Agriculture | వారిద్దరూ కవలలు. పుట్టింది పల్లెటూరు.. చదివింది బీటెక్.. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. రూ. లక్షల్లో జీతం.. అయినా అక్కడ ఇమడలేకపోయారు.. కరోనా సమయంలో ఇంటికి చేరుకున్నారు.. తండ్రి చేస్తున్న వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు.. తమ సొంత పొలం వైపు వెళ్లిన వారు నేలతల్లి ప్రేమలో పడ్డారు.. చిన్ననాటి నుంచి మట్టితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకున్నారు.. అప్పుడే నిర్ణయించుకున్నారు.. ఉద్యోగాలు వదిలేశారు.. వ్యవసాయం వైపు అడుగులు వేశారు.. అయితే ఇటు ప్రకృతిని, అటు మనిషిని సర్వనాశనం చేస్తున్న రసాయనాలపై కోపం వచ్చింది.. ఆర్గానిక్ వ్యవసాయమే లక్ష్యంగా ముందుకు కదిలారు.. వ్యవసాయ ఉద్యమకారులు విజయ్రామ్, జగ్గీవాసుదేవ్ సద్గురు సేవ్ సాయిల్ ప్రోగ్రామ్ల ద్వారా ‘ప్రకృతి వ్యవసాయం’పై పట్టు సాధించారు. మొదటి సంవత్సరమే 15 ఎకరాల్లో చెలక సేద్యం పేరుతో ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసి లాభాలు గడించారు.. ఓ వైపు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మరోవైపు డబ్బులు సంపాదిస్తున్న ఈ అన్నదమ్ముల విజయగాథ ఓ సారి లుక్కేద్దాం రండి.
టేకులపల్లి, మార్చి 12 : టేకులపల్లి మండలంలోని చింతోనిచెలక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కంభంపాటి చంద్రశేఖర్రావు- విజయ దంపతుల కుమారులు కంభంపాటి నరేశ్, నవీన్. వీరిద్దరూ కవలలు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో చిన్నతనం నుంచి తండ్రి చేస్తున్న పనుల్లో సాయం చేస్తూ వచ్చారు. కాలక్రమేన పెద్ద చదువులు చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఈక్రమంలో కరోనా ప్రభావం వల్ల లాక్డౌన్ ఏర్పాటు చేయడంతో ఇంటికి చేరుకున్నారు. తండ్రితోపాటు పొలానికి వెళ్తూ వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. మనిషి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గుటకు కారణం రసాయనాలతో కూడిన పదార్థాలని తెలుసుకున్న సోదరులు రసాయనరహిత పంటలను సాగుపై దృష్టి పెట్టారు. భవిష్యత్ తరాల రైతులకు ఆదర్శంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ఉద్యోగం వదిలి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు.
విజయ్రామ్, జగ్గీవాసుదేవ్ సద్గురు సేవ్ సాయిల్ ప్రోగ్రాంలకు సోదరులిద్దరూ ఆకర్శితులయ్యారు. భవిష్యత్తరాలకు మంచి భూమిని అందించేందుకు రసాయనరహిత సేద్యం చేయాలని తెలుసుకున్నారు. ప్రకృతి వనరులతో ఆర్గానిక్ వ్యవసాయం చేసేందుకు నిశ్చయించుకున్నారు. హైదరాబాద్లో జరిగే ప్రోగ్రాంలకు హాజరవుతూ ఆర్గానిక్ వ్యవసాయంపై పూర్తిగా పట్టు సాధించారు.
ప్రకృతి వ్యవసాయంలో భాగంగా గత వానకాలంలో ఐదెకరాల్లో వరి, రెండున్నర ఎకరాల్లో కూరగాయలు, ఎకరంలో మిర్చి సాగు చేశారు. పంట ప్రారంభం నుంచే పశువుల వ్యర్థాలనే ప్రధాన ఎరువులుగా వినియోగించారు. పంచగవ్య, జీవామృతం, బ్రహ్మస్ర్తం వంటి ఆర్గానిక్ ఎరువులను పిచికారీ చేశారు. దీంతో రూపాయి ఖర్చు లేకుండా అధిక దిగుబడి సాధించి లాభాలు పొందారు. అదేవిధంగా ప్రస్తుతం యాసంగిలో పుచ్చకాయ, కాకర, గుమ్మడికాయ, దోస పంటలు సాగు చేస్తున్నారు.
వారికి ఉన్న 30 ఎకరాల భూమిలో మొదటి సంవత్సరం 15 ఎకరాల్లో చెలక-సేద్యం అనే పేరుతో ఆర్గానిక్ వ్యవసాయం చేశారు. గత వానకాలం మూడు ఎకరాల్లో కాకర, బెండ, బీరకాయ, సొరకాయ, కొత్తిమీర, క్యారెట్ వంటి కూరగాయలు పండించారు. వాటిని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో 240మందికి సరఫరా చేసి ప్రతినెలా రూ.35 వేలు సంపాదిస్తున్నారు. ఐదెకరాల వరి సాగులో రెండున్నర ఎకరాల్లో బ్లాక్ రైస్, రెండున్నర ఎకరాల్లో కుంకుమపువ్వు రైస్ సాగు చేశారు. సహజ వనరులైన జీవామృతం, ఘన జీవామృతం, బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, పశువుల వ్యర్థాలతో తయారు చేసిన మందులను మాత్రమే పిచికారీ చేసి మంచి దిగుబడి సాధించారు. బ్లాక్ రైస్ ఎకరాకు 20 బస్తాల చొప్పున 50బస్తాలు పండాయి. వాటిని బియ్యం పట్టించి ఆసక్తి గల వారికి విక్రయించారు. బ్లాక్ రైస్ 25కిలోల బ్యాగ్ను రూ.2500, కుంకుమపువ్వు రైస్ 25కిలోల బ్యాగ్ను రూ.1800 చొప్పున విక్రయించారు. వరి పంటతో లాభం రూ.2 లక్షలు వచ్చింది. అలాగే లావు మిరప ఎకరాకు 8క్వింటాలు వచ్చాయి. వాటిని కారంపొడి చేయించి కిలో రూ.600 చొప్పున కొంత, మిర్చి కిలో రూ.350 చొప్పున కొంత విక్రయించగా మొత్తం రూ.3 లక్షల లాభం వచ్చింది.
మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. పొలంలోకి వెళ్లినప్పుడు ఎంతో హాయిగా అనిపించేది. కానీ చదువు నిమిత్తం దూరంగా ఉన్నాం.. మంచి ఉద్యోగం సాధిం చాం. అక్కడ సంతృప్తి లేకపోవడంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆర్గానిక్ వ్యవసాయం చేసి భూమిని కాపాడాలని అనుకున్నాం. మా చుట్టుపక్కల రైతులకు ఈ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాం.
– కంభంపాటి నరేశ్
రైతులు పండించిన పంటను ప్రతిఒక్కరూ ఏదో రూపంలో ప్రతిరోజు తింటున్నారు. కానీ ఆ ఆహారంలో హాని కలిగించే రసాయనాలు ఉంటున్నాయి. కృత్రిమ ఎరువులు, పురుగుమందులు వాడడంతో పెట్టుబడి పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారు. దాన్నిచూసి కొంతమంది రైతులనైనా ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఉద్యోగం వదిలి ఆర్గానిక్ వ్యవసాయం వైపునకు వచ్చాము.
-కంభంపాటి నవీన్