నిప్పులపై ఉక్కును వంచే విద్య తెలిసినవారు. కత్తులకు సానపట్టి పదును పెట్టే కళలో ఆరితేరినవారు. కత్తులు దూసే యుద్ధ విద్యలో నిపుణులు. రాజ్యాలు ఏలినవారు. వాళ్ల గతమెంతో ఘనం. వర్తమానం నిండా దైన్యం. అవిద్య, పేదరికం తప్పఇంకేమీ మిగలని గాడియా లోహార్ తెగలో పుట్టిన బిడ్డ ఆమె. అయితేనేం,సొంతకాళ్లపై నిలబడి, దూరవిద్యలో చదువులకు దగ్గరై పట్టాలు, అవార్డులు సాధించారు డాక్టర్ రాజ్యలక్ష్మి. ఆ సంచారి జీవన సారం..
మేము గాడియా లోహార్ సంచార జాతి వాళ్లం. ఎడ్లబండిపై సంచరిస్తూ.. రహదారుల పక్కన కత్తులు, కటార్లు తయారు చేసుకుంటూ బతికేవాళ్లం. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం మా పూర్వికులు తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. మా తాతయ్యది ఏదో ఊరు. నాన్నది మాత్రం తాండూరే. అక్కడే స్థిరపడ్డారు. నాదేమో హైదరాబాద్. మా పెద్దలు మేవాడ్ ప్రాంతానికి చెందిన రాజపుత్రులు. పేరుకే రాజులం. భూముల్లేవు. ఆస్తుల్లేవు. ఉన్నదంతా అవిద్య, పేదరికం. మా సామాజిక వర్గంలో చదువులకు ప్రాధాన్యం లేదు. నాన్న ఎంతోకొంత చదువుకోవడం వల్ల సీఐఎస్ఎఫ్లో ఉద్యోగం వచ్చింది. అలా నాకూ చదువుకునే వీలు చిక్కింది. నాన్న హైదరాబాద్, చెన్నై, కటక్, కోల్కతాలో పనిచేశారు. ఆయా ప్రాంతాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో చదివాన్నేను.
చదువు.. సంసారం
పది తర్వాత ఇంటర్ చదవాలని ఉండేది. ‘మనుమరాలి పెండ్లి కళ్లారా చూస్తాను. సంతోషంగా చచ్చిపోతాను’ అంటూ తాతయ్య పోరు పెట్టాడు. పెండ్లి వద్దు, చదువుకుంటానని చెప్పినా ఒప్పుకోలేదు. మాటలు బంద్ చేశారు. ఇంటికి రావడం మానేశారు. ఆ ఒత్తిడి భరించలేక నా వివాహం చేశారు. మా ఆయన నా మేనత్త కొడుకే. నా ఇష్టాలకు ఆయనెప్పుడూ అడ్డుపడలేదు. పెండ్లయిన రెండేళ్లకు… ఢిల్లీ ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ చేరాను.
ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాను. ఆ తర్వాత, గర్భ స్రావంతో ఆరోగ్యం సహకరించ లేదు. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాను. రెండేళ్ల తర్వాత సెకండ్ ఇయర్ పరీక్షలకు ఫీజు కట్టాను. మళ్లీ చదవడం మొదలుపెట్టాను. ఇంట్లో ట్యూషన్లు చెబుతూ.. దగ్గర్లో ఉన్న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్గా చేరాను. ఇంటర్ తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకామ్లో చేరాను. అప్పుడూ, ఫస్ట్ ఇయర్ తర్వాత బ్రేక్ వచ్చింది. అబ్బాయి పుట్టాడు. కొత్తగా ఇల్లు కట్టాం. మూడేళ్ల తర్వాత డిగ్రీ కొనసాగించాను. పట్టా చేతికి రాగానే.. డిగ్రీ కాలేజ్లో ఇంగ్లిష్ లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. రెండు డెమో క్లాసులు తీసుకున్నాను. బాగా చెప్పానని పీజీ లేకున్నా అవకాశం ఇచ్చారు.
నాకు నేనే బాస్
‘ఊళ్లో ఆస్తి ఉంది. మీ ఆయనకు పోలీస్ ఉద్యోగం ఉంది. మంచి జీతం. తిని హాయిగా కూర్చోవచ్చు కదా? ఎందుకు ఈ కష్టాలు?’ అని మా బంధువులు సలహాలిచ్చారు. ‘బాగా చదువుకో..’ అన్నవాళ్లే లేరు. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించను. నాకు చదువు అవసరం లేదని, పిల్లల్ని చూసుకోమని ఇంట్లో చెప్పినా ఆగిపోలేదు. పాసైన తర్వాత మా వాళ్లకు సర్టిఫికెట్ చూపిస్తాను. ‘అరె.. నువ్వు పాసయ్యావా!’ అంటారు. చిన్నపాటి అభినందన కూడా ఉండదు. అయినా నిరాశపడకుండా.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లిష్ చేశాను.
ఇక్కడ మాత్రం ఎలాంటి బ్రేక్ రాలేదు. రాజస్థాన్లోని జేజేటీయూ యూనివర్సిటీ నుంచి ‘ఎన్హాన్సింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విత్ రిఫరెన్స్ టు సాఫ్ట్స్కిల్స్’ అంశంపై పరిశోధన చేశాను. ఆ సమయంలో అమ్మ నా పిల్లల్ని చూసుకుంది. మూడున్నర ఏళ్లలో డాక్టరేట్ వచ్చింది. నాలుగు ఉద్యోగాలుట్యూషన్లు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ బాధ్యతలు, కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం.. వీటితోపాటు జిమ్లో ట్రెయినర్గానూ చేస్తాను. అదనంగా ఇఫ్లూలో ఇంకో కోర్సు చదువుతున్నాను. పిల్లల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం రాకుండా జాగ్రత్త పడతాను. వాళ్లు నాతోనే జిమ్కు వస్తారు.
ఇంటికి వచ్చాక అందరం కలిసి వంట చేసుకుంటాం. మానసికంగా సిద్ధపడితే ఎవరైనా, ఎంత కష్టమైన పనైనా చేయగలరు. మా గాడియా లోహార్ కమ్యూనిటీలో ఆడపిల్లల కష్టాలు చూసిన దాన్ని నేను. కాబట్టి చదువుకునే అమ్మాయిల్ని ప్రోత్సహిస్తాను. ఏడాదిలో ఒక నెల జీతాన్ని ఆడపిల్లల చదువులకు ఇస్తాను. చదువు కోసం నేను చేసిన పోరాటాన్ని, ఇతరుల చదువులకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని చూసి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వాళ్లు బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు ఇచ్చారు. టీ హబ్ ‘బెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ 2022’ అవార్డు ప్రదానం చేసింది. నా అకడమిక్, టీచింగ్ ప్రొఫైల్కు గుర్తింపుగా
ఏషియన్ కాలేజ్ ఆఫ్ టీచర్స్ (బ్యాంకాక్) బెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అవార్డు ఇచ్చింది. ఎదగాలను కున్న ప్రతి మహిళకు నేనొక గెలుపు పాఠం కావాలి.
…? నాగవర్ధన్ రాయల
జి.భాస్కర్