Women’s Day | గౌరీదేవికి శరీరంలో అర్ధభాగం ఇవ్వడం శివుడి గొప్పదనమా? పరమేశ్వరుడి తనువులో సగభాగం పొందిన పార్వతిది ఆ గొప్పదనమా? అర్ధనారీశ్వరం.. ఆది దంపతుల లీల! ఆమెలో ఆయన, ఆయనలో ఆమె మమేకం కావడం సంసార సూత్రం. అన్నిటా ఇద్దరూ సమానమనే భావన దాంపత్య రహస్యం. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే జగత్తుకు మాతాపితరులైన పార్వతీపరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపాన్ని ఆవిష్కరించారు. శక్తి లేకుండా శివుడు నిలువలేడు అని చెబుతున్నాయి పురాణాలు. జగన్మాత సహకారమే జంగమదేవుడికి ఆయువుపట్టు. శివరాత్రి నాడు కల్యాణంతో పార్వతిని చేపట్టి తనలోని శక్తిని ఉద్దీపన చేసుకుంటాడు శివయ్య! అయితే, ఆ శక్తికి ప్రతిరూపాలుగా ఇలపై వెలసిన కాంతులే ఇంతులు!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమలోని శక్తిని గుర్తించడమే స్త్రీ విజయం.
భారతీయ సంప్రదాయంలో స్త్రీ అంటే వ్యక్తి మాత్రమే కాదు! ఆమె అమ్మవారు దుర్గాదేవికి ప్రతినిధి కూడా. ప్రతి స్త్రీ కూడా తనలోని దుర్గాదేవిని కనుక్కోవాలి. తాము కూడా ఆమెలా శక్తిమంతులు, ధైర్యశాలులు, లక్ష్యం ఉన్నవాళ్లు, అంకితభావం కలిగినవాళ్లు, అమూల్యమైన వాళ్లమని గుర్తించాలి. అమ్మవారిలానే మహిళలూ శాంతమూర్తులే. ఇంటాబయటా ప్రశాంతత నెలకొనాలంటే స్త్రీలదే ప్రధానపాత్ర. ఆమె అంటే శక్తి, ముక్తి, జ్ఞాపకశక్తి. మన పుట్టుకకు కారణం ఆమెనే. స్త్రీ అంటే భక్తికి నిలువెత్తు రూపం. తల్లిగా, సోదరిగా, భార్యగా, స్నేహితురాలిగా ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది. ప్రేమ, శక్తి, ధైర్యం, ఓర్పు, క్షమాగుణం, నిర్భీతి, దయ, బుద్ధి మొదలైన గుణాలతో ఆడతనం విలువను చాటి చెబుతుంది.
అమ్మవారికి 10 చేతులు 20 ఆయుధాలు ఉంటాయి. స్త్రీలు మాత్రం రెండు చేతులతోనే ఇరవై పనులను నిర్వహించాల్సి వస్తుంది. ఆధునిక స్త్రీ ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే, ఉద్యోగ పర్వంలోనూ అందలాలు అధిరోహిస్తున్నది. కుటుంబసభ్యులను కంటికి రెప్పలా చూసుకుంటూ తనవారిని ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడుకుంటుంది. స్నేహితులు, బంధువులతో సంబంధ బాంధవ్యాలను నెరుపుతుంది. అయితే, పురుషాధిక్య సమాజ గాజుతెరలను బద్దలుకొట్టాల్సి వస్తున్నది. నేరగాళ్లు, సమాజ నిర్లక్ష్యం, సహించలేనితనం, వివక్ష, అన్యాయంపై గొంతెత్తాల్సి వస్తున్నది. అలా ప్రతి నిమిషం ఆమె అన్యాయం, అబద్ధం, క్రూరత్వం తదితర రూపాల్లో తనపై దాడిచేస్తున్న అసురులతో అలుపెరగని పోరాటం చేస్తున్నది. ఈ క్రమంలో దుర్గాదేవి ప్రసాదించిన… ప్రేమ, నిజాయితి, ఓర్పు, దయాగుణం, సౌందర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, సంకల్పబలం లాంటి 20 ఆయుధాలను సమకూర్చుకోవాలి.
ఆధునిక స్త్రీకి స్ఫూర్తి అమ్మవారే..
కెరీర్ మహిళలైనా, కుటుంబంతో ఉన్నా ఆధునిక స్త్రీకి నిరంతరం సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. దుర్గాదేవి స్ఫూర్తిగా వీటిని అధిగమించాలి. దీనికోసం కొన్ని ప్రయత్నాలు అవసరం అవుతాయి. అవి..
