పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవికి ‘జెడ్ ప్లస్’ భద్రతను ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించింది. దీనిపై వారిద్దరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. (Lalu Yadav, Rabri Devi) కొత్తగా ఏర్పాటు చేసిన తక్కువ స్థాయి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో లాలూ యాదవ్, రబ్రీ దేవిల భద్రత కోసం వారి బంగ్లా వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా ఉన్నారు. ఈ ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, లాలూ, రబ్రీదేవి కుమారుడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజస్వి యాదవ్ కూడా తన వై కేటగిరీ భద్రతను వెనక్కి పంపించారు. అయితే తన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవికి జెడ్ ప్లస్ సెక్యూరిటీని తగ్గించడంపై వారి కుమార్తె రోహిణి ఆచార్య స్పందించారు. తన కుటుంబానికి హాని కలిగించాలనే దురుద్దేశంతోనే వారి భద్రతను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.