కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్ ఓ హోటల్ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమతంలోనే సాగు చేయాలనుకుంది. కానీ, గ్రామాల్లోని పరిస్థితులు ఆమెను కలవరానికి గురిచేశాయి. రైతులు సేద్యానికి దూరం అవుతున్న తీరు బాధపెట్టింది. మిగిలిన కొద్దిమంది కూడా వాణిజ్య పంటలకే పెద్దపీట వేస్తున్నారు. అదీ హైబ్రీడ్ విత్తనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల దేశవాళీ విత్తనాలు కనుమరుగైపోతున్నాయని అర్థమైపోయింది ఆస్మాకు. ఆ పరిస్థితిని తానే ఎందుకు చక్కదిద్దకూడదని అనుకుంది.
దశాబ్ద కాలంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ అరుదైన దేశవాళీ విత్తనాలు సేకరిస్తున్నది. వాటిలో వరి రకాలే ఎక్కువ. అంతరించిపోతున్న పంటలు ఆమె చొరవ వల్ల మళ్లీ జీవం పోసుకున్నాయి. ఈ ప్రయత్నంలో శ్రమ ఎక్కువ, ఖర్చూ ఎక్కువే. తన జీతంలోంచి కొంత భాగాన్ని ఇందుకు కేటాయిస్తుంది ఆస్మా. ఇప్పటిదాకా తను 840 దేశవాళీ రకాల విత్తనాలను సేకరించింది. అందులో 85 శాతం విత్తనాలను పంటగా మార్చగలిగింది. వాటిని స్థానిక రైతులకు, ప్రభుత్వానికి కూడా అందిస్తున్నది.‘ఈ ఉద్యమంలో నా భర్త సహకారం మరువలేనిది’ అని చెబుతుందామె.