వేంసూరు, ఫిబ్రవరి 26: తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సీపీఐ అనుబంధ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో సోమవారం వేంసూరులో ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు దండు ఆదినారాయణ మాట్లాడుతూ..
మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు గాను సుమారు 15 పంచాయతీల్లో మంచినీటి సమస్య ఉందని అన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లవాసులు నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.