సంక్రాంతి సెలవుల ముందు హైదరాబాద్ వెళ్లామంటే.. నుమాయిష్ చూడాల్సిందే! మొదటిసారి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూశామో గుర్తులేదు. అమ్మ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు.. పద్మ చిన్నమ్మ మమ్మల్నందర్నీ తీసుకుని వెళ్లినట్టు జ్ఞాపకం. అమ్మ చెయ్యి పట్టుకుని..మిరుమిట్లు గొలిపే ఆ లైట్లనూ, కిక్కిరిసిన షాపులనూ అబ్బురంగా చూస్తూ ఉండిపోయాను.
Numaish | మొదట్లో పెద్దవాళ్లతో వెళ్లినా.. ఆ తరువాత మా కజిన్స్ హైమక్క, లక్ష్మి, గిరిజ, నేనూ, అక్కా వెళ్లేవాళ్లం. అయితే పన్నెండు పదమూడేళ్ల వయసుల్లో ఉండేవాళ్లమని మా వెంట రాములు అనే అతణ్ని పంపేవారు. రాములు ఏమీ అనేవాడు కాదు. కాకపోతే ఎటు వెళ్లినా బాడీగార్డ్లాగా మా వెనకే తిరిగేవాడు. అంటే ఇప్పటి బౌన్సర్లలాగా అన్నమాట! ఇంటికి రాగానే.. “ఏందమ్మా.. మా మీద నమ్మకం లేదా? మేం మంచిగనే పోయొస్తం గద! గా రాములును మా ఎంబడి ఎందుకు పంపుడు?!” అని వాళ్లమ్మ మీద లక్ష్మి ఎగిరేది. “ఆ.. పోతరు పోతరు! మీరు ఆడపిల్లలు మంచిగ తయారై పోతె.. అక్కడ ఎవరి కండ్లు ఎట్లాటివో! ఏమన్న అయితె తెలుస్తది. అయినా వాడు మిమ్ముల్నేమన్నడు? ఉత్తగ ఎంబడి తోలిన! అట్లయితె పోవుడే ఒద్దు!” అన్నది పద్మ చిన్నమ్మ. మొదటికే మోసం వస్తుందని మేం లక్ష్మిని కూల్ చేశాం.
నుమాయిష్కు రిక్షాల్లో వెళ్లేవాళ్లం. చిన్నప్పుడు లాయిలప్పలు, బ్యాటరీతో పనిచేసే టార్చిలైట్లు, రాగ్మాలా (మౌత్ ఆర్గాన్), కర్రతో చేసిన ఒంటె బొమ్మలు, ఏనుగు బొమ్మలు, రంగురంగుల గొడుగులు, గాజు ఫ్లవర్వాజులు, జార్స్, గ్లాసులు, అందమైన పింగాణీ వస్తువులు.. ఇలా అందంగా కనిపించేవాటిని బాగా కొనేవాళ్లం. మేం ఆడుకునే వస్తువులే కాక.. ఇంట్లోకి, ముఖ్యంగా అమ్మకు వంటింట్లో సహాయపడే వస్తువులేవైనా ఉన్నాయా అని వెతికేవాళ్లం. ఊరికెళ్లాక అమ్మకు చూపిస్తే.. “బోలెడు పైసలు పెట్టి ఎందుకు తెచ్చిన్రే!” అన్నా కూడా అమ్మ కళ్లల్లో సంతోషం కన్పించేది.
ఆ తరువాత రోజుల్లో ఇతర రాష్ర్టాల స్టాల్స్ బాగా చూసేవాళ్లం. నచ్చిన వస్తువులు కొనేవాళ్లం కూడా! లక్నో డ్రెస్ మెటీరియల్స్, రాజస్థాన్ కోటా చీరలు, అద్దాల గాజులు, కలకత్తా బెంగాలీ కాటన్ చీరలు, జూట్ బ్యాగులు, మైసూర్ సిల్క్స్, బొమ్మలు, కాశ్మీర్ షాల్స్, కాన్పూర్ చెప్పులు, ఆగ్రా లెదర్ బ్యాగులు, ఫరీదాబాద్ గాజులు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఆ లిస్ట్ అనంతం. కానీ, చాలా ఏళ్లయింది నుమాయిష్కు వెళ్లి! ఆ సంతోషమూ, సరదా ఎక్కడికి పోయాయో!
ఓసారి మమ్మల్ని దేవన్న వెంటపెట్టుకు వెళ్లాడు. మామూలప్పుడే తను మాకు ఏవైనా కొనుక్కోమని తలా ఇరవై రూపాయలిచ్చేవాడు. అలాంటిది తన వెంట వెళ్తే.. ఇంకా ఏమేం కొనిస్తాడోనని ఎగురుకుంటూ వెళ్లాం. ఎగ్జిబిషన్లో ప్రతిసారీ ఓ కొత్త వింత ఉండేది. జెయింట్ వీల్, మినీ ట్రైన్.. ఇలాగన్నమాట. ఆ సంవత్సరం నుమాయిష్లో కొత్త ఆకర్షణ.. టీవీ. ఒకచోట ఎత్తయిన స్టాండ్పై టీవీ ఉంచి, దాంట్లో న్యూస్రీల్ చూపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక మమ్మల్ని అక్కడే నిలబడమని.. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు దేవన్న. ఏమైందోగానీ, చాలాసేపటి దాకా రాలేదు. అలా మేం అక్కడే ఉండీ ఉండీ.. మా కాళ్లు లాగి, ఆకలేసి ఇంటికి వెళ్లిపోదామా అనుకుంటున్నప్పుడు వచ్చాడు దేవన్న. “ఒక రౌండ్ తిరిగొద్దామా?!” అని అడిగాడు. హైమక్క, లక్ష్మి అప్పటికే కోపంగా ఉన్నారు. అలక – ఆగ్రహం కలగలిసి, సీరియస్గా ముఖాలు పెట్టుకుని.. “ఏమొద్దు ఇంటికి పోదాం!” అన్నారు. మేం ఎప్పుడైనా ఫాలో ఫాలోనే కదా!
