ఇల్లు మారిన ప్రతిసారీ కొంత పాత సామాను తూకానికి వెళ్లిపోతుంది. కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నప్పుడల్లా ఏదో ఓ వస్తువు ట్రంకుపెట్టెను ఆశ్రయిస్తుంది. కొత్తనీరు వచ్చి పాత నీటిని తరిమేయడం లాంటి వ్యవహారమే ఇదీ. అలా అటకెక్కిన సామగ్రిలో.. ప్రతి ఇత్తడి బిందె నొక్కుల వెనుకా, ప్రతి స్టీలు క్యారేజీ సొట్టల వెనుకా, ప్రతి రాగి గిన్నె మీద చెక్కిన పేరు వెనుకా.. ఓ నోస్టాల్జియా ఉంటుంది. అందులో కొన్ని జేజమ్మ నుంచి నానమ్మకు, నానమ్మ నుంచి అమ్మకు, అమ్మ నుంచి శ్రీమతికి వారసత్వంగా అందినవీ ఉంటాయి. వాటిని వెలకట్టలేం. తూకానికేసి చిన్నబుచ్చలేం.
కర్ణాటక క్రాఫ్ట్స్ కౌన్సిల్కు చెందిన చంద్రాజైన్ ఇలాంటి వాటిని సేకరించి ‘పాత్రలు’ పేరుతో బెంగళూరులో ఓ ప్రదర్శన నిర్వహించారు. దీనివెనుక ఏడాది శ్రమ ఉంది. తనకు ఆ ఆలోచన రాగానే.. వివిధ రాష్ర్టాల క్రాఫ్ట్ కౌన్సిల్స్కు లేఖలు రాశారామె. పాత సామాన్ల వ్యాపారులకు, కళాత్మక వస్తువుల డీలర్లకు వర్తమానం పంపారు. స్నేహితులు, బంధువులకు మెసేజ్లు పెట్టారు. ఆ డిజైన్లకు సమకాలీనత అద్ది.. తిరిగి ప్రాణంపోయాలన్నది చంద్రాజైన్ ఆలోచన.