ఖమ్మం, నవంబర్ 30: ఖమ్మం నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారభంభమైన సాయంత్రం వరకు కొనసాగింది. కొన్నిచోట్ల క్యూలైన్లో ఓటు వేసేందుకు ఓటర్లకు అవకాశం కల్పించడంతో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం 9 గంటలకు వరకు ఖమ్మంలో మందకొడిగా సాగిన పోలింగ్ తరువాత ఊపందుకుంది. నగరంలోని బ్యాంక్ కాలనీ, వీడీయోస్ కాలనీ, రోటరనీనగర్, పీజీ కళాశాలు, డిగ్రీకళాశాల, ఇందిరానగర్, హార్వెస్ట్ పాటశాల తదితర చోట్ల పోలింగ్ బూత్లలో ఉదయం నుంచి సందడి నెలకొన్నది. కొత్త ఓటర్లు తమ ఓటు వేసిన తరువాత సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేసిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు గురువారం సైతం అదే ఒరవడి కొనసాగించారు. ఉదయం 6 గంటలకే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న పార్టీల నాయకులు వారి అనుచరులు పోలింగ్ ఏజెంట్లుగా తమ ధ్రువీకరణ పత్రాలను చూపించి మాక్ పోలింగ్లో పాల్గొన్నారు. అనంతరం ఉదయం ఏడు గంటలకు ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో ఉన్న పోలింగ్ బూత్లలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వృద్ధులు, గృహిణులు, యువ ఓటర్లు కార్మికులు, చిరువ్యాపారులు ఉదయం వేళలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపారు. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పోలింగ్ స్టేషన్లను సందర్శించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. వీరితో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సైతం సుడిగాలి పర్యటన చేసి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు, దివ్యాంగులు, వయోవృద్ధులు నుంచి భారీ స్పందన కనిపించింది. ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయడంతో యువ ఓటర్లు దివ్యాంగులు, వయోవృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర రెండు, మూడు ప్రత్యేక ఆటోలు ఏర్పాటు చేసి వారిని ఇంటి నుంచి తీసుకొచ్చి తిరిగి ఇంటికి పంపించారు. అంగన్వాడీ ఆయాలు, ఆర్పీలు. ఆయా కళాశాల విద్యార్థులు సేవలు అందించారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవసరమైన మందులను సిద్ధ్దంగా ఉంచారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు తమ వంతు సేవలను బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్వోలు) అందించారు. వారం రోజుల నుంచి పోల్ చిట్టీలను పంపిణీ చేసిన బీఎల్వోలు, గురువారం సైతం సేవలను కొనసాగించారు. కొన్ని కేంద్రాల్లో బూత్ల దగ్గరగానే పోల్ చిట్టీలు పంపిణీ చేయడంతో రద్దీగా మారింది. ఇంతవరకు పోల్ చిట్టీలు తీసుకోని వారికి కేంద్రాల దగ్గర అందజేశారు. పోల్ చిట్టీలు తీసుకొని పోగొట్టుకున్న వారికి సైతం ప్రత్యేక చిట్టీలు అందజేశారు.
మామిళ్లగూడెం, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 1456 పోలింగ్ కేంద్రాల్లో మొదటి సారిగా అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ చేయడంతో పాటు సాంకేతికను వినియోగించి కట్టు దిట్టమైన పర్యవేక్షణ చేపట్టారు. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ సమన్వయంతో జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు, సమన్వయంతో ఎన్నికల పనులను నడిపించారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పర్యవేక్షణలో నిరంతర నిఘాతో అంతర్ జిల్లా, అంతరాష్ట్ర చెక్ పోస్టుల అక్రమాలకు చెక్ పెట్టారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు, గొడవలు వంటి జరగకుండా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పటిష్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ పంపించిన కేంద్ర భద్రతా బలగాలతో పాటు ఒడిస్సా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల పోలీస్ యంత్రాంగం, స్థానిక పోలీసులను సమన్వయం చేసి పొలింగ్ కేంద్రాలకు విధులు కేటాయించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇతర శాఖల సిబ్బంది వృద్ధులకు, దివ్యాంగులకు సేవలు అందించి ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.