నీకు నువ్వే బలం: ప్రతి స్త్రీలోనూ అపారమైన బలం దాగి ఉందని అమ్మవారి రూపం మనకు గుర్తుచేస్తుంది. ఆ బలాన్ని గుర్తించి, ధైర్యంగా నిలబడటం అతివ లక్ష్యం కావాలి.
సవాళ్లకు స్వాగతం: దుర్గాదేవి చేతిలో మహిషాసురుడు హతమయ్యే ఘట్టాన్ని భయం, ప్రతికూలతల మీద సాధించిన విజయంగా చూడాలి. అలా అమ్మవారి శక్తి సవాళ్లను ఎదుర్కోవడంలో మాత్రమే కాకుండా వాటిని నిర్మూలించడంలోనూ వెనక్కి తగ్గదని గుర్తుచేస్తుంది. సవాళ్లు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకుండా, నడుం బిగించి వాటిని ఎదిరించాలి.
అనుబంధాలకు అర్థం: దుర్గాదేవి కైలాస శిఖరం
మీద భర్త పరమశివుడు, కుమారులు గణపతి, కుమారస్వామితో కలిసి ఉంటుంది. అలా కుటుంబ బంధాల ప్రాధాన్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. అంతేకాదు.. వాహనాలు, ప్రమథ గణాలు, నంది, భృంగి… ఇలా శివ పరివారం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది మనల్ని ఆశ్రయించిన వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచిస్తుంది. శివ పరివారానికి మాత్రమే కాదు అమ్మవారు విశ్వమంతటికీ అమ్మే. అయినవాళ్లను ఆదరంగా చూడటం వల్ల సంసార జీవనంలో కలతలకు, కలహాలకు తావెక్కడిది?
మార్పునకు శ్రీకారం: దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలుస్తాం. ఈ రూపాలు స్త్రీలు నిత్యజీవితంలో మార్పును ఆహ్వానించాలనే దానికి ప్రతీకలు.
అపార దయాగుణం: యుద్ధంలో భీకరంగా ఉండే దుర్గమ్మలో దయాగుణం, క్షమాగుణం రెండూ ఎక్కువే. అలా మన అనుకునే వారితో మనం ఎలా ఉండాలో ఈ గుణాలు గుర్తుచేస్తాయి. అమ్మను ఉపాసించిన వాళ్లకు అన్నీ అమరుతాయనేది ఉపాసకుల నమ్మకం.
దుర్గాదేవి రూపం, ఆమె కథలు సంస్కృతులు, సరిహద్దులకు అతీతమైనవి. వాటికి సార్వకాలిక, సార్వదేశిక విలువ ఉంది. అవి మనల్ని సాధికారత దిశగా నడిపిస్తాయి. వెనక్కి తగ్గడాన్ని నేర్పిస్తాయి. మార్పు వైపుగా స్ఫూర్తినిస్తాయి. శివరాత్రి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మవారి గుణగణాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి. మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. అంతశ్శక్తిని మేల్కొల్పి భయాలను ఎదుర్కోవాలి. సంబంధ బాంధవ్యాలను పెంచుకోవాలి. సవాళ్లకు ఎదురీదాలి. మార్పును ఆహ్వానించాలి. దయాగుణం, క్షమాగుణం అలవర్చుకోవాలి.
ఇద్దరూ సరిసమానం
శివుడు పరమపురుషుడే అయినా, మనకు అర్ధనారీశ్వరుడిగా కూడా దర్శనమిస్తాడు. అలా సగం స్త్రీరూపాన్ని తనలో ఇముడ్చుకున్నాడు. శివుడు తాదాత్మ్యంలో ఉన్న రూపాన్ని చూసిన పార్వతి ఆయనపట్ల ఆకర్షితురాలైంది. ఎంతో తపస్సు చేసి పరమశివుణ్ని పతిగా సాధించుకుంది. పెండ్లయిన తర్వాత ఓ రోజు శివుడు తనలో తాను తాదాత్మ్యం చెందుతున్న అనుభూతి తనకూ కావాలని.. దానికోసం ఏం చేయాలని అడిగింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో ‘ఏమీ చేయాల్సిన పనిలేదు. నా తొడమీద కూర్చుంటే చాల’న్నాడు. పార్వతి అలానే చేసింది. ఆమె కోరిక తీర్చడానికి శివుడు అక్కడితో ఆగకుండా తనలో సగం చేసుకున్నాడు. అలా అమ్మను తనలో సగం చేసుకోవడానికి శివుడు తన శరీరంలో సగభాగాన్ని వదిలిపెట్టాడు. ఆమె కూడా అంతే. ఇదే అర్ధనారీశ్వరుల కథ. మనలో స్త్రీ- పురుష తత్వాలు సమానంగా ఉంటాయని చెప్పే ప్రయత్నమే అర్ధనారీశ్వర తత్వం.