అది కర్ణాటకలోని గజేంద్రగఢ్ తాలూకా. అక్కడి గ్రామీణ మహిళలు చిన్నచిన్న పనుల ద్వారా ఉపాధిని పొందుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. కానీ, కొవిడ్ తర్వాత పనులు తగ్గిపోయాయి. అలాంటి సమయంలో ఓ అవకాశం తలుపుతట్టింది. ‘సంజీవని’ అనే పథకం ద్వారా జొన్నరొట్టెలు తయారుచేసి అమ్మేందుకు నిధులు అందించారు అధికారులు. కానీ మహిళలే సంశయించారు.
నష్టం వస్తుందేమో అని భయపడ్డారు. మొత్తానికి ఒకరి తర్వాత ఒకరు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం అందించిన పెట్టుబడితో చిన్న పిండిమర సమకూర్చుకున్నారు. జొన్నల్ని టోకున చవకగా కొని.. మర ఆడించి.. ఆ పిండితో రొట్టెలు చేసి విక్రయించడం. ఇదీ వారి వ్యాపారం. ఎనిమిది నుంచి పది మంది వరకు ఓ బృందంగా పని మొదలుపెట్టారు.
ఇలా, గజేంద్రగఢ్ తలూకాలోని వందలాది మహిళలు రొట్టెల తయారీతో ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు నెలకు పదివేలు రావడమే గగనం. ప్రస్తుతం ఒక్కో బృందం రోజుకు పదివేల రూపాయలు కళ్ల జూస్తున్నది. చుట్టుపక్కలే కాకుండా, బెంగళూరులాంటి సుదూర ప్రాంతాలకు సైతం జొన్నరొట్టెలు సరఫరా చేస్తున్నారు.