది. శబ్ద నిఘంటువు పొంగిపోయేలా పదప్రయోగాలు చేస్తుంటారు. ప్రసంగించే వేదికకు తగ్గట్టుగా ఆయన మాటలు పల్లవిస్తుంటాయి. సాహితీ సభలో పద్యాలు వినిపిస్తూ పసందైన ప్రసంగం చేస్తారు. చలోక్తులు విసురుతూ సభను రంజింపజేస్తారు. వేదిక ఏదైనా సభికులను కట్టిపడేయడం ఆయన తనకు తానుగా నేర్చుకున్న విద్య. సాహితీవేత్తల సాంగత్యం, పుస్తక పఠనం, విషయ అవగాహన, భాషా పరిజ్ఞానం ఇవన్నీ కేసీఆర్ను అత్యుత్తమ వక్తగా తీర్చిదిద్దాయి. సంక్లిష్టమైన విషయాన్ని కూడా అత్యంత సరళంగా చెప్పడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడుతుంటే జనం ఊగిపోతూ విన్నారు. ఒగ్గుకథ వింటున్నట్టుగా విన్నారు.
జలసాధన క్యాసెట్లో ఉన్న కేసీఆర్ మాటలను ఊరూరా చౌరాస్తాల్లో బుంగీలు పెట్టుకొని మరీ విన్నారు. అంతగా ప్రభావితం చేశాడు. విషయంతోపాటు సభను కూడా ఓన్ చేసుకుని ఆయన మాట్లాడే శైలికి అందరూ అభిమానులే! కానీ, ఆంధ్రా మీడియా మాత్రం కేసీఆర్ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకుంది. భాష మీద, సాహిత్యం మీద, ఆయా విషయాల మీద ఆయనకున్న సాధికారతను కావాలనే విస్మరించింది.
కేసీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పనిగట్టుకొని ఆయనను మాటల మాంత్రికుడనీ, మాయల మరాఠీ అనీ అవగాహనా రాహిత్యంతో నోటి కొచ్చినట్టు విశ్లేషించారు ఆ మీడియా పెద్దలు. కేసీఆర్ వ్యక్తిగత అలవాట్లను భూతద్దం పెట్టి చూపించారు. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడాన్ని కూడా వేలెత్తి చూపారు. ఆయన నోటి వెంట రత్నాలు రాలాయి, రాళ్లూ రాలాయి. విజ్ఞులు రత్నాలు ఏరుకున్నారు. కొందరు అజ్ఞానులు రాళ్లు ఏరుకొని విశృంఖలంగా మాట్లాడుతూ, దీనికి ఆద్యుడు కేసీఆరే అంటూ సూత్రీకరించారు. కానీ, కేసీఆర్ మాటల్లో ఉండే ఆర్ద్రత, సృజన వాళ్లు ఎప్పటికీ గుర్తించలేరు.
జయశంకర్ సార్, కేసీఆర్ ప్రయాణం తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం. ఇద్దరి మధ్యా ఉదాత్తమైన అనుబంధం ఉండేది. వీరిద్దరూ విభేదించుకున్న సందర్భాల్లేవు. ఉద్యమ సమయంలో ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే, కేసీఆర్ను ఆయన్నుంచి విడదీసి చూపించే ప్రయత్నం ఎందరో చేశారు. కానీ, వారిద్దరి మధ్య అలాంటి పరిస్థితి ఒక్కనాడూ తలెత్తలేదు. కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమైతదని ఆయన బలంగా నమ్మారు. తెలంగాణ బాధను కేసీఆర్ అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేదని చెబుతుండేవారు. ‘తెలంగాణ ఆవేదన, ప్రత్యేకరాష్ట్ర ఆవశ్యకత గురించి నేను చాలామందికి చెప్పిన. నేను చెప్పినదాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని ప్రజలకు అరటిపండు ఒలిచి ఇచ్చినట్టుగా కేసీఆర్ వివరించగలిగాడు. తెలంగాణ వాదాన్ని ప్రజల మనసుల్లో ఇంకే విధంగా ఆయన చెప్పిన విధానం అద్భుతం. రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నమో మూలాన్ని పట్టుకున్నడు.
రాష్ట్రం సాధించి తీరాలన్న పట్టుదల ఆయనలో కనిపించింది. పొలిటికల్ ప్రక్రియలో, వ్యూహరచన ధురంధరుడు’ అని కేసీఆర్ గురించి జయశంకర్ సార్ చెప్పేవారు. కేసీఆర్లో కొన్ని వ్యత్యాసాలు గమనించినప్పటికీ.. అవి రాజకీయ ఎత్తుగడలో భాగంగా తప్పవని అర్థం చేసుకునేవారు. ఆమరణ నిరాహార దీక్ష సమయంలో జయశంకర్ సార్ చిన్న బ్యాగ్తో ఖమ్మం హాస్పిటల్కు వచ్చారు. తండ్రిలా ఆయన వెంట ఉన్నారు. నిరాహార దీక్ష కొనసాగుతుందని జయశంకర్ సార్ ప్రకటనతో కాంగ్రెస్ కుట్రలకు తెరపడ్డట్టయింది. మరో సందర్భంలో ‘నా సలహాలు కేసీఆర్ వినని సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ సలహాలు నేను వినని సందర్భాలూ ఉన్నాయి. నేనిచ్చిన సలహాలు కొన్నిసార్లు రాజకీయ ఎత్తుగడల్లో ఇమడకపోవచ్చు. నేను కాదన్న నిర్ణయాలు లాభించినవీ ఉన్నాయి’ అని జయశంకర్ సార్ చెప్పడం వారి మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనం.
ప్రతి వ్యక్తి జీవితంలో ఆటుపోట్లు సహజం. గెలుపు ఓటముల సమాహారమే జీవితం. అయితే కేసీఆర్ సాధించిన విజయాల ముందు వైఫల్యాలు చాలా తక్కువ. గెలుపును ఎంత నిరాడంబరంగా స్వీకరిస్తారో.. ఓటమినీ అంతే హుందాగా అంగీకరిస్తారు. అంతేకానీ, నిస్పృహకు గురవ్వరు. ఓటమిపై లోతుగా విశ్లేషించుకుంటారు. వ్యూహానికి పదును పెడతారు. తనలోకి తను వెళ్లిపోతారు. ఉన్న స్థితిని దర్శిస్తారు. మళ్లీ తిరుగులేని విశ్వాసంతో, ధీమాగా వస్తారు. పునరాగమనంలో సంశయాలకు, సందేహాలకు, భయాలకు తావు ఉండదు. ఒక విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునేదాకా అధ్యయనం కొనసాగిస్తారు. ఆయన్ను ఎవరూ కమాండ్ చేయలేరు. అలాగని ఎవరూ ఆయన ముందు మాట్లాడరు అనుకుంటే పొరపాటు! చర్చోపచర్చల్లో అందరి అభిప్రాయాలనూ కూలంకషంగా, ఓపికగా వింటారు. వాటికి రాజకీయ రూపాంతరం ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరి ఇన్ఫ్లూయెన్స్కూ గురవ్వరు. అక్కడ ఆయన పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఒకసారి నిర్ణయానికి వచ్చాక వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదు. దానివల్ల చాలాసార్లు లాభపడిన సందర్భాలూ ఉన్నాయి, కొన్నిసార్లు నష్టపోయినవీ ఉన్నాయి. ఆర్పార్ జిమ్మేదార్ తనదే అని ఫిక్సవుతారు. ఏదేమైనా తన ఆత్మశక్తిపై ఆయనకు అచంచలమైన విశ్వాసం.
తన 70 ఏండ్ల జీవనంలో.. కేసీఆర్ ముప్పయ్ ఏండ్లు తెలంగాణ చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చారు. ఉద్యమానికి ఊపిరిలూదటానికి తన ఉసురు మీదికి తెచ్చుకున్నారు. సమయోచిత నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన శైలి విభిన్నం. పాత తరం అనుభవాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త తరం ఆలోచనలనూ గౌరవిస్తారు. ప్రచార ఆర్భాటం పెద్దగా గిట్టని మనిషి. ‘నా పని కనిపిస్తుంది.. నేను కనిపించకపోతేనేం’ అనుకుంటారు! ఆయనలోని విశాల భావాలే కేసీఆర్ను ప్రజల మనిషిగా నిలబెట్టాయి. ఉద్యమానికి తానే చుక్కాని అయినా… తన వెంట నడిచిన వారందరినీ యోధులుగానే భావించేవారు.
‘జై తెలంగాణ’ అని నినదించిన ప్రతి మనిషినీ గుండెలకు హత్తుకున్నారు. ఉద్యమ సమయంలో వరంగల్లో జరిగిన భారీ సభకు దాదాపు 25 లక్షల మంది హాజరయ్యారు. అంతటి మహాసభలో జేఏసీ కన్వీనర్ కోదండరాంను చూపిస్తూ ‘ఆయన శాసిస్తాడు.. మనం పాటిద్దాం’ అని ప్రకటించారు. ఎంతో విశాలత్వం ఉంటే తప్ప ఒక రాజకీయ నాయకుడు ఈ మాట చెప్పలేరు! తను నిర్మించిన ఉద్యమం, తను నిర్వహిస్తున్న సభ.. అందులో ఒకానొక ప్రొఫెసర్కు పట్టం కట్టడం కేసీఆర్కే చెల్లింది. మిలియన్ మార్చ్ సందర్భంలో.. కోదండరాం వచ్చే వరకూ ఆగి, ఆయన వచ్చాకే ప్రతిజ్ఞ చేయించడం కేసీఆర్ ఉదారతకు చిన్న ఉదాహరణ మాత్రమే! ఇంత విశాలమైన మనిషికి ఫార్మాలిటీస్ అంటే అంతగా గిట్టదు. ఫొటోలకు పోజులివ్వడం, పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం పెద్దగా నచ్చదు. కార్యకర్తలు, అభిమానులు నొచ్చుకుంటారని తప్పక కొన్నిసార్లు మినహాయిస్తారు.