ఇంటికెళ్లాక ఇద్దరూ వాళ్లన్నయ్య చేసిన పనిని గొప్ప స్క్రీన్ప్లేతో చెప్పారు. అసలేం జరిగిందో చెప్పమని నన్ను అడిగింది చిన్నమ్మ. నేను సత్య హరిశ్చంద్రుడి చెల్లెల్ని మరి! దేవన్న నన్ను చూస్తూ ఉన్నా.. మేం ఎక్కడ, ఎలా, ఎంతసేపు నిలబడి, ఎదురు చూసి బాధపడ్డామన్నది వీలైనంత అమాయకంగా మొహం పెట్టి చెప్పాను. ఆ తరువాత దేవన్నకు వాళ్లమ్మతో అక్షింతలు పడితే చూడాలని మేమంతా ఆరాటపడ్డాం. కానీ, తను వెళ్లిన కారణమేదో చిన్నమ్మకు తెలిసినట్టుంది గనుక నవ్వుతూ విన్నది తప్ప ఏమీ అనలేదు.
కొసమెరుపు ఏమిటంటే.. ఆ సమయంలో రాయపర్తి మామయ్య అక్కడే ఉన్నారు. ఆయనది చాలా లవ్లీ
క్యారెక్టర్. విషయమంతా విని ఆయన వెంటనే మాతో.. “మీరు నలుగురూ రేపు పొద్దున్నే తయారు కాండి. మీరు ఎక్కడికంటే అక్కడికి నేను తీస్కపోత! ఏదంటే అది కొనిస్త! మనను ఇంత నిరాశపర్చినోళ్లను ఒక్కళ్లను కూడా ఎంబడి తీస్కపోవద్దు” అని దేవన్నను ఓరకంట చూస్తూ మాకు భరోసా ఇచ్చారు. “సరే సరే! అట్లనే పోయిరండి మామయ్యా! వీండ్లతోని శానా కష్టం!” అన్నాడు దేవన్న నవ్వుతూ. “మీరందరు ఎన్ని జెప్పినా మేం ఆగేదే లేదు. రేపు పోవుడు ఖాయం! ఇంత జరిగినాక ఊరుకుంటమా?!” అని మామయ్య అంటూంటే.. మాకు మాత్రం ఎంతో సంతోషం కల్గింది.
అన్నట్టుగానే మర్నాడు పొద్దున్నే మామయ్య మా నలుగుర్నీ నెహ్రూ జూ పార్క్కు తీసుకెళ్లారు. “ఇంక ఇంటికి పోదాం. చాలు మామయ్యా!” అనేదాకా మమ్మల్ని తిప్పి, ట్రైన్ ఎక్కించి, జంతువుల్ని చూపించి, బిస్కెట్లు, చాక్లెట్లు, పల్లీలు, బఠాణీలు, చెరుకు రసం, ఐస్క్రీం, పళ్లు, కేకులు, మక్కజొన్న కంకులు.. ఇలా ఒకటేమిటి ఆ జూలో అమ్మిన ఒక్క తినుబండారమూ వదలకుండా కొని మా చేత తినిపించారు. “ఒద్దు మామయ్యా! ఇక చాలు. కడుపు నిండింది” అన్నా వినకుండా.. “ఎహె! మంచిగ తినండి, తిరగండి! ఇంటికి పోయినాక ఇవన్నీ అందరికీ చెప్పొద్దూ!” అన్నారు.
ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన గంటకే.. “ఏమైంది?! తయారు కాండి. నుమాయిష్కు పోదాం” అని మళ్లీ అడిగారు మామయ్య. “అబ్బ.. ఇవాళొద్దు మామయ్యా! కాళ్లు గుంజుతున్నయ్! రేపన్న, ఎల్లుండన్న పోదాం!” అన్నాం.. మళ్లీ ఎన్ని తినమంటారోనని భయపడుతూ. “మీ ఇష్టం! మంచి తరుణం మించిన దొరకదు! నేను మళ్ల ఊరికి పోతె, మీరు నుమాయిష్కు పోయినా.. గదే టీవీ, గండ్ల న్యూస్రీలే గతి!” అని మామయ్య నవ్వగానే.. మేమూ ఫక్కున నవ్వాం.
ఆ తరువాత చాలాసార్లు నుమాయిష్కి వెళ్లినా.. నాటి సంఘటన గుర్తొచ్చి నవ్వొస్తుంది.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి