వేసవికాలంలో వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన పదార్థం.. పెరుగు. అయితే, ఎండ ప్రభావంతో పెరుగు త్వరగా పులిసిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే.. చిన్న చిట్కాలు పాటించాల్సిందే!
పెరుగు తోడు పెట్టడానికి ముందు.. పాలను కనీసం 10-15 నిమిషాల పాటు తక్కువ మంట మీద బాగా మరిగించాలి. పాలు చిక్కగా ఉంటే.. పెరుగు త్వరగా పులియదు. ఇక పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు తోడు వేయకూడదు. ఇలాచేస్తే.. పెరుగు నీరులా అయిపోయి, త్వరగా పులుపు వచ్చేస్తుంది. అందుకే, గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడు వేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా, వేసవిలో తోడు వేసే పెరుగును చాలా తక్కువ పరిమాణంలో వాడాలి. ఎక్కువ వేస్తే బ్యాక్టీరియా వేగంగా వృద్ధిచెందుతుంది. త్వరగానే పులిసిపోతుంది. తోడు వేసిన తర్వాత అందులో ఓ రెండు పచ్చి మిరపకాయలను తొడిమతో సహా వేయాలి. మిరపకాయలోని క్యాప్సైసిన్.. పెరుగు త్వరగా పులియకుండా ఆపుతుంది. పెరుగు గడ్డ కట్టిన తర్వాత మిరపకాయను తీసేస్తే సరి. ఇక పెరుగు గడ్డ కట్టిన వెంటనే ఫ్రిజ్లో పెట్టేయాలి.
బయట ఎంత ఎక్కువసేపు ఉంచితే.. అంత వేగంగా పులుపు పెరుగుతుంది. సాధ్యమైనంత వరకూ.. పెరుగును మట్టి పాత్రలోనే తోడు పెట్టాలి. మట్టి పాత్ర అదనపు తేమను పీల్చుకుని, పెరుగును చల్లగా ఉంచుతుంది. దాంతో, ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఇక పెరుగును స్టీల్, ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేయొద్దు. శుభ్రమైన గాజు పాత్రలో ఉంచితే.. రుచి, నాణ్యత దెబ్బతినవు. గాలి చొరబడకుండా గట్టిగా మూత పెట్టాలి.
లేకుంటే, అందులో తేమ చేరి బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దాంతో, పెరుగు త్వరగా చెడిపోతుంది. పెరుగు పాత్రలో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేస్తే.. పెరుగు త్వరగా పులియకుండా ఉంటుంది. చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. పెరుగు పుల్లగా మారినట్లయితే.. రెండు చెంచాల పాలను వేడిచేసి, చల్లార్చిన తర్వాత అందులో కలపాలి. దీనివల్ల పులుపు తగ్గి, పెరుగు తియ్యగా మారుతుంది.