కుటుంబ విలువలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తారు. భార్య శోభమ్మ అంటే బాగా గౌరవిస్తారు. తొమ్మిది మంది ఆడపడుచులు, పెద్ద సంసారాన్ని ఆమె నడిపించిన తీరును ఆయన తరచూ ప్రస్తావిస్తారు. ‘నేను చెతులెత్తి నమస్కరించాల్సి వ్యక్తి నా భార్య’ అని కేసీఆర్ అనడం ఆమె పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది. శోభమ్మకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎన్నికల ప్రచారం పూర్తయి ఇంటికి చేరుకోగానే ముందుగా ఆమె దగ్గరికి వెళ్లి పలకరించడం రివాజు. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి ఎంతోకొంత టైమ్ కేటాయిస్తారు. ప్రతిరోజూ మనవడు, మనవరాలి గదికి వెళ్లి వారిని పలకరిస్తారు. ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దని వాళ్లకు అర్థమయ్యేలా నాలుగు మంచిమాటలు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ ఉక్కుమనిషి.. పర్ఫెక్ట్ ఫ్యామిలీమ్యాన్!
కేసీఆర్ వయసు, శరీరం ఆయన్ను ఇప్పటివరకు ఇబ్బంది పెట్టలేదు. పరిపూర్ణ ఆరోగ్యవంతుడు. ఆత్మశక్తి గొప్పది. ఇటీవల జరిగిన ప్రమాదం నుంచి ఇంత త్వరగా కోలుకుంటారని ఎవరూ అనుకోలేదు! కోలుకోవడమే కాదు.. మరో పోరాటానికి ఉద్యుక్తుడు అవుతున్నారు. ఆయన ఆరోగ్య రహస్యం మితాహారం. నిద్ర, ఆహారం విషయంలో పక్కాగా ఉంటారు. సమయానికి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు గుర్తుచేసి మరీ తీసుకుంటారు. ఆయన చుట్టూ ఒక ఆరా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అందులోకి అంత తేలిగ్గా చొరబడటం అందరికీ సాధ్యం కాదు.
ఒక్కసారి దగ్గరైతే.. అందులోంచి బయటపడలేం. అంతగా అభిమానించి, గుండెల్లో పెట్టుకుంటారు. ఆ స్వచ్ఛత కూడా ఆయన ఆరోగ్య విజయానికి ఒక కారణం కావచ్చు. మనసు బావుంటే, శరీరమూ బావున్నట్టే.
పేరు : కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందరికీ కేసీఆర్, అత్యంత సన్నిహితులకు శేఖరన్న
తల్లిదండ్రులు : దివంగతులు కె.వెంకటమ్మ, కె.రాఘవరావు
కుటుంబం : భార్య శోభ, కొడుకు రామారావు (కేటీఆర్), కూతురు కవిత
స్వగ్రామం : చింతమడక (సిద్దిపేట మండలం)
పుట్టిన తేదీ : 17 ఫిబ్రవరి, 1954
చదువు : బి.ఎ (తెలుగు సాహిత్యం), ఎం.ఎ
రాజకీయ చరిత్ర: 1985లో మొదటిసారి సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ఎన్నిక. 1985, 89, 94, 99, 2001 (ఉప ఎన్నిక) వరుస విజయాలు. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా తొలిసారి గెలుపు. 2006, 08 (ఉప ఎన్నికలు) ఎంపీగా విజయం, 2009లో మహబూబ్నగర్ నుంచి ఎంపీగా గెలుపు. యూపీఏ-1 ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా సేవలు. 2014, 18, 23 గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం. 2014-23 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు.
‘నా పని కనిపిస్తుంది.. నేను కనిపించకపోతేనేం’
‘ఒక సమయం వస్తది. తెలంగాణ అంతా ఒకవైపు నిలబడతది. అప్పుడు బరిగీసి లక్ష్యాన్నిసాధించుకుంటం’
సప్తతిలోనూ రాష్ట్ర నిర్మాణం కోసం స్థపతిలా శ్రమిస్తున్న కేసీఆర్ వ్యక్తిత్వం మహోన్నతం. వక్తృత్వం సమ్మోహనం. ఆలోచన సమగ్రం. ఆచరణ విలక్షణం. నిర్ణయం సంచలనం. సామర్థ్యం అచంచలం. ఇలా ఎన్నో పార్శాలను తనలో ఇముడ్చుకున్న విశిష్ట నాయకుడి జీవన చిత్రం అందరికీ ఆదర్శం..
…? దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