– వైరా ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ
కారేపల్లి, మే 21 : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో యువకులు, పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొనాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి, సింగరేణి మండల నాయకులు దొంకేనా రవీందర్, జడల కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. పోరాడి సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా సుపరిపాలన అందించి అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో వైరా నియోజకవర్గాన్ని ముందు ఉంచడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అంతకుముందు సింగరేణి మండల నాయకులు కృష్ణకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.