మంచిర్యాల, అక్టోబర్ 17, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఏర్పాటుకు బోర్డు అనుమతినిచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షల పేపర్లు ఇక్కడే దిద్దేందుకు అవకాశమిచ్చింది. ఏటా మూల్యాంకనం కోసం వందలాది కిలోమీటర్ల దూరంలోనున్న ఆదిలాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై ఆ తిప్పలుండవని అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం గతేడాది ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు నిర్వహించలేదు. అంతకుముందు సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేశారు. కనీస అర్హత మార్కులతో పాస్ చేశా రు. అంతకముందు జరిగిన ఫస్టియర్ పరీక్షల ఆధారంగా సెకండియర్ విద్యార్థులకు మార్కులు కేటాయించారు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులను ఫస్ట్ ఇయర్లో ప్రమోట్ చేశారు. కొ విడ్ ప్రభావం తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెకండియర్ విద్యార్థులకు ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్లోనే ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రం కొనసాగుతున్నది. మంచిర్యాల జిల్లాకేంద్రంతో పాటు పలు మండలాల నుంచి ఆదిలాబాద్ 250-300 కిలోమీటర్ల దూరంలో ఉం టుం ది. రోడ్డు, వసతి, దూరభారం అవుతుండడంతో యేటా స్పాట్ వాల్యుయేషన్కు రిపోర్టింగ్ చేసేవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచే మంచిర్యాల జిల్లాకేంద్రంలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం ప్రారంభం కానున్నది. ఈ మేరకు బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో ఏండ్లుగా పడుతున్న తిప్పలు తప్పనున్నాయని డీఐఈవో శైలజ, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
25 నుంచి ఇంటర్ ప్రథమ పరీక్షలు..
మంచిర్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరిధిలో 10 ప్రభుత్వ, 4 బీసీ సంక్షేమం, 6 సాంఘిక సంక్షే మం, 1 టీఎస్ఆర్జేసీ, 3 తెలంగాణ మైనార్టీ కళాశాలలు, 6 కేజీబీవీ, 5మోడల్ పాఠశాలలు/కళాశాలలు, 1 ఇన్సెంటివ్, 17 ప్రైవేట్ అన్ ఎయిడెడ్, 4 ప్రైవేట్ ఒకేషనల్ కలిపి 57 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 2021-22 విద్యా సంవత్సరంలో ఆయా కళాశాలల్లో 13,828 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ప్రథమ సంవత్సరంలో 5, 461 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 8,367 మంది విద్యనభ్యసించారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల ప్రచారం, ఫలితాల నేపథ్యం లో ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచారు. దా దాపు అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు, 5 కళాశాలల్లో ఇంటర్మీడియట్ వృత్తి విద్య కొనసాగుతున్నాయి. కొవిడ్ -19 మహమ్మారి కారణంగా 2021-22 విద్యాసంవత్సరంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రత్యక్ష తరగతులు జరగలేదు. కాగా సెకండియర్ విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.
తగ్గిన దూరభారం..
ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన తర్వాత యేటా మూల్యాంకనం కోసం అధ్యాపకులు ఆదిలాబాద్ వెళ్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి విడిపోయి మంచిర్యాల ప్రత్యేకంగా జిల్లాగా ఏర్పడినప్పటికీ స్పాట్ వాల్యుయేషన్ కోసం ఆదిలాబాద్కు వెళ్లాల్సి వస్తున్నది. దూరభారంతో పాటు పలు కారణాలతో స్పాట్ వాల్యుయేషన్ కోసం పలువురు అధ్యాపకులకు విధులు వేసినా రిపోర్ట్ కూడా చేయడంలేదు. దీంతో మూల్యాంకన విధులు నిర్వర్తించే వారి సంఖ్య తగ్గుతుండడంతో అనుభవజ్ఞులైన ప్రైవేట్ కాలేజీ అధ్యాపకులతో దిద్దించుకుంటున్నారు. ఈ విషయమై మంచిర్యాల జిల్లాకేంద్రంలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేశారు. డీఐఈవో ఆధ్వర్యంలోనూ పలుసార్లు కేంద్రం కోసం విన్నవించారు. మంచిర్యాల జిల్లాకేంద్రానికి, మారుమూల మండలాల నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం 250-300 కిలోమీటర్లు ఉండడంతో దూర భారమవుతుందని అధ్యాపకులు తరచూ ఆవేదన చెందుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు కావడం, మంచిర్యా ల జిల్లా నుంచి రోడ్డు సౌకర్యం లేకపోవడం, జిల్లా లో సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆదిలాబాద్కు వెళ్లేందుకు చాలా మంది అధ్యాపకులు ఏటా విముఖత చూపుతున్నారు. కరోనా నేపథ్యం లో అక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాకేంద్రం లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) శైలజ, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది..
మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పడినప్పటికీ ఇంటర్మీడియట్ మూల్యాంకనం కోసం యేటా ఆదిలాబాద్ వెళ్లాల్సి వచ్చేది. దీంతో స్పాట్ వాల్యుయేషన్ కోసం చాలా తక్కువ మంది లెక్చరర్లు రిపోర్టింగ్ చేసేవారు. జిల్లాకేంద్రంలో పరీక్ష పేపర్లు దిద్దేందుకు అవకాశం ఇవ్వాలని బోర్డు అధికారులకు విన్నవించాం. కొవిడ్ నేపథ్యంలో ఆదిలాబాద్ వెళ్లేందుకు అధ్యాపకులు కూడా ఇష్టపడడంలేదు. ప్రస్తుతం మంచిర్యాలలో స్పా ట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది.
ఆనందంగా ఉంది..
నాపేరు ముల్కల రాజిరెడ్డి. చెన్నూర్లోని చాణక్య జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. 2010 నుంచి ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్కు ఆదిలాబాద్ వెళ్తున్నాను. మంచిర్యాలకు ఆదిలాబాద్ చాలా దూరం ఉంటుంది. రోడ్డు సౌకర్యం ఉన్నా, చెన్నూర్ లాంటి ప్రదేశాల నుంచి పరిమిత సం ఖ్యలో బస్సులు ఉంటాయి. పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక జిల్లా ఏర్పడినప్పటికీ మూల్యాంకన కేంద్రం మారకపోవడంతో ఇబ్బందయ్యేది. ప్రస్తుతం మంచిర్యాలలో ఏర్పాటు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది.