సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న యువభారత్ శక్తి ఫౌండేషన్ సభ్యులు దాతల సహకారంతో రూ.2.50లక్షలు సేకరించి మైబూకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కట్టి అందించారు. పూర్తిచేసిన ఇంటిని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యచే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ యువభారత్ శక్తి ఫౌండేషన్ సేవలు మరువలేనివని, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్నో నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు, భోజనాలు అందించిన ఆడుకున్నదని ఫౌండేషన్ సేవలను కొనియాడారు.
యువభారత్ శక్తికి మించిన పనిచేసి ఓ నిరుపేద కుటుంబానికి నీడ కల్పించిన వారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఫౌండేషన్ బాధ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోదుగు నీలిమ, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, సొసైటీ అధ్యక్షులు చిలుకుర్తి కృష్ణమూర్తి, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.