కీరా దోస.. చర్మ సౌందర్యానికి మెరుగుపెడుతుంది. ఒంటికి నిగారింపు ఇస్తుంది. ఇందులోని నీటిశాతం పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నల్లటి వలయాలు, మచ్చలు తగ్గించడంలోనూ కీరా ఉపయోగపడుతుంది. అంతేనా, యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంచుతుంది. ఈ మూడు పద్ధతులనూ పాటిస్తే ఫలితాలు మరింత బావుంటాయి.
టోనర్: తొక్కతీసిన కీరా ముక్కల్ని మెత్తగా రుబ్బి వడకట్టాలి. ఒక టేబుల్ స్పూన్ కీరా రసానికి అంతే మోతాదులో నిమ్మరసం తీసుకుని బాగా కలిపితే.. టోనర్ సిద్ధం. దీన్ని దూదితో ముఖంపై రాసుకుని.. రెండు నిమిషాలపాటు మర్దన చెయ్యాలి. కళ్లు, ముక్కు, నోటి దగ్గర రాసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగెయ్యాలి. ఈ టోనర్ను ఒకేసారి సిద్ధం చేసుకుని ఎయిర్టైట్ కంటెయినర్లో పోసి, ఫ్రిజ్లోనూ నిల్వ చేసుకోవచ్చు. వారానికి రెండు మూడుసార్లు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
స్క్రబర్: ఓ గిన్నెలో ఒక టీ స్పూన్ చక్కెర, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కీరా ముక్కతో తీసుకుని ముఖంపై ఒక క్రమ పద్ధతిలో గుండ్రంగా తిప్పుతూ పది నిమిషాలపాటు రుద్దాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ముఖం మీది మృతకణాలు తొలగిపోతాయి.
మాస్క్: ఒక గిన్నె తీసుకుని.. సమపాళ్లలో రోజ్వాటర్, కీరా రసం వేసి ఒక టీస్పూన్ ముల్తానీ మట్టి జోడించి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకొని.. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండుసార్లు ఈ మూడు పద్ధతులనూ అనుసరిస్తే ముఖం కాంతిమంతం అవుతుంది.