ప్రమాదాల్లో జంతువులు, పక్షులు గాయపడితే వాటి బాధ వర్ణనాతీతం. ఆ మూగజీవులు తమ వేదనను, నొప్పిని ఎవరితోనూ వెళ్లబోసుకోలేవు. తమను రక్షించమని మొరపెట్టుకోలేవు. అలా నొప్పిని భరిస్తూనే ఉంటాయి. ఇక బాధ ఏమాత్రం భరించలేని పరిస్థితిలో అవి యాతన పడుతూనే ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాయి. ఇదే రాజస్థాన్ రాష్ట్రం జున్జునుకు చెందిన పశువైద్యుడు అనిల్ ఖిచర్ను కలచివేసింది. గాయాలపాలైన, జబ్బుపడిన మూగజీవులకు సాంత్వన కలగజేయడాన్ని ఆయన తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వాటికి ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకు జంతు ప్రేమికుడుగా గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో జున్జును దగ్గర్లో ఉన్న సికార్, చురు, బికనేర్, పిలాని, హనుమాన్గఢ్, గంగానగర్ తదితర పట్టణాల ప్రజలు ప్రమాదాల్లో గాయపడిన జంతువులను అనిల్ నడుపుతున్న షెల్టర్కు తీసుకుని వస్తుంటారు. ఆయన తనవంతుగా వాటికి మంచి చికిత్స అందించి ఆశ్రయం కల్పిస్తుంటాడు.
“బికనేర్లోని రాజస్థాన్ ప్రభుత్వ పశువైద్యశాస్త్ర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు శిక్షణలో భాగంగా నేను జంతువులు, పక్షులకు చికిత్స చేయాల్సి వచ్చేది. అప్పుడే నేను వాటిపట్ల సున్నితంగా మెలగడం నేర్చుకున్నాను. అలా అది నా జీవిత పరమార్థం మారిపోయింది” అంటాడు డాక్టర్ అనిల్. 2014లో వెటరినరీ డిగ్రీ పూర్తవగానే ఆయన ఈ కార్యక్రమానికి నడుం బిగించాడు. దీనికోసం మొదట్లో ఓ సెకండ్ హ్యాండ్ కార్ సమకూర్చుకున్నాడు.
తగినన్ని మార్పులు చేసి దాన్ని అంబులెన్స్గా మార్చాడు. తన ప్రైవేట్ జంతు వైద్యం ద్వారా సంపాదించిన మొత్తంలో చాలావరకు అనిల్ మూగజీవుల సంరక్షణకు కేటాయిస్తుండటం విశేషం. సొంత డబ్బులతో జున్జునులో అర్ధ ఎకరంపైగా స్థలం కొనుగోలు చేశాడు. తగిన వసతులతో దాన్ని షెల్టర్గా మార్చాడు. అత్యవసర పరిస్థితుల్లో జంతువులకు వేగంగా చికిత్స చేయడానికి, వాటిని షెల్టర్కు తరలించడానికి ఓ అంబులెన్స్ను కూడా కొన్నాడు.
ఈ ప్రయత్నంలో ఆయనకు కుటుంబ సభ్యులు అండగా నిలుస్తున్నారు. “జంతువులు, పక్షులు… మనుషుల జీవితాల్లో విడదీయరాని భాగం. వాటిని కాపాడుకోవడం తప్పనిసరి” అంటాడు అనిల్. ఆయన అంకితభావం కొద్దిమంది స్థానికుల మనసు మార్చడం గొప్పవిషయం.