ఇల్లెందు, జూన్ 11 : పెంకు ఫ్యాక్టరీలలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఎండలకు మగ్గిపోతూ12 గంటలపాటు కష్టపడి పనిచేసినా వారికి అందే వేతనం రూ.300 నుంచి రూ.350 మాత్రమే. చాలా కాలంగా పనికి తగ్గ వేతనం అందించాలని డిమాండ్ చేస్తున్నా పెంకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు స్పందించకపోవడంతో నాలుగు రోజుల నుంచి సమ్మెబాట పట్టారు. ఇల్లెందు, బయ్యారం మండలాల పరిధిలో ఉన్న 11 పెంకు ఫ్యాక్టరీలలో దాదాపు 40 ఏళ్లుగా 128 మంది కార్మికులు పని చేస్తున్నారు.
ఉదయం 6 గంటలకు ఫ్యాక్టరీకి పనికి వచ్చిన కార్మికులు సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తే.. రూ.300 నుంచి రూ.350 వరకు వారికి రోజువారీ వేతనం అందుతుంది. దీంతో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సమ్మె నోటీసులు సైతం ఇచ్చారు. అయినా యాజమాన్యాలు స్పందించకపోవడంతో తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీల సహకారంతో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పెంకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయి. యంత్రాలు వచ్చిన తర్వాత కార్మికులకు పని తక్కువైందనే అంశాన్ని సాకుగా చూపి వారి చేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి. వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా.. యాజమాన్యాలు మాత్రం లాభాలు గడిస్తున్నాయి. నాలుగు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యాలు స్పందించడం లేదు. వెంటనే యాజమాన్యాలు చర్చలు జరిపి, వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలి. లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం.
-అశోక్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. వేతనాల పెంపు కోసం కార్మికులు చేస్తున్న సమ్మెలో న్యాయం ఉంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. యాజమాన్యాలు మొండి వైఖరి వీడి కార్మికుల గురించి ఆలోచించాలి. వెంటనే యాజమాన్యాలు కార్మికులను చర్చలకు పిలిచి, ఆమోదయోగ్యంగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.
-గుగులోత్ గణేశ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు
ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన వైబాగు శ్రీను 30 ఏళ్లుగా పెంకు ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా అతడికి పనికి తగ్గ వేతనం లభించడం లేదు. పొద్దంతా పనిచేసినా వచ్చే జీతంలో కుటుంబ పోషణ భారంగా మారింది. పెరుగుతున్న ధరల ప్రకారం వేతనాలు పెంచాలని గతంలో యాజమాన్యాన్ని కోరినా స్పందించలేదు. పనికి తగ్గట్టుగా రూ.600 చొప్పున వేతనం చెల్లించాలని శ్రీను డిమాండ్ చేశారు.