నిండు కుండల్లా చెరువులు.. జల నిధుల్లా కుంటలు, కాలువలు.. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్.. సీజన్కు ముందే పెట్టుబడి సాయం.. ఎవుసానికి అనుకూలమైన వాతావరణం.. వెరసి.. భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు ముమ్మరంగా సాగుతున్నది.. గతేడాది సీజన్లో 1,74,475 ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు ఈ ఏడాది 2,15,463 ఎకరాల్లో చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు ముమ్మరమయ్యాయి. సాధారణ, వాణిజ్య పంటలే కాకుండా రైతులు ఈసారి ప్రత్యామ్నాయ పంటల పైనా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయిల్ పాం సాగుపైనా కొందరు మక్కువ చూపిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. పంటలకు ఉచితంగా విద్యుత్ అందడం, చెరువులు నిండి ఉండడం, రైతుబంధు సీజన్కు ముందే అందడంతో రైతులు దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నారు. గతేడాది యాసంగిలో 1,74,475 ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు ఈ ఏడాది 2,15,463 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈసారి సాగు కాస్త ఆలస్యమైనప్పటికీ సాగు విస్తీర్ణం గతంలో పెరగడం గమనార్హం. ఏవోలు, ఏఈవోలు జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటల లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ పని 50శాతం పూర్తయింది. రైతులు యాసంగిలో వరితో పాటు ప్రత్యామ్నాయ పంటలనూ సాగు చేస్తున్నారు.
చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు. జిల్లాలోని సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చర్ల, దుమ్ముగూడెం, కొత్తగూడెం, అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి మండ లాల్లో విస్తారంగా వరి సాగవుతున్నది. ఇప్పటికే వానకాలంలో పండించిన ధాన్యాన్ని విక్రయించి రైతులు లాభాలు పొందారు. ఇప్పుడు యాసంగి పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. గతేడాది యాసంగి సీజన్లో 33,184 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా ఈసారి ఆ విస్తీర్ణం 78,762 ఎకరాలకు చేరవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగింది. దీంతో చెరువు కట్టలు పటిష్టమయ్యాయి. వానకాలంలో వాటిలో నీరు చేరి పంటలకు జల నిధులుగా నిలుస్తున్నాయి. సర్కార్ 24 గంటల పాటు పంటలకు ఉచితంగా అందించడంతో రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. సాగునీరు పుష్కలంగా లభిస్తుండడంతో రైతులు గతంలో సాగు చేసిన సాధారణ, వాణిజ్య పంటలతో పాటు ఇతర పంటలూ సాగు చేస్తున్నారు. ఆయిల్పాం సాగు జిల్లాలో నానాటికీ విస్తరిస్తున్నది. రైతులు తోటల్లో అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం ఆయిల్పాం సాగుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో ఎక్కువ మంది సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. గతేడాది 35,759 ఎకరాల్లో ఆయిల్పాం సాగు కాగా ఈ ఏడాది అది 48,604 ఎకరాలకు చేరింది.
యాసంగి పంటల ప్రణాళిక రెడీ కాకముందే రాష్ట్రప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేసింది. అదునుకు ముందే సొమ్ము చేతికి రావడంతో రైతులు యాసంగి సాగు పనుల్లో బిజీ అయ్యారు. జిల్లావ్యాప్తంగా 1,34,370 మందికి రైతుల ఖాతాల్లో రూ.204 కోట్లు మంజూరైంది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సర్కార్ రైతుల ఖాతాల్లో రూ.1726.86 కోట్లు జమ చేసింది.
నేను మూడెకరాల్లో ఆయిల్పాం సాగు చేస్తున్నా. సాగుకు సర్కార్ ప్రోత్సాహకాలు అందిస్తున్నది. గెలలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నది. మా ప్రాంతానికి సమీపంలో అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ఉన్నది. రైతులు పండించిన గెలలను ఆ ఫ్యాక్టరీకే తరలిస్తున్నారు. ఆయిల్పాం తోటల్లో అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉన్నది.
– చిన్నం రామకృష్ణ, రైతు, సీతాయిగూడెం, చండ్రుగొండ మండలం
మా ప్రాంతంలో వరి యాసంగి నాట్లు ప్రారంభించాం. వానకాలం పండించిన ధాన్యాన్ని మంచి లాభాలకు విక్రయించాం. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుండడం కలిసి వచ్చింది. ధాన్యం సేకరించిన కొద్దిరోజుల్లోనే సర్కార్ రైతుల బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. యాసంగి సీజన్ ప్రారంభం కాకముందే ఖాతాల్లో రైతుబంధూ వేసింది. రైతులందరూ దర్జాగా సాగుకు సిద్ధమయ్యారు. వ్యవసాయశాఖ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు పంటలను ఆశించే తెగుళ్ల నివారణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు.
– జడ వెంకయ్య, రైతు, దామరచర్ల, చండ్రుగొండ మండలం
రైతులు ఇప్పుడిప్పుడే పంటల మార్పిడికి అలవాటు పడుతున్నారు. రెండేళ్లకు ఒకసారైనా తమ భూమిలో కొత్త పంటలు వేస్తే ప్రయోజనం ఉంటుంది. కొత్త పంటల దిగుబడులు అధికంగా వస్తాయి. ఏఈవోలు, ఏవోలు ఏడీఏలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు సలహాలు ఇస్తున్నారు. పంటల లెక్క పక్కా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నాయి. యాసంగిలో రైతులు సాగుచేయనున్న పంటల విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సిద్ధం చేస్తున్నాం.
– కొర్సా అభిమన్యుడు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కొత్తగూడెం