ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
పోటీకి సై అంటున్న టీఆర్ఎస్
ముమ్మరంగా గులాబీ నేతల ప్రచారం
నియోజకవర్గాల్లో జోరుగా సమావేశాలు
ఖమ్మం, నవంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. బరిలో నిలిచిందెవరో తేలింది.. ఇక ప్రచార పర్వం మొదలుకానున్నది. అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలవుతున్నారు. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచి పోటీకి సై అంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ చాంబర్ తరఫున జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా సుధారాణి నామినేషన్లు దాఖలు చేశారు. గడువు ముగిసే నాటికి వీరెవరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే గులాబీ శ్రేణులు ప్రచారంలో దూసుకెళ్తుండగా.. ప్రత్యర్థులు తర్జనభర్జన అవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్కే మద్దతు
తెలుపుతుండడంతో ఆ పార్టీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ శుక్రవారంతో పూర్తయింది. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా, గులాబీ నేతలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో జోరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
వార్ వన్ సైడే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికేదైనా గులాబీ శ్రేణులే పై చేయి సాధిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. తాజాగా ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచినా.. టీఆర్ఎస్ విజయం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. ఈ జిలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ గెలుపు నల్లేరు మీద నడకేనని విశ్లేషిస్తున్నారు. తాతా మధు గెలుపు కోసం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మధు గెలుపు ఖాయమే అయినా మెజార్టీయే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఖమ్మం, మధిర కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, టీఆర్ఎస్ శాసనసభ్యులు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు ఎన్నికపై పూర్తిస్థాయి దృష్టిసారించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీర్కు కానుకగా ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్తోపాటు ఇతర అభ్యర్థులు వ్యూహాలకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రతివ్యూహాలను రచిస్తూ గెలుపు దిశగా దూసుకెళ్తున్నది.