సృష్టిలో ఏదీ వృథా కాదు. రాతితో శిల్పం జీవం పోసుకుంటుంది. మట్టిలోంచి మణిమాణిక్యాలు పుట్టుకొస్తాయి. ఆ స్ఫూర్తితోనే తనకు అబ్బిన క్రాఫ్ట్ డిజైనింగ్ కళకు ఊపిరినిచ్చి.. మగువల మనసు దోచేలా పర్యావరణహితమైన, హ్యాండ్ మేడ్ క్లే జువెలరీ తయారు చేస్తున్నది నారాయణపేట జిల్లాకు చెందిన కాకర్ల శ్రావణి.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శ్రావణికి చిన్నప్పటి నుంచీ క్రాఫ్ట్ డిజైనింగ్ అంటే ఇష్టం. పాత కాగితాలు, వాటర్ బాటిల్స్తో కళాకృతులకు రూపం ఇచ్చేది. ఆ అభిరుచే తనను క్రాఫ్ట్ డిజైనర్గా నిలబెట్టింది. నారాయణ పేట జిల్లా ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) అధికారుల ప్రోత్సాహం సహజ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టేలా చేసింది. మహిళా ఆంత్రప్రెన్యూర్స్ వేదిక వీ హబ్ ఆమెలోని నాయకత్వ లక్షణాలను పెంచింది. అలా నారాయణ పేట జిల్లా పెరపళ్లకు చెందిన శ్రావణి టెర్రకోట జువెలరీ తయారీలో కొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నది.
ఎవరైనా బంగారంతో నగలు చేయించుకుంటారు. ప్లాటినం అంటే ఇష్టపడేవారూ ఉన్నారు. కానీ వేల ఏళ్ల కిందటే సింధు నాగరికతలో.. మట్టితో చేసిన నగలను మహిళలు ఇష్టంగా ధరించేవారు. చరిత్ర పాఠాల్లోని ఆ నాలుగు మాటలూ క్లే జువెలరీ పట్ల శ్రావణికి ఆసక్తిని పెంచాయి. డీఎడ్ తర్వాత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూనే మట్టి నగల తయారీని అధ్యయనం చేసింది. ఆ ఆకృతుల రూప కల్పనలో నైపుణ్యం సాధించింది. తనతోపాటు మరో ఇద్దరికి ఉపాధినిచ్చేలా ‘భువి నేచర్ క్రాఫ్ట్స్’ ఏర్పాటుచేసింది.
యూట్యూబ్, గూగుల్ ద్వారా క్రాఫ్ట్ డిజైనింగ్, క్లే ఆర్ట్లో నైపుణ్యాన్ని పెంచుకున్నది శ్రావణి. చెరువులు, కుంటల వద్ద సేకరించిన మట్టిని ప్రత్యేక విధానంలో వడపోసి.. ఆ తర్వాత ఎండ బెడుతుందామె. ఆ మృదువైన మట్టితో ఆకృతులకు రూపం ఇచ్చి.. నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే చాలు. ఆభరణాలు సిద్ధం. వేడి ఎక్కువైనా తక్కువైనా, మట్టిలో ఇసుక రవ్వలు ఉన్నా.. ఐదారు రోజుల కష్టం వృథా అయినట్టే. ఇదంతా జరగడానికి డిజైన్ను బట్టి ఏడు నుంచి పది రోజుల సమయం పడుతుంది. బాగా కాలి నల్లగా మారినప్పుడే రంగులు అద్దడానికి వీలుగా తయారవుతాయి. మట్టికి కొత్త మెరుపూ వస్తుంది.
క్రాఫ్ట్ డిజైనింగ్ నుంచి మట్టి నగల తయారీ వరకు ప్రతి దశలోనూ ఆమెకు వీహబ్ తోడుగా నిలిచింది. శ్రావణి ఆలోచనలకు వ్యాపార దృక్కోణాన్ని జోడించింది. మార్కెటింగ్ మెలకువలు నేర్పింది. సోషల్ మీడియాతో పాటు మౌఖిక ప్రచారం ద్వారా కూడా తన ఉత్పత్తులకు ఆదరణ పెరిగిందని చెబుతున్నది శ్రావణి. తొలినాళ్లలో అంతా అభినందించారే కానీ, కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. క్రమంగా ఫ్యాన్సీ డిజైన్లకు ఆదరణ పెరగడం, సంప్రదాయ లోహాల ధరలు ఆకాశాన్ని అంటడం, గిల్ట్ నగలతో చర్మానికి కలిగే నష్టాలు.. అందరి దృష్టికీ రావడంతో శ్రావణి అందిస్తున్న ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం నెలకు 40-50 ఆర్డర్లు అందుతున్నాయి. చెవి కమ్మల నుంచి భారీ హారాల వరకూ సమస్తం తయారు చేస్తున్నది శ్రావణి బృందం. మట్టి నగలు, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులకు ప్రస్తుతం విశేష ఆదరణ లభిస్తున్నది. ఢిల్లీ, ముంబై, కోల్కతా తదితర ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోనూ మట్టి ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లు, వేడుకలలో ధరిస్తున్నారు. డిజైనర్ చీరలు, దుస్తులకు తగినట్లుగా టెర్రకోట జువెలరీ కావాలంటూ శ్రావణికి ఆర్డర్లు వస్తున్నాయి. ‘ఆధునిక పరికరాలు, క్లే కట్టర్లు, బేకింగ్ మెషినరీ కొనుగోలుకు సర్కారు నుంచి ఆర్థిక ప్రోత్సాహం అందితే.. వ్యాపారాన్ని విస్తరించి నలుగురికి ఉపాధి కల్పిస్తానంటున్నది శ్రావణి.
…? కడార్ల కిరణ్