ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 1: సీఎం కేసీఆర్ వల్లనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్కు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తోందని అన్నారు. కార్పొరేట్కు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దేందుకే ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని అన్నారు. ఖమ్మం మామిళ్లగూడెంలో రూ.12.49 లక్షలు, శాంతినగర్లో రూ.1.14 కోట్లతో అభివృద్ధి చేసిన పాఠశాలలను మంత్రి అజయ్కుమార్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్యనందించాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,289 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 సర్కారు బడుల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రైవేటు స్కూళ్ల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడులకు వచ్చి చేరేలా అన్ని వసతులనూ కల్పించినట్లు వివరించారు. ఖమ్మం జిల్లాలో 426 స్కూళ్లలో 12 రకాల అంశాలలో మొదటి విడుతలో వసతులు కల్పిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామన్నారు. ఈ విద్యాసంవత్సరంలో 1 నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక విద్యార్థిపైకి తెలంగాణ ప్రభుత్వం రూ.1.25 లక్షలు వెచ్చిస్తున్నట్లు గుర్తుచేశారు. సర్కారు నాణ్యమైన విద్య అందించడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అనంతరం ఈ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు, కిచెన్ షెడ్లు, తరగతి గదులను మంత్రి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి డ్యూయల్ డెస్కులపై కూర్చొని సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా, డీసీసీబీ చైర్మన్లు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, డీఈవో సోమశేఖరశర్మ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, నాయకులు ఆర్జేసీ కృష్ణ, పడగాల నాగరాజు, కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలు..
జిల్లా వ్యాప్తంగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా 8 పాఠశాలలను ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.