కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ)/కెరమెరి : ఆదివాసీ ముద్దుబిడ్డ, పోరాట వీరుడు కుమ్రం భీం 81వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు జోడెఘాట్ ముస్తాబైంది. బుధవారం భీమ్ వారసులు, ఆదివాసులు సంస్కృతీ సంప్రదాయాలతో పూజలు నిర్వహించనుండగా, అధికారులు అందుకనుగుణంగా అన్నీ సిద్ధం చేశారు. భీం నిల్లువెత్తు విగ్రహం, సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు ఏర్పాట్లు చేశారు. స్మారక చిహ్నంలోని కుమ్రం భీం విగ్రహానికి రంగులు వేయడంతో పాటు జల్.. జంగల్.. జమీన్ నినాదాలకు గుర్తులుగా నిర్మించిన మూడు ద్వారాలను రంగులతో అలంకరించారు. సుమారు 35 వేల మంది గిరిజనులు, అతిథులు వచ్చే అవకాశం ఉండగా భోజనం, తాగు నీటి సౌకర్యంతో పాటు ప్రత్యేక వాహనాల పార్కింగ్లను సిద్ధం చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగు దొడ్లను ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్ధంతికి వచ్చే వారికోసం హట్టి నుంచి జోడెఘాట్ వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. కాగా, కొవిడ్ నేపథ్యంలో దర్బార్ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పరిశీలించిన జడ్పీ చైర్పర్సన్, ఎస్పీ
జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎస్పీ సుధీంద్ర మంగళవారం జోడెఘాట్కు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. కెరమెరి నుంచి జోడెఘాట్ (23 కిలోమీటర్లు) వరకు అటవీప్రాంతంలో సుమారు 500 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ సుధీంద్ర తెలిపారు. భీం అనుచరుడు కుమ్రం సూరు నూతన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
అవ్వల్ పేన్ పూజ..
జోడెఘాట్లో ఆదివాసులు మంగళవారం రాత్రి అవ్వల్ పేన్ పూజలు నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ భీం వారసులు ఊరేగింపుగా తరలివచ్చా రు. భీం స్మృతి చిహ్నం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం నేరుగా అవ్వల్ పేన్ వద్దకు చేరుకున్నారు. భీం మ నుమడు సోనేరావ్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొర్రె, కోళ్లను బలి ఇచ్చారు. వంటలు చేసుకొని సహపంక్తి భోజనం చేశారు.
స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట..
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఈ ఏడేళ్లలో జోడెఘాట్ ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ ప్రభుత్వం రూ. 15.70 కోట్లు మంజూరు చేయగా, జోడెఘాట్ వరకు రెండు వరుసల రహదారి నిర్మించింది. ఒకప్పుడు కాలినడక కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తున్నారు. ఏ అర్ధరాత్రి ఆపద వచ్చినా ఒక్క ఫోన్కాల్తో అంబులెన్స్ వచ్చి దవాఖానకు తీసుకెళ్తుంది. రూ. 25 కోట్లతో గిరిజన మ్యూజియం, స్మారక చిహ్నం, స్మృతి వనం కూడా ఏర్పాటు చేసింది. 12 గ్రామాల పరిధిలోని పిల్లల కోసం రూ. 2.95 కోట్లతో ఆశ్రమ పాఠశాల నిర్మిస్తుండగా, దాదాపు పూర్తికావచ్చింది. జోడెఘాట్తో పాటు పరిసర గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించారు. 11 గ్రామాలకు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. జోడెఘాట్ గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. దాదాపు 30 మంది గిరిజన రైతులకు ఎడ్ల జతలు, బండ్లను ఐటీడీఏ ద్వారా అందించారు. విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. జోడెఘాట్లో ప్రత్యేకంగా 30 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయగా, నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.
ఆదిలాబాద్లోనే తొలి విగ్రహం తయారీ..
1983లో ఆదివాసీ నేతలు కొట్నాక భీంరావ్, మడావి రాజు ఆహ్వానం మేరకు అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎంవీపీసీ శాస్త్రి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఆ సమయంలో భీం విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదారాబాద్కు చెందిన ప్రముఖ శిల్పి బీ రాంకృష్ణదాస్కు ఈ బాధ్యత అప్పగించారు. ఆదిలాబాద్కు చెందిన తన శిష్యుడు, కళారత్న అవార్డు గ్రహీత గురూజీ రవీందర్ శర్మను కలిశాడు రాంకృష్ణదాస్. తన గురువు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలనే తపనతో రవీందర్ శర్మ భీం విగ్రహ తయారీలో నిమగ్నమయ్యాడు. భీం ఫొటో కోసం ప్రయత్నం చేయగా, దొరకలేదు. చివరికీ భీం సన్నిహితులు, బంధువులు చెప్పిన గుర్తుల ఆధారంగా ఓజా కళాకారులైన కోవ నాణేశ్వర్(శిల్పిగురు), ఆయన సోదరులు నాందేవ్, దూద్నాథ్తో కలిసి భీం విగ్రహాన్ని రూపొందించారు. 1984లో జోడెఘాట్లో ఏర్పాటు చేశారు